TS EAMCET: తెలంగాణ ఎంసెట్‌లో ఇంటర్‌ మార్కుల వెయిటేజీ రద్దు

తెలంగాణ ఎంసెట్‌లో ఈసారి నుంచి ఇంటర్‌ మార్కులకు 25 శాతం వెయిటేజీని శాశ్వతంగా రద్దు చేస్తూ విద్యాశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి ఎంసెట్‌లో వచ్చిన మార్కులతోనే ర్యాంకు కేటాయించనున్నారు.

Updated : 20 Apr 2023 06:55 IST

ఈసారి నుంచి శాశ్వతంగా తొలగింపు
ఎంసెట్‌ మార్కులతోనే ర్యాంకు
జీఓ జారీ చేసిన ప్రభుత్వం

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ఎంసెట్‌లో ఈసారి నుంచి ఇంటర్‌ మార్కులకు 25 శాతం వెయిటేజీని శాశ్వతంగా రద్దు చేస్తూ విద్యాశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి ఎంసెట్‌లో వచ్చిన మార్కులతోనే ర్యాంకు కేటాయించనున్నారు. ఇప్పటివరకు ఎంసెట్‌ మార్కులకు 75 శాతం వెయిటేజీ, ఇంటర్‌లోని భాషేతర సబ్జెక్టులకు ...అంటే 600 మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి ర్యాంకు కేటాయించేవారు. ఇక నుంచి ఇంటర్‌ మార్కులతో సంబంధం లేకుండానే ఎంసెట్‌లో స్కోర్‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు.

జేఈఈ మెయిన్‌, నీట్‌లలోనూ ఇంటర్‌ మార్కులకు వెయిటేజీ ఎత్తివేశారు. ఎంసెట్‌కు పలు బోర్డుల నుంచి విద్యార్థులు హాజరవుతారు. ఆయా బోర్డులు సకాలంలో ఫలితాలను విడుదల చేయకపోవడం, ఎంసెట్‌ అధికారులకు అందజేయకపోవడం వల్ల ఎంసెట్‌ ఫలితాలకు ఆటంకం ఏర్పడుతోంది. ఇలాంటి పలు అంశాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రతిపాదన మేరకు ఇంటర్‌ వెయిటేజీని రద్దు చేసింది. కరోనా కారణంగా 2020, 2021, 2022లలో కూడా ఇంటర్‌ వెయిటేజీని తొలగించారు. ఈసారి దానిని శాశ్వతంగా రద్దు చేస్తూ... గతంలోని జీఓను సవరిస్తూ తాజాగా విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ జీఓ 18ను జారీ చేశారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని