YSRCP: ఓడిన 24మందికీ పదవులు!

రాష్ట్రంలో నామినేటెడ్‌ పదవుల భర్తీలో ఎవరెవరికి అవకాశం దక్కనుందనే విషయంలో స్పష్టత వచ్చింది. 2019లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో వైకాపా తరఫున పోటీ చేసి ఓడిన 24మందికి నామినేటెడ్‌ పదవుల్లో అవకాశం...

Updated : 12 Jul 2021 07:53 IST

అసెంబ్లీ బరిలో పరాజితులకు అవకాశం
నామినేటెడ్‌ పదవులపై ప్రాథమిక నిర్ణయం?

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో నామినేటెడ్‌ పదవుల భర్తీలో ఎవరెవరికి అవకాశం దక్కనుందనే విషయంలో స్పష్టత వచ్చింది. 2019లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో వైకాపా తరఫున పోటీ చేసి ఓడిన 24మందికి నామినేటెడ్‌ పదవుల్లో అవకాశం దక్కనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. అయితే ఎన్నికల తర్వాత ఈ 24మందిలో కొంతమందిని నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించి వారి స్థానంలో కొత్తవారికి నియోజకవర్గ సమన్వయ బాధ్యతలు అప్పగించారు. అలా మార్చిన నియోజకవర్గాల్లో ఎన్నికల్లో ఓడిన వారికి ఇస్తారా లేక ఇప్పుడు పార్టీ సమన్వయకర్తలుగా ఉన్నవారికి అవకాశం ఇస్తారా అన్న విషయంలో మాత్రం కొంత స్పష్టత రావాల్సి ఉందని వైకాపా వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద 175 నియోజకవర్గాల్లోనూ వైకాపాకు చెందిన వారు ప్రొటోకాల్‌ పదవిలో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారని చెబుతున్నారు. మరోవైపు 2019 ఎన్నికల్లో  చివరి నిమిషంలో రాజకీయ సమీకరణల దృష్ట్యా టికెట్‌ పొందలేకపోయిన వారికీ ఇప్పుడు పదవులు దక్కే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం సుమారు 80 కార్పొరేషన్లకు ఛైర్మన్లు, డైరెక్టర్లను ఇప్పుడు నియమించనున్నారు. ఈ జాబితాను ఆదివారం విడుదల చేయాలని ప్రాథమికంగా నిర్ణయించిన అది కార్యరూపం దాల్చలేదు. కార్పొరేషన్లకు ఛైర్మన్లుగా నియమించే వారి పేర్లను ఈ సారి అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు. 

ఎమ్మెల్సీ అభ్యర్థులుగా...: 2019 ఎన్నికల్లో టికెట్‌ వదులుకున్నవారిలో కొందరికి, అంతకుముందు నుంచీ పార్టీ కోసం పనిచేస్తున్న పలువురికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తామని గతంలోనే సీఎం వైఎస్‌ జగన్‌ హామీఇచ్చారు. ఇలాంటి వారు 30మందికిపైగా ఉన్నట్లు చెబుతున్నారు. వారందరికీ ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించే పరిస్థితి ఇప్పటికిప్పుడైతే లేకపోవడంతో వారిలో కొందరికి నామినేటెడ్‌ పదవులను ఇవ్వనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని