ఆస్తుల రిజిస్ట్రేషన్లకు కొత్త నిబంధనలు

ఇళ్లు, అపార్టుమెంట్లు, ఖాళీ స్థలాలు, వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను విధించింది.

Published : 02 Apr 2023 03:39 IST

పన్ను చెల్లింపు రసీదులు సమర్పించాలి

ఈనాడు, అమరావతి: ఇళ్లు, అపార్టుమెంట్లు, ఖాళీ స్థలాలు, వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను విధించింది. ముందస్తు సమాచారం లేకుండా.. ప్రజల్లో అవగాహన కల్పించకుండానే ఈ నిబంధనలను శనివారం నుంచే అమల్లోకి తెచ్చింది. ఇప్పటివరకు రిజిస్ట్రేషన్‌ దస్తావేజులు, వాటిల్లోని అంశాలు, ఈసీ, లింక్‌ డాక్యుమెంట్లు తదితరాల ఆధారంగా సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో స్టాంపు డ్యూటీ చెల్లిస్తే రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. తాజాగా విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం ఇకపై ‘పన్ను చెల్లించినట్లుగా రుజువు పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఖాళీ స్థలాలకైతే ‘ఖాళీ స్థలం పన్ను’ (వేకెంట్‌ ల్యాండ్‌ టాక్స్‌- వీఎల్‌టీ), ఇళ్లు లేదా అపార్టుమెంట్‌లకు సంబంధిత ఆస్తి పన్ను చెల్లించినట్లు రసీదులు సమర్పించాలి...’ అని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకవేళ ఎక్కడైనా ఇవి లేకపోతే... ప్రత్యామ్నాయంగా లేఅవుట్‌ ప్లాన్‌ లేదా ప్లాన్‌ అప్రూవల్‌ కాపీని పరిశీలించాల్సి ఉంటుందని సూచించింది. ఖాళీ స్థలం, ఆస్తి పన్నును పూర్తి స్థాయిలో చాలా మంది యజమానులు కట్టడం లేదు. దాంతో ఈ నిబంధనల వల్ల రిజిస్ట్రేషన్ల సమయంలో క్రయ విక్రయాలకు ఇబ్బందులు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ఆదేశాలు రిజిస్ట్రేషన్‌ చట్టం స్ఫూర్తికి వ్యతిరేకమని పలువురు విమర్శిస్తున్నారు. మరో పక్క రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ సాఫీగా జరగాలంటే ఈసీ పత్రాల జారీ వ్యవస్థ పటిష్ఠంగా ఉండాలని వారు సూచిస్తున్నారు.

* జీపీఏ ద్వారా వ్యవసాయ భూముల క్రయ, విక్రయాల దస్తావేజుల రిజిస్ట్రేషన్లకు అడంగల్‌, 1బి కాపీని సబ్‌రిజిస్ట్రార్లు పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఇప్పుడు తప్పనిసరిగా అడంగల్‌, 1బిలో జీపీఏ పొందిన వారి పేర్లు ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. వ్యవసాయ భూములకు సంబంధించి సర్వే నెంబరు డాక్యుమెంట్లలో తప్పుపడితే... ఎమ్మార్వో నుంచి ఎంజాయ్‌మెంట్‌ సర్టిఫికెట్‌ తెచ్చుకుంటే సబ్‌-రిజిస్ట్రార్‌ సరిచేసే వారు. తాజా ఉత్తర్వుల్లో...ఎమ్మార్వో ద్వారా అడంగల్‌లో సవరణ చేయించుకుని వస్తేనే తదుపరి చర్యలు తీసుకోవాలని సబ్‌రిజిస్ట్రార్లను ప్రభుత్వం ఆదేశించింది.

* భాగస్వామ్య విభాగ పరిష్కారాలు, హక్కు విడుదల దస్తావేజుల (పార్టిషనర్‌, రిలీజ్‌ ఆఫ్‌ రైట్‌)కు కొత్త నిబంధన విధించింది. కుటుంబ యజమాని చనిపోయినా, పూర్వార్జిత ఆస్తులకు డాక్యుమెంట్‌ రిజిస్ట్రేషన్‌ జరగాలన్నా లీగల్‌ హెయిర్‌ సర్టిఫికెట్‌ ఇవ్వాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని