రూ. 1.10 లక్షల కోట్లతో ఎన్‌టీపీసీ పార్కు

రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేసేవారికి అండగా నిలవాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. నిర్ణీత వ్యవధిలోగా నిర్మాణాలు పూర్తి చేసి.. కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

Published : 08 Feb 2023 06:28 IST

ఎస్‌ఐపీబీ సమావేశంలో పలు పరిశ్రమలకు ఆమోదం
పారిశ్రామికవేత్తలకు అండగా ఉండాలన్న సీఎం
ఈనాడు - అమరావతి

రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేసేవారికి అండగా నిలవాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. నిర్ణీత వ్యవధిలోగా నిర్మాణాలు పూర్తి చేసి.. కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వాటిలో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కాలని స్పష్టం చేశారు. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) సమావేశం మంగళవారం తాడేపల్లిలో సీఎం జగన్‌ అధ్యక్షతన జరిగింది. పలు పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదనలకు సమావేశం ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘‘విద్యుత్‌ ప్రాజెక్టుల విధానంలో ప్రభుత్వం కీలక మార్పులు తెచ్చింది. వాటి ఏర్పాటు ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. కంపెనీ తీసుకునే భూమికి ఎకరాకు ఏడాదికి రూ.31 వేలను లీజు కింద రైతుకు చెల్లిస్తుంది. మెగావాట్‌కు రూ.లక్ష చొప్పున ప్రభుత్వానికి వస్తుంది. జీఎస్టీ రూపేణా రాష్ట్రానికి రెవెన్యూ వస్తుంది’’ అని పేర్కొన్నారు. ఆమోదించిన పరిశ్రమల వివరాలు..

* అనకాపల్లి జిల్లా పూడిమడకలో ఎన్‌టీపీసీ ఆధ్వర్యంలో గ్రీన్‌ హైడ్రోజన్‌, గ్రీన్‌ అమోనియా, గ్రీన్‌ మిథనాల్‌ హైడ్రోజన్‌ సంబంధిత ఇంధనాలను ఉత్పత్తి చేసే న్యూ ఎనర్జీ పార్కు ఏర్పాటుకు ఆమోదం. మొదటి విడత రూ. 55 వేల కోట్లు, రెండో విడత మరో రూ. 55 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్న సంస్థ. మొదటి విడత 2027 నాటికి, రెండో విడత 2033 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించిన ప్రభుత్వం. రెండు విడతల్లో 61 వేల మందికి ఉపాధి.

* కృష్ణాజిల్లా మల్లవల్లి పారిశ్రామిక పార్కులో అవిశా ఫుడ్స్‌ సంస్థ రూ. 498.84 కోట్ల పెట్టుబడితో రోజుకు 500 కిలో లీటర్ల ఉత్పత్తి సామర్థ్యంతో ఇథనాల్‌ తయారీ పరిశ్రమ ఏర్పాటు. ఈ ఏడాది జూన్‌లో పనులు ప్రారంభించి ఏడాది లోగా పూర్తి చేయాలన్నది లక్ష్యం. ప్రత్యక్షంగా, పరోక్షంగా 3,300 మందికి ఉపాధి. గతంలో ఇదే సంస్థకు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతించింది. వల్లభనేని అఖిల్‌, వల్లభనేని అరుణ్‌శౌరి, వల్లభనేని అనుదీప్‌లు సంస్థ డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు.

* కడియం వద్ద ఆంధ్రా పేపర్‌ మిల్స్‌ రూ. 3,400 కోట్ల పెట్టుబడులతో విస్తరణ. 2025 నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యం. 2,100 మందికి ప్రత్యక్ష ఉపాధి.

* శ్రీకాళహస్తిలో రూ. 915.43 కోట్లు, పుంగనూరులో రూ. 171.96 కోట్ల పెట్టుబడులతో డీఐ పైపులు, ఫెర్రో అల్లాయిస్‌ తయారీ పరిశ్రమలు ఏర్పాటు చేయనున్న ఎలక్ట్రో స్టీల్‌ కాస్టింగ్‌ లిమిటెడ్‌. ప్రత్యక్షంగా, పరోక్షంగా 2,350 మందికి ఉపాధి.

* రామాయపట్నంలో రూ.10 వేల కోట్ల పెట్టుబడులతో కాపర్‌ క్యాథోడ్‌, కాపర్‌ రాడ్‌, సల్ఫ్యూరిక్‌ యాసిడ్‌, సెలీనియం, ప్రత్యేక ఖనిజాల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయనున్న అక్టార్‌ గ్రూప్‌ ఫ్యాక్టరీ. 2023 మేలో ప్రారంభించి. 2025 జూన్‌ నాటికి పూర్తి చేయాలని లక్ష్యం. 2,500 మందికి ప్రత్యక్ష ఉపాధి.

* కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాలో 1000 మెగావాట్ల పవన, 1000 మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్రాజెక్టుల ఏర్పాటు ద్వారా నాలుగు విడతల్లో రూ. 10,500 కోట్లు పెట్టుబడి పెట్టనున్న ఎకోరెన్‌ ఎనర్జీ ఇండియా. 2027 నాటికి పూర్తి చేసేలా లక్ష్యం. 2 వేల మందికి ఉపాధి. పల్లవి చనుమోలు, లక్ష్మీప్రసాద్‌ యెర్నేని సంస్థ డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు.

* టెలి కమ్యూనికేషన్‌ ఇంటిగ్రేషన్‌, సెమికండక్టర్‌, ఆప్టికల్‌ మాడ్యూల్స్‌ తయారీ పరిశ్రమను రూ. 1,489.23 కోట్ల పెట్టుబడితో తిరుపతిలో ఏర్పాటు చేయడానికి సంసిద్ధత తెలిపిన వింగ్‌టెక్‌ మొబైల్‌ కమ్యూనికేషన్స్‌ ఇండియా. 15 వేలమందికి ఉపాధి.

* రాష్ట్రంలో బాక్సైట్‌ తవ్వకాలను నిషేధించిన నేపథ్యంలో విజయనగరం జిల్లా ఎస్‌కోట దగ్గర అల్యూమినియం ఫ్యాక్టరీ ఏర్పాటుకు జేఎస్‌డబ్ల్యూ సంస్థ సేకరించిన 985 ఎకరాల్లో ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం.

* భోగాపురంలో 90 ఎకరాల్లో ఐటీ పార్కు ఏర్పాటుకు ఆమోదం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మోడళ్లను పరిశీలించి అత్యాధునిక సదుపాయాలతో ఐటీ పార్కు ఏర్పాటు చేయాలని ఆదేశం.


విశాఖపట్నంలోని కాపులుప్పాడలో మరో 100 మెగావాట్ల డేటా సెంటర్‌ ఏర్పాటు చేయనున్న వైజాగ్‌ టెక్‌ పార్కు. మొదటి విడతలో 10 మెగావాట్ల డేటా సెంటర్‌ ఏర్పాటు. మూడేళ్లలో రూ. 7,210 కోట్ల పెట్టుబడి. ప్రత్యక్షంగా 14,825 మంది, పరోక్షంగా 5,625 మందికి ఉపాధి. ఇప్పటికే ఏర్పాటు చేస్తున్న 200 మెగావాట్ల డేటా పార్క్‌కు ఇది అదనం. ఈ సంస్థ డైరెక్టర్లుగా నవనీత్‌ ద్వారకాప్రసాద్‌, సంజయ్‌ భూటాని, షామిక్‌ పంకజ్‌భాయ్‌ పారిక్‌ వ్యవహరిస్తున్నారు. అదానీ కార్పొరేట్‌ కార్యాలయం, శాంతిగ్రామ్‌, వైష్ణోదేవి సర్కిల్‌ దగ్గర, అహ్మదాబాద్‌ అనే అడ్రస్‌తో కంపెనీ రిజిస్ట్రేషన్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని