Rushikonda: రుషికొండ సౌధం.. రాజకోట రహస్యమా?

ఏ చిన్న పని పూర్తి చేసినా అంతులేని హడావుడి ప్రదర్శించే వైకాపా ప్రభుత్వం ‘రుషికొండ రిసార్టు’ విషయంలో మాత్రం అయోమయంలో ఉంది. వైకాపా అయిదేళ్ల పాలనలో రాష్ట్రంలో అత్యంత వేగంగా జరిగిన భారీ ప్రాజెక్టు ఇదే.

Updated : 05 Mar 2024 14:20 IST

రూ.450 కోట్లు కుమ్మరించి భవనాల నిర్మాణం
ఎందుకు వినియోగించబోతున్నారో చెప్పలేని అయోమయం
సీఎం సరే అంటే సీఎంవో.. లేదంటే రిసార్టంట!
ఆతిథ్య సేవలకు విరుద్ధంగా నిర్మించాక ఎలా ఉపయోగిస్తారో?

ఈనాడు, విశాఖపట్నం: ఏ చిన్న పని పూర్తి చేసినా అంతులేని హడావుడి ప్రదర్శించే వైకాపా ప్రభుత్వం ‘రుషికొండ రిసార్టు’ విషయంలో మాత్రం అయోమయంలో ఉంది. వైకాపా అయిదేళ్ల పాలనలో రాష్ట్రంలో అత్యంత వేగంగా జరిగిన భారీ ప్రాజెక్టు ఇదే. రూ.వందల కోట్లు కుమ్మరించి అక్కడ ప్యాలెస్‌ నిర్మించారు. అటువంటి రాజసౌధం ప్రారంభోత్సవం జరిగి వారం కావస్తున్నా దానిని ఎందుకు ఉపయోగిస్తారో ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదు. ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ఆధ్వర్యంలో పూర్తి చేసిన ఆ నిర్మాణం దేనికోసమో ఆ శాఖ అధికారులు కాదు కదా వాటిని ప్రారంభించిన మంత్రులు కూడా చెప్పలేకపోవడానికి అదేమైనా ‘రాజకోట రహస్యమా’ అని విమర్శలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లకే రంగులు వేసి పండగ వాతావరణంలో ప్రారంభిస్తున్న వైకాపా ప్రభుత్వం రూ.450 కోట్లు ఖర్చు చేసి కట్టి, రిబ్బన్‌ కత్తిరించిన ప్యాలెస్‌ను మాత్రం ఖాళీగా ఉంచేయడం వెనుక ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

అలా ఎలా? 

‘రుషికొండ రీడెవలప్‌మెంట్‌ రిసార్ట్‌’ పేరుతో తీర ప్రాంత నియంత్రణ జోన్‌ (సీఆర్‌జెడ్‌) అనుమతులు పొందగా అదే పేరుతో ఆ భవనాలను కొద్ది రోజుల కిందటే ప్రారంభించారు. వేంగి ఎ, వేంగి బి, కళింగ, గజపతి, విజయనగరం ఏ, బీ, సీ...ఇలా  మొత్తం ఏడు బ్లాకుల్లో రిసెప్షన్‌, రెస్టారెంట్లు, బ్యాంకెట్‌హాళ్లు, గెస్ట్‌ రూములు, ప్రీమియం విల్లా సూట్స్‌, స్పా, ఇండోర్‌ గేమ్స్‌, ఫిట్‌నెస్‌ సెంటర్‌, బ్యాక్‌ ఆఫీస్‌ వంటివి అభివృద్ధి చేశామని అధికారులు చెబుతున్నారు. పర్యాటకావసరాలకైతే ప్రారంభోత్సవం రోజే అప్పగించొచ్చు. వందల కోట్లు ఖర్చుపెట్టి నిర్మించిన ఈ భవనాలను ఉపయోగించుకోకుండా ఎందుకు నిరీక్షిస్తున్నారో అంతుపట్టడం లేదు. వాస్తవానికి ఆ భవనాలు పర్యాటక, ఆతిథ్య సేవలకు అనువుగా లేవని సమాచారం. పేరుకు మాత్రమే పర్యాటక రంగానివని చెబుతున్నా వాటిని అధికార పెద్దల అవసరాల మేరకే తీర్చిదిద్దారు. ఈ నేపథ్యంలోనే సీఎం క్యాంపు కార్యాలయంగా ఉంటే బాగుంటుందని ఓ మంత్రి పేర్కొనగా.. పర్యాటక రిసార్టుగా కొనసాగించాలా, సీఎం కార్యాలయంగా వినియోగించాలా అన్నది ఇంకా నిర్ణయించలేదని మరో మంత్రి చెప్పడం రుషికొండపై నెలకొన్న గందరగోళానికి మచ్చుతునక. 

ఎంత హడావుడి చేశారో!

రుషికొండపై పర్యాటక రిసార్టు నిర్మాణం పేరిట ప్రకృతి విధ్వంసానికి పాల్పడ్డారు. నిక్షేపంగా ఉన్న ‘హరితా హిల్‌ రిసార్టు’ భవనాలు పాతవైపోయాయని కూల్చేశారు. కొండను అక్రమంగా తవ్వేస్తున్నారని, నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మాణాలు చేపడుతున్నారని నిపుణులు, పర్యావరణవేత్తలు, ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు ఎంత గగ్గోలు పెట్టినా ప్రభుత్వ పెద్దలు పట్టించుకోలేదు. భారీ యంత్రాలతో రాత్రింబవళ్లు కొండను తవ్వేసి బోడిగుండు చేసేశారు. న్యాయపరమైన వివాదాలు చుట్టుముట్టినా పట్టించుకోకుండా ముందుకెళ్లారు. నిపుణుల కమిటీ రుషికొండపై సర్వే చేపట్టి పలు ఉల్లంఘనలు జరిగాయని తేల్చినా ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఎంతో హడావుడి చేసి, ఎంత మంది అడ్డుచెప్పినా పెడచెవిన పెట్టి, వాయువేగంతో నిర్మాణం పూర్తి చేసిన ప్రభుత్వం ఆ భవనాలను ఖాళీగా ఉంచడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని