ఒంగోలు.. పసుపువర్ణ శోభితం

తెలుగుదేశం పార్టీ మహానాడు వేడుకలకు ఒంగోలులోని మండువవారిపాలెం వద్ద చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2018 తర్వాత నిర్వహిస్తున్న మహానాడు కావడంతో పార్టీ

Updated : 26 May 2022 05:56 IST

తెలుగుదేశం మహానాడుకు చురుగ్గా ఏర్పాట్లు 

నేడు మంగళగిరి నుంచి చంద్రబాబు భారీ ర్యాలీ

27న పార్టీ ప్రతినిధుల సభ

28న ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలు ప్రారంభం

ఈనాడు డిజిటల్‌, ఒంగోలు: తెలుగుదేశం పార్టీ మహానాడు వేడుకలకు ఒంగోలులోని మండువవారిపాలెం వద్ద చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2018 తర్వాత నిర్వహిస్తున్న మహానాడు కావడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇనుమడించిన ఉత్సాహంతో ఉన్నారు. మొత్తం 83 ఎకరాల్లో సభావేదిక, ప్రాంగణం పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. 20 వరకు భారీ ఎల్‌ఈడీ తెరలు ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణానికి కుడివైపున ఫొటో గ్యాలరీ, రక్తదాన శిబిరం, మీడియా పాయింట్‌, వీఐపీల భోజనాలకు ఏర్పాటు చేశారు. వెనుకవైపు దాదాపు 500కు పైగా వీఐపీల వాహనాలకు పార్కింగ్‌ ఏర్పాటు చేశారు. సభకు హాజరయ్యేవారి భోజనాల కోసం ప్రత్యేకంగా మరో ప్రాంగణం రూపుదిద్దుకుంది. పార్టీ అధినేత చంద్రబాబు, లోకేశ్‌ చిత్రాలతో 20 భారీ స్థాయి పసుపు రంగు బెలూన్లు ఎగరవేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారి వాహనాలకు 53 ఎకరాల్లో ప్రత్యేక పార్కింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పార్లమెంటు నియోజకవర్గానికి ఒకటి చొప్పున 25 సభ్యత్వ నమోదు కౌంటర్లు ఆకర్షణీయంగా రూపొందించారు. ఎండలను దృష్టిలో ఉంచుకుని కూలర్లు.. ప్రముఖులు, ప్రత్యేక ఆహ్వానితుల కోసం వేర్వేరుగా గ్యాలరీలు, కుర్చీలు ఏర్పాటుచేశారు. బుధవారం సాయంత్రం మహానాడు ప్రాంగణానికి వచ్చిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఏర్పాట్లను పరిశీలించి సూచనలు చేశారు. నలభయ్యేళ్ల తెలుగుదేశం చరిత్ర.. ఎన్టీఆర్‌, చంద్రబాబు నాయుడులకు సంబంధించిన అంశాలు ప్రతి ఒక్కరికీ కనిపించేలా గ్యాలరీ ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రజలకు ఎక్కడ ఎలాంటి సమస్య వచ్చినా తెలుగుదేశం వెంటనే ఆదుకుందని తెలిపారు. ఇది తెలుగు ప్రజలందరి పార్టీ అని.. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ప్రజలు మహానాడుకు వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బుధవారం రాత్రి మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, శాసనసభ్యుడు అనగాని సత్యప్రసాద్‌ వచ్చి ఏర్పాట్లను పరిశీలించారు.

ఇవీ కార్యక్రమాలు..
గురువారం ఒంగోలులో తెదేపా పొలిట్‌బ్యూరో సమావేశం జరగనుంది. ఉదయం మంగళగిరి నుంచి చంద్రబాబు ఒంగోలుకు బయలుదేరనున్నారు. ఈ సందర్భంగా అక్కడి పార్టీ కార్యాలయం నుంచి భారీ ఎత్తున ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించనున్నారు.

* మార్గమధ్యంలో చిలకలూరిపేట, మార్టూరు, అద్దంకి ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు ర్యాలీలో కలవనున్నాయి. మధ్యాహ్నం 1.30 గంటలకు ఒంగోలు నగర పరిధిలోని త్రోవగుంట వద్దకు చంద్రబాబు చేరుకుంటారు.

* అక్కడి నుంచి మంగమూరు రోడ్డు, మున్సిపల్‌ కార్యాలయం, చర్చిసెంటర్‌ మీదుగా హోటల్‌ సరోవర్‌కు చేరతారు. సాయంత్రం 3 గంటలకు అక్కడే పొలిట్‌బ్యూరో సమావేశం ఉంటుంది. 6 గంటలకు ఎన్‌ఎస్‌పీ అతిథి గృహానికి వచ్చి రాత్రి అక్కడే చంద్రబాబు బస చేస్తారు.

* 27న ఉదయం 9.30 గంటలకు మండువవారిపాలెంలోని మహానాడు ప్రాంగణానికి చేరుకుంటారు. 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ప్రతినిధుల సభ ఉంటుంది. అనంతరం ఎన్‌ఎస్‌పీ అతిథి గృహానికి చంద్రబాబు చేరుకుంటారు.

* 28న ఉదయం 9.30 గంటలకు అద్దంకి బస్టాండ్‌ వద్ద ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళి అర్పించి శతజయంతి వేడుకలను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి 11 గంటలకు అతిథి గృహానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 2 గంటలకు మహానాడు ప్రాంగణానికి చేరుకుని సభ అనంతరం రాత్రి విజయవాడ బయలుదేరి వెళతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని