తెదేపా నాయకులపై పోలీసుల ప్రతాపం

అనంతపురం నగర సమీపంలోని రాప్తాడు నియోజకవర్గం సోమలదొడ్డి వద్ద తడకలేరు అశ్వర్థ నారాయణస్వామి తిరునాల (పరుష)లో పరిటాల రవీంద్ర మెమోరియల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో స్థానిక తెదేపా నాయకులు ఆదివారం మజ్జిగ పంపిణీ చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు.

Published : 06 Feb 2023 03:42 IST

తిరునాళ్లలో మజ్జిగ పంపిణీ చేస్తుండగా తొలగించాలని దౌర్జన్యం
వైకాపా ఎమ్మెల్యే రావడంతో స్వామిభక్తి చాటేందుకు తాపత్రయం

అనంతపురం (రాణినగర్‌), న్యూస్‌టుడే: అనంతపురం నగర సమీపంలోని రాప్తాడు నియోజకవర్గం సోమలదొడ్డి వద్ద తడకలేరు అశ్వర్థ నారాయణస్వామి తిరునాల (పరుష)లో పరిటాల రవీంద్ర మెమోరియల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో స్థానిక తెదేపా నాయకులు ఆదివారం మజ్జిగ పంపిణీ చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. తక్షణమే తొలగించాలంటూ తెదేపా నాయకుల చొక్కా పట్టుకొని లాక్కెళ్లారు. తిరునాలలో వేల సంఖ్యలో భక్తులు వస్తున్నా కనీసం మంచినీరు ఏర్పాటుచేసిన దాఖలాలు లేవు. భక్తుల కోసం పరిటాల రవీంద్ర మెమోరియల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో స్థానిక నాయకులు ప్రతి ఏటా మజ్జిగ, తాగునీరు సరఫరా చేస్తుంటారు. ఆదివారం కూడా భక్తులు వేలాది మంది రావడంతో స్థానిక రాప్తాడు నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షుడు చల్లా నాయుడు, అనంతపురం గ్రామీణ తెదేపా ప్రధాన కార్యదర్శి పామురాయి రఘు మజ్జిగ, తాగునీరు పంపిణీ ప్రారంభించారు. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అక్కడికి వస్తున్నారని తెలుసుకున్న పోలీసులు స్వామిభక్తిని చాటేందుకు అత్యుత్సాహం చూపారు. మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని మరో చోటకు మార్చాలని.. అక్కడున్న పరిటాల రవీంద్ర, సునీతల ఫ్లెక్సీలను తొలగించాలని సీఐ విజయభాస్కర్‌గౌడ్‌, ఎస్‌ఐ నబీ రసూల్‌ హుకుం జారీ చేశారు. సీఐ ఆగ్రహంతో చల్లా నాయుడి చొక్కా పట్టుకొని లాక్కెళ్లారు. ఉదయం నుంచి పంపిణీ చేస్తున్నామని, ఎమ్మెల్యే వస్తున్నారంటూ తొలగించడమేంటని రఘు, చల్లా నాయుడు ప్రతిఘటించారు. ఇదంతా చూస్తున్న భక్తులు పోలీసులపై అసహనం వ్యక్తం చేశారు. దేవాలయం వద్దా రాజకీయాలేమిటని ప్రశ్నించారు. మంచి చేస్తున్నప్పుడు ఫ్లెక్సీలు పెట్టుకుంటే తప్పేంటని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని