రైతు సంస్థలకు నాబ్‌కిసాన్‌ రుణాలు

బ్యాంకుల నుంచి రుణాల విషయంలో కొన్నేళ్ల కిందట పొదుపు సంఘాలకు ఎదురైన ఇబ్బందులే ఇప్పుడు రైతు ఉత్పత్తి సంస్థలకూ వస్తున్నాయని నాబార్డు ఛైర్మన్‌ జీఆర్‌ చింతల తెలిపారు. ‘అభివృద్ధి కావాలంటే రుణం తీసుకోవడం ముఖ్యం.

Updated : 29 Aug 2021 06:38 IST

సరైన వ్యాపార ప్రణాళికలతో వస్తే రుణాలిస్తాం
సమ్మిళిత వ్యవసాయంతో ప్రయోజనం
నాబార్డు ఛైర్మన్‌ జీఆర్‌ చింతల

ఈనాడు, అమరావతి: బ్యాంకుల నుంచి రుణాల విషయంలో కొన్నేళ్ల కిందట పొదుపు సంఘాలకు ఎదురైన ఇబ్బందులే ఇప్పుడు రైతు ఉత్పత్తి సంస్థలకూ వస్తున్నాయని నాబార్డు ఛైర్మన్‌ జీఆర్‌ చింతల తెలిపారు. ‘అభివృద్ధి కావాలంటే రుణం తీసుకోవడం ముఖ్యం. సరైన వ్యాపార ప్రణాళికలతో వస్తే.. నాబార్డు ఆధ్వర్యంలోని నాబ్‌ కిసాన్‌ ద్వారా ఆర్థిక సాయం అందిస్తాం’ అని ఆయన వివరించారు. వారాహి రైతు ఉత్పత్తి సంస్థ, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ఆధ్వర్యంలో శనివారం విజయవాడలో నిర్వహించిన ఎఫ్‌పీవో డైరెక్టర్ల సమావేశంలో జీఆర్‌ చింతల, నాబ్‌ కిసాన్‌ ఎండీ సుశీల చింతల పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీఆర్‌ చింతల మాట్లాడుతూ.. రైతు ఉత్పత్తి సంస్థలతో ఏర్పాటయ్యే సమాఖ్యలకు ఎలాంటి సాయం అందించాలనే విషయమై ఆలోచనలు చేస్తామని తెలిపారు. ‘మన భూముల్లో సేంద్రియ కర్బన శాతం తక్కువ. ఇలాగే కొనసాగితే నేల చచ్చుబడిపోతుంది. 1960-70లో కిలో యూరియాతో 14 కిలోల ఆహార ధాన్యాల ఉత్పత్తి వస్తే.. ఇప్పుడు కిలో యూరియాకు 1.1 కిలోలే వస్తున్నాయి. ఈ పరిస్థితి మారాలి. సేంద్రియ కర్బనాన్ని పెంచుకోవాలి’ అని జీఆర్‌ చింతల సూచించారు. ‘పల్నాడులాగే ఉండే బుందేల్‌ఖండ్‌లో రైతుల వార్షికాదాయం గతంలో రూ.41వేలు ఉండేది. సమ్మిళిత వ్యవసాయ విధానంతో ఇప్పుడది రూ.3.50-4 లక్షల స్థాయికి పెరిగింది’ అని వివరించారు. రైతు ఉత్పత్తి సంస్థలకు తక్కువ వడ్డీకే రుణం అందిస్తామని నాబ్‌ కిసాన్‌ ఎండీ సుశీల చింతల తెలిపారు. ‘వడ్డీ 9% ఉంటే.. అందులో 3% రాయితీ ఉంటుంది. రైతులకు 6% వడ్డీకే రుణం లభిస్తుంది’ అన్నారు. ‘ఆంధ్రప్రదేశ్‌లో రుణ మంజూరుకు ఎక్కువ అవకాశాలున్నాయి. రైతుల అవసరాలు తెలుసుకుని.. అందుకు అనుగుణంగా వచ్చే ఒకటి, రెండేళ్లలో మరిన్ని సంస్థలకు రుణం అందించేలా కృషి చేస్తాం’ అని పేర్కొన్నారు. ‘ప్రకృతి వ్యవసాయంపై శ్రద్ధ పెరుగుతోంది. విజయవాడలోనే ఇప్పుడు 50 వరకు దుకాణాలు ఏర్పాటయ్యాయి’ అని గో ఆధారిత వ్యవసాయదారుల సంఘం ఛైర్మన్‌ ముత్తవరపు మురళీకృష్ణ చెప్పారు. భారతీయ కిసాన్‌సంఘ్‌ జాతీయ కార్యనిర్వాహక సభ్యుడు కుమారస్వామి, నాబార్డు సీజీఎం సుధీర్‌ కుమార్‌ జన్నావార్‌ మాట్లాడారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని