ముమ్మర పోరుకు మరోమారు!

దశాబ్దాలుగా రగిలిన ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష దశల వారీగా బలపడింది. అందుకోసం సభలు, సదస్సులు జరిగాయి. వాటిలో  రాజకీయ నేతలు, ఉద్యమకారులు, విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

Published : 30 Oct 2022 02:39 IST

తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం

దశాబ్దాలుగా రగిలిన ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష దశల వారీగా బలపడింది. అందుకోసం సభలు, సదస్సులు జరిగాయి. వాటిలో  రాజకీయ నేతలు, ఉద్యమకారులు, విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొన్నారు. నాటి ప్రభుత్వ విధానాలను నిరసించారు. నినాదాలతో హోరెత్తించారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై పుస్తకాలు ప్రచురించారు.  ఎందరో నాయకులు ఎన్నో రకాల సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నాలు చేశారు. పోరాటాలను తీవ్రస్థాయికి చేర్చి మలిదశ ఉద్యమానికి గట్టి పునాదులు వేశారు.  ముమ్మర పోరుకు మరోసారి అందరూ ఏకమై కదిలారు.

మలిదశ ఉద్యమంలో మైలురాళ్లు

జై తెలంగాణ ఉద్యమం-1969 తర్వాత అంతర్లీనంగా కొనసాగుతున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష 1996 నుంచి మరింత బలపడింది. ఆ దశలో అనేక భారీ బహిరంగ సభలు, సదస్సుల ద్వారా ప్రజా ఉద్యమానికి బాటలు వేసే ప్రయత్నాలు జరిగాయి. అందులో భాగంగా నాటి ప్రభుత్వం అనుసరించిన విధానాలను నిరసించారు. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణల వల్ల తమ విద్యా, ఉపాధి అవకాశాలు సన్నగిల్లుతాయనే ఆందోళన కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన వైపు ప్రజానీకం సాగడానికి మరో ప్రధాన కారణంగా నిలిచింది. ఫలితంగా 1996 నుంచి మలిదశ తెలంగాణ ఉద్యమం ప్రజా పోరాటంగా రూపుదిద్దుకుంది. ఇందులో ఉస్మానియా యూనివర్సిటీ అధ్యాపకులు, విద్యార్థులు, ఇతర మేధావులు, సామాజికవేత్తలు, పాత్రికేయులు, వామపక్ష భావజాలం ఉన్న ఉద్యమకారులు భాగస్వాములయ్యారు. ఈ క్రమంలో 1997లో జరిగిన ఫోరం ఫర్‌ ఫ్రీడమ్‌ ఆఫ్‌ ఎక్స్‌ప్రెషన్‌ సదస్సు, భువనగిరి సభ, సూర్యాపేట తెలంగాణ మహాసభ, వరంగల్‌ డిక్లరేషన్‌, 1998 నాటి తెలంగాణ జనసభ మొదలైనవన్నీ భౌగోళిక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే కాకుండా ప్రజాస్వామిక, సామాజిక తెలంగాణను సాధించాలని నినదించాయి. మలిదశ తెలంగాణ ప్రజా ఉద్యమాలకు దారులు వేశాయి.

అశోక టాకీస్‌ సదస్సు (1997, జనవరి19)

ఇది మలిదశ తెలంగాణ ఉద్యమ కాలంలో హైదరాబాద్‌లో జరిగిన తొలి తెలంగాణ ఆత్మగౌరవ సభ. 1997, జనవరి 19న హైదరాబాద్‌ మొజంజాహీ మార్కెట్‌లోని అశోక టాకీస్‌లో తెలంగాణ సంస్కృతి - వివక్షలపై ఈ సదస్సును సుదీర్ఘంగా నిర్వహించారు. తెలంగాణ పాత్రికేయుడు గులాం రసూల్‌ఖాన్‌ పోలీసుల కాల్పుల్లో మృతి చెందడాన్ని ఖండిస్తూ ప్రముఖ పాత్రికేయుడు పాశం యాదగిరి ఆధ్వర్యంలో ‘ఫోరం ఫర్‌ ఫ్రీడం ఆఫ్‌ ఎక్స్‌ప్రెషన్‌’ పేరుతో ఈ సదస్సు జరిగింది. గులాం రసూల్‌ స్మారకార్థం ప్రతి ఏడాది సభ నిర్వహించాలనే ఉద్దేశంతో తెలంగాణ పాత్రికేయులు ఫోరం ఫర్‌ ఫ్రీడం ఆఫ్‌ ఎక్స్‌ప్రెషన్‌ సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. విభిన్న భావాలు కలిగిన రాజకీయ నాయకులు, పాత్రికేయులు, కవులు, కళాకారులు, అధ్యాపకులు, విద్యార్థులు, పలు రంగాలకు చెందిన మేధావులు ఈ వేదిక ద్వారా తెలంగాణ  వాదాన్ని వినిపించారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై మలిదశ ఉద్యమంలో వెలువడిన రెండు ముఖ్యమైన పుస్తకాలను ఈ సదస్సులోనే ఆవిష్కరించారు. అందులో ఒకటి గాదె ఇన్నయ్య వివిధ ప్రభుత్వ శాఖల నుంచి సేకరించిన అధికారిక గణాంకాలతో ముద్రించిన ‘దగాపడ్డ తెలంగాణ’. రెండోది 1997 - 2000 మధ్య కాలంలో వేల మందిని ప్రభావితం చేసిన ఆచార్య జయశంకర్‌ రచించిన ‘తెలంగాణలో ఏం జరుగుతోంది’ అనే పుస్తకం. ఈ సదస్సులోనే తొలిసారిగా ప్రజా గాయకుడు గద్దర్‌ ‘అమ్మా తెలంగాణమా - ఆకలి కేకల గానమా’ అనే పాట పాడి తెలంగాణ సాంస్కృతిక ఉద్యమానికి నాంది పలికారు. మలిదశ ఉద్యమంలో ఆ పాట బహుళ జనాదరణ పొందింది. ఈ సమావేశంలోనే 1997, మార్చి 8, 9 తేదీల్లో భువనగిరి సభ నిర్వహించాలని నిర్ణయించారు. అశోక టాకీస్‌ సదస్సును మలిదశ ఉద్యమానికి మలుపుగా పేర్కొంటారు.

భువనగిరి సభ  (1997, మార్చి 8, 9)

1997, మార్చి 8న భువనగిరి మిషన్‌ హైస్కూల్‌ ప్రాంగణంలో తెలంగాణ మేధావులు ‘దగాపడ్డ తెలంగాణ’ అనే బ్యానర్‌తో సదస్సు నిర్వహించారు. ఈ ప్రాంగణానికి ‘తెలంగాణ నిజాం వ్యతిరేక పోరాట అమర  వీరుల ప్రాంగణం’ అని పేరు పెట్టారు. సుదీర్ఘంగా సాగిన ఈ సభకు కవులు, కళాకారులు, పాత్రికేయులు, అధ్యాపకులు, విద్యార్థులు హాజరయ్యారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌, ప్రొఫెసర్‌ కేశవరావు జాదవ్‌, కాళోజీ నారాయణరావు, పి.ఎల్‌.విశ్వేశ్వరరావు, గాదె ఇన్నయ్య, గద్దర్‌, కె.శ్రీనివాస్‌, నందిని సిధారెడ్డి లాంటి ప్రముఖులు హాజరయ్యారు. తెలంగాణకు వివిధ రంగాల్లో జరుగుతున్న అన్యాయాలపై రంగాలవారీగా పరిశోధనా పత్రాలు (వ్యాసాలను) సమర్పించి చర్చించారు. సదస్సుకు ఉస్మానియా వర్సిటీ జర్నలిజం ప్రొఫెసర్‌ పి.ఎల్‌.విశ్వేశ్వరరావు అధ్యక్షత వహించగా కాళోజీ నారాయణరావు ప్రారంభోపన్యాసం చేశారు. తెలంగాణకు జరిగే అన్యాయాలను ప్రశ్నిస్తున్న వారిని పాలకులు అణచివేస్తున్నారని ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రొఫెసర్‌ జయశంకర్‌ విద్య, ఉద్యోగ, వైద్య రంగాల్లో; గాదె ఇన్నయ్య సాగునీరు, విద్యుత్తు రంగాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను గణాంకాలు సహా వివరించారు. తెలంగాణ వనరులు, పరిశ్రమలు, పారిశ్రామిక కాలుష్యం అంశాలపై ప్రొఫెసర్‌ కేశవరావు జాదవ్‌ ప్రసంగించారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను ప్రజలకు వివరించడానికి జిల్లాల వారీగా బృందాలను ఏర్పాటు చేసి గజ్జెకట్టి పాటలతో వివరిస్తానని గద్దర్‌ ప్రకటించారు. పీపుల్స్‌వార్‌ గ్రూప్‌ మాజీ నక్సలైట్‌ నాయకుడు కె.జి.సత్యమూర్తి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌పై మాట్లాడారు. పాశం యాదగిరి, మందాడి సత్యనారాయణరెడ్డి తదితరులు తెలంగాణలో కరెంటు కష్టాలు, విద్య, ఉద్యోగ రంగాల్లో జరుగుతున్న అన్యాయాలను వివరించారు.

1997, మార్చి 9న సాయంత్రం భువనగిరి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు తెలంగాణ రైతుల సాయుధ పోరాటంలో క్రియాశీలకంగా పాల్గొన్న భువనగిరి వాసి, స్వాతంత్య్ర సమరయోధుడు జైని మల్లయ్య గుప్త అధ్యక్షత వహించారు. గొల్ల కురుమ, డోలు దెబ్బ నాయకురాలు బెల్లి లలిత తన పాటలతో సభను ఉర్రూతలూగించారు (ఆ తర్వాత కొంత కాలానికి ఆమె దారుణ హత్యకు గురయ్యారు). భువనగిరి సభలో గాదె ఇన్నయ్య ప్రతిపాదించిన పలు డిమాండ్లతో తీర్మానం ఆమోదం పొందింది. భువనగిరి సభ తర్వాత 1997, ఏప్రిల్‌ 6న గద్దర్‌పై హత్యాయత్నం జరిగింది. దాన్ని తెలంగాణవాదంపై జరిగిన దాడిగా తెలంగాణవాదులు పేర్కొన్నారు.

సూర్యాపేట మహాసభ  (1997, ఆగస్టు 11)

దీన్నే తెలంగాణ మహాసభ అంటారు. నాటి నల్గొండ జిల్లా (నేటి సూర్యాపేట జిల్లా) సూర్యాపేటలో 1997, ఆగస్టు 11న జరిగింది. ఈ సభ ప్రధాన లక్ష్యం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను ప్రభుత్వానికి, ప్రజలకు తెలియజేయడం. దీన్ని నిర్వహించడంలో పరోక్షంగా ప్రధాన పాత్ర వహించినవారు మారోజు వీరన్న. జనశక్తి పార్టీ నుంచి  బయటికి వచ్చిన వీరన్న భారత సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్టు పార్టీని ్బదిశిగీళీఖిలీల్శి స్థాపించారు. ఈయన అజ్ఞాతంలో ఉండటంతో సూర్యాపేట మహాసభకు అధికారికంగా చెరుకు సుధాకర్‌ అధ్యక్షత వహించారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌, నారం కృష్ణారావు (రిటైర్డ్‌ చీఫ్‌ ఇంజినీర్‌), ప్రొఫెసర్‌ బియ్యాల జనార్దనరావు, కంచె ఐలయ్య, గాదె ఇన్నయ్య (తెలంగాణ రాష్ట్ర పోరాట సమితి నాయకుడు), రాపోలు ఆనంద భాస్కర్‌ (తెలంగాణ ప్రగతి వేదిక అధ్యక్షుడు), పాశం యాదగిరి, మల్లేపల్లి లక్ష్మయ్య తదితరులు ప్రసంగించారు. తెలంగాణ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు, ఉద్యమకారులు హాజరయ్యారు. ఈ సభలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి 16 డిమాండ్లతో ఒక తీర్మానాన్ని ఆమోదించారు. ‘తెలంగాణ మహాసభ’ మాస పత్రికను ఆవిష్కరించారు.

వరంగల్‌ డిక్లరేషన్‌  (1997, డిసెంబరు 28, 29)

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని హనుమకొండ ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ ఆవరణలో ‘ప్రజాస్వామిక తెలంగాణ - ప్రజల ఆకాంక్ష’ పేరుతో మహాసభ జరిగింది. ప్రాంతీయ అసమానతలకు వ్యతిరేకంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను ఒక డిక్లరేషన్‌ ద్వారా ప్రకటించారు. సభను అఖిల భారత ప్రజా ప్రతిఘటన వేదిక (ఆలిండియా పీపుల్స్‌ రెసిస్టెన్స్‌ ఫోరమ్‌ - ఏఐపీఆర్‌ఎఫ్‌) ఆధ్వర్యంలో కాకతీయ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ సాయిబాబా నిర్వహించారు. ఈ సంస్థకు, ప్రొఫెసర్‌ సాయిబాబాకు పీపుల్స్‌వార్‌ గ్రూప్‌తో సంబంధాలు ఉన్నాయని పేర్కొంటూ నాటి రాష్ట్ర ప్రభుత్వం సభ ఏర్పాటుకు అనుమతి నిరాకరించింది. నిర్వాహకులు హైకోర్టు నుంచి అనుమతి పొంది సభను నిర్వహించారు. అనేక నిర్బంధాల మధ్య ఈ బహిరంగ సభ జరిగింది. ప్రొఫెసర్‌ సాయిబాబా అధ్యక్షత వహించారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌, కాళోజీ నారాయణరావు, గద్దర్‌, కన్నాబీరన్‌, వరవరరావు, ప్రొఫెసర్‌ బియ్యాల జనార్దన్‌రావు ప్రసంగించారు. ఈ సభ 50 డిమాండ్లతో వరంగల్‌ డిక్లరేషన్‌ను ప్రకటించింది.

తెలంగాణ జనసభ  (1998, జులై 5, 6)

ఈ సభను హైదరాబాద్‌ అంబర్‌పేటలో ఉన్న మహారాణా ప్రతాప్‌ హాలులో   నిర్వహించారు. వరంగల్‌ డిక్లరేషన్‌ సభకు వచ్చిన ప్రముఖులంతా (ప్రొఫెసర్‌ సాయిబాబా మినహాయించి) హాజరయ్యారు. మహ్మద్‌ఖాన్‌ అధ్యక్షత వహించారు. ఈ   సభ నినాదం ‘ప్రజాస్వామిక తెలంగాణ’. ఈ సభలో తెలంగాణ సంక్షిప్త చరిత్ర - ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు - పెద్ద మనుషుల ఒప్పందం - దాని ఉల్లంఘనలు, 1968-69 తెలంగాణ ఉద్యమం - ఆరు సూత్రాల పథకం - తెలంగాణ వనరుల దోపిడీ లాంటి అంశాలపై వక్తలు ప్రసంగించారు. ఈ సమావేశానికి నాటి జమ్మూ-కశ్మీర్‌ రాష్ట్రానికి చెందిన ఆల్‌పార్టీ హురియత్‌ నాయకుడు యాసిన్‌ మాలిక్‌ హాజరయ్యారు. ఈ సభలోనే కాళోజీ నారాయణరావు ‘జన తెలంగాణ’ మాస పత్రికను ఆవిష్కరించారు. దీని సంపాదకుడు ఆకుల భూమయ్య. సభాముఖంగా క్విట్‌ తెలంగాణ అనే నినాదాన్ని ప్రకటించి, ఆ పేరు మీదనే ఉద్యమం సాగించాలని కాళోజీ ప్రకటించారు. ఆ తర్వాత ఈ సభ నిర్వాహకులు తెలంగాణ జిల్లాల్లో కూడా తెలంగాణ జనసభ సమావేశాలు జరిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని