
తాజా వార్తలు
బంతిని బట్టే గౌరవం.. శిక్ష: పంత్
ఇంటర్నెట్ డెస్క్: క్రీజులోకి వచ్చినప్పుడు రోహిత్తో కలిసి భాగస్వామ్యం నిర్మించడమే ప్రణాళిక అని టీమ్ఇండియా యువ వికెట్కీపర్, బ్యాట్స్మన్ రిషభ్ పంత్ అన్నాడు. పిచ్ను అర్థం చేసుకున్న తర్వాత తనవైన షాట్లు ఆడాలని నిర్ణయించుకున్నట్టు పేర్కొన్నాడు. ఇంగ్లాండ్తో నాలుగో టెస్టు రెండోరోజు ఆట ముగిశాక అతడు మీడియాతో మాట్లాడాడు.
నాలుగో టెస్టుపై టీమ్ఇండియా పట్టు బిగించిన సంగతి తెలిసిందే. రిషభ్ పంత్ (101; 118 బంతుల్లో 13×4, 2×6) అద్వితీయమైన శతకానికి వాషింగ్టన్ సుందర్ (60 బ్యాటింగ్; 117 బంతుల్లో 8×4) అర్ధశతకం తోడవ్వడంతో భారత్ 7 వికెట్ల నష్టానికి 294 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్లో 89 పరుగుల ఆధిక్యం సాధించింది. తొలుత ఆచితూచి ఆడిన పంత్ అర్ధశతకం తర్వాత ఇంగ్లిష్ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. ముఖ్యంగా అండర్సన్, బెన్స్టోక్స్ బౌలింగ్లో వరుస బౌండరీలు బాదాడు.
‘బౌలర్లు మంచి బంతులేస్తే గౌరవించి సింగిల్స్ తీయాలని అనుకున్నాను. పరిస్థితులకు తగ్గట్టు ఆడాలనుకున్నా. బంతిని చూసి స్పందించాలన్నది నా లక్ష్యం. 206 పరుగులు చేయడం జట్టు తొలి లక్ష్యం. ఆ తర్వాత వీలైనన్ని పరుగులు సాధించడం. రివర్స్ ఫ్లిక్స్ ఆడాలంటే సాధన చేయాల్సిందే. అదృష్టం మనవైపుంటే ఇంకా బాగుంటుంది. చాలాసార్లు స్వేచ్ఛగా షాట్లు ఆడేందుకు అనుమతి లభిస్తుంది. అయితే నేను పరిస్థితులను గ్రహించి ముందుకు సాగాల్సి ఉంటుంది. జట్టును విజయాల బాటలో నడిపించేలా చేయడమే నా లక్ష్యం. దాంతో అభిమానుల్ని రంజింపచేస్తే అదే ఆనందం’ అని పంత్ అన్నాడు.