మైనారిటీ విద్యార్థినులకు ఉపకారం

అల్పాదాయ వర్గాల అభివృద్ధికి ఆర్థిక పరిస్థితులే పెద్ద అడ్డుగోడలు. చదువుకోవాలనే ఆసక్తి, ప్రతిభ ఉన్నప్పటికీ అడుగు ముందుకు వేయలేరు. ముఖ్యంగా బాలికలు ఇలాంటి సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటున్నారు.  ఈ నేపథ్యంలో తొమ్మిది, పది, ఇంటర్‌ మొదటి, రెండో సంవత్సరం...

Published : 16 Jul 2019 01:15 IST

అల్పాదాయ వర్గాల అభివృద్ధికి ఆర్థిక పరిస్థితులే పెద్ద అడ్డుగోడలు. చదువుకోవాలనే ఆసక్తి, ప్రతిభ ఉన్నప్పటికీ అడుగు ముందుకు వేయలేరు. ముఖ్యంగా బాలికలు ఇలాంటి సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటున్నారు.  ఈ నేపథ్యంలో తొమ్మిది, పది, ఇంటర్‌ మొదటి, రెండో సంవత్సరం తరగతుల్లో ఉన్న మైనారిటీ వర్గాల విద్యార్థినులను ఆదుకోడానికి ప్రభుత్వం స్కాలర్‌షిప్‌ను అందిస్తోంది. మొదట ఆదాయ పరిస్థితులను, తర్వాత మెరిట్‌ను పరిగణనలోకి తీసుకొని ఎంపిక చేస్తోంది.

మైనారిటీ వర్గాల్లోని ప్రతిభావంతులైన పేద బాలికలను ఉన్నత చదువులకు ప్రోత్సహించే లక్ష్యంతో బేగం హజ్రత్‌ మహల్‌ నేషనల్‌ స్కాలర్‌షిప్‌ను ప్రభుత్వం ఏటా అందిస్తోంది. వారి విద్యాభివృద్ధికి ఆర్థిక స్థోమత అడ్డంకి కాకూడదనే దీన్ని ఏర్పాటు చేశారు. ఈ నేషనల్‌ స్కాలర్‌షిప్‌కు నోటిఫికేషన్‌ విడుదలైంది. దిల్లీలోని మౌలానా ఆజాద్‌ ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌ దీన్ని అందిస్తోంది. ఇది మైనారిటీ మంత్రిత్వ శాఖ అధీనంలో ఉంటుంది.

స్కూలు లేదా కాలేజీ ఫీజులు చెల్లించడానికి, కోర్సుకి సంబంధించిన పుస్తకాలు లేదా స్టేషనరీ కొనుక్కోడానికి, కనీస తిండి అవసరాలను తీర్చుకోడానికి సాయపడాలనే లక్ష్యంతో ఈ స్కాలర్‌షిప్‌ను అందజేస్తున్నారు.

స్కాలర్‌షిప్‌ వివరాలు
తొమ్మిది, పది తరగతులు చదువుతున్న విద్యార్థినులకు నెలకు రూ. అయిదు వేలు, ఇంటర్మీడియట్‌ వారికి నెలకు రూ. ఆరువేల చొప్పున స్కాలర్‌షిప్‌ ఇస్తారు. డబ్బు ప్రతి నెలా నేరుగా అభ్యర్థుల ఖాతాలో జమ అవుతుంది. స్కాలర్‌షిప్‌ పొందినవాళ్లు ఏదైనా కారణంతో చదువును మధ్యలో ఆపేస్తే వారి ఉపకారవేతనం రద్దవుతుంది.

దీని కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అప్లై చేసిన తర్వాత ప్రింట్‌ అవుట్‌ తీసుకొని పోస్టులో పంపాలి.  దరఖాస్తుకు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏవైనా ఉపకారవేతనాలు పొందుతున్న వారు దీనికి అనర్హులు. మొత్తం స్కాలర్‌షిప్‌లను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఆయా మతాల జనాభా ప్రాతిపదికన అందిస్తారు. ఇందుకు 2011 జనాభా లెక్కలను ఆధారం చేసుకుంటారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరితేది: సెప్టెంబరు 15
ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రింట్‌-అవుట్‌ను పంపేందుకు చివరితేది: సెప్టెంబరు 30. పూర్తి వివరాలను http://maef.nic.in/ లో చూడవచ్చు.

ఎవరు అర్హులు?

దేశవ్యాప్తంగా తొమ్మిది నుంచి పన్నెండో తరగతి వరకు చదువుతున్న విద్యార్థినులందరూ ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు మైనారిటీ వర్గాల్లోని ముస్లిం, క్రైస్తవ, సిక్కు, బౌద్ధ, పార్సీ, జైన మతాలకు చెంది ఉండాలి. వారి కుటుంబ వార్షిక ఆదాయం రూ. రెండు లక్షలకు మించకూడదు. ముందు తరగతుల్లో కనీసం 50 శాతం మార్కులు పొంది ఉండాలి. అంటే ఉదాహరణకు తొమ్మిదో తరగతి విద్యార్థిని స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకుంటే, ఆమె ఎనిమిదో తరగతి మార్కులను ఆధారం చేసుకుంటారు.
ఎంపిక: మొదట తక్కువ వార్షిక ఆదాయం ఉన్న అభ్యర్థులను పరిశీలిస్తారు. ఎంపికలో రెండో ప్రాతిపదికగా మెరిట్‌ను తీసుకుంటారు.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని