భూ హక్కు చట్టంపై మంత్రి ధర్మాన ద్వంద్వ వైఖరి.. అప్పుడలా..ఇప్పుడిలా..

మాటల గారడీలో ఆరితేరిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ‘భూహక్కు చట్టం’ అమలుపై ద్వంద వైఖరి ప్రదర్శిస్తున్నారు.

Updated : 30 Apr 2024 10:37 IST

అరసవల్లి, శ్రీకాకుళం అర్బన్‌, న్యూస్‌టుడే: మాటల గారడీలో ఆరితేరిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ‘భూహక్కు చట్టం’ అమలుపై ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారు. ప్రజా సంక్షేమం కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని అమలులోకి తీసుకొస్తోందని గతంలో ప్రగల్భాలు పలికారు. చట్టంలో పొందుపరిచిన అంశాలపై తీవ్ర విమర్శలు రావడంతో ఆ పాపం భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానిదేనంటూ ప్రస్తుతం ప్లేటు ఫిరాయించారు.

ఫిబ్రవరి 3న..: ఈ ఏడాది ఫిబ్రవరి మూడో తేదీన శ్రీకాకుళంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు విలేకరులతో మాట్లాడుతూ... ‘కేంద్ర ప్రభుత్వ సిఫార్సులు, నీతిఆయోగ్‌ సూచనల మేరకు ప్రజల కోసం భూహక్కు చట్టాన్ని అమలు చేస్తున్నాం. దీని కోసం ముందుస్తుగా రీసర్వే ప్రక్రియ పూర్తికావాలి. అభ్యంతరాలు కోరుతూ త్వరలో ఒక వెబ్‌సైట్‌ ప్రారంభిస్తాం’ అని పేర్కొన్నారు.

ప్రస్తుతం ఇలా..: శ్రీకాకుళంలోని వైకాపా జిల్లా కార్యాలయంలో మంత్రి సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ‘భూ హక్కు చట్టం రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కాదు. భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానిది. ఈ చట్టాన్ని తీసుకురావాలని రాష్ట్రాలపై కేంద్రం ఒత్తిడి తీసుకొస్తూనే ఉంది. అదే భాజపాతో తెదేపా జట్టు కట్టింది. ఇప్పుడు ఆ చట్టంపై ఆ పార్టీ నేతలు వక్రభాష్యాలు చెబుతున్నారు. న్యాయస్థానాల్లో దాఖలైన పిటిషన్లపై స్పష్టత రావాలి. అప్పటివరకు ఈ చట్టం అమలు చేయబోమని గతంలోనే స్పష్టం చేశాం. ప్రతిపక్షాలు ఓ మెమో పట్టుకుని ఆరోపణలు చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయి. జగన్‌ భూములు లాగేసుకుంటాడు.. ప్రజలారా మీరంతా జాగ్రత్త పడండి అని అతి తెలివి కలిగిన వారు చెప్పడం.. న్యాయవాదులమని పేరు చెప్పుకొని అన్యాయంగా మాట్లాడటం.. సమాజాన్ని తప్పుదోవ పట్టించడం.. ఇదేనా చైతన్యవంతులు చేయాల్సిన పని?’ అని వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని