Navaratnalu:గృహ నిర్మాణాల పూర్తికి గడువు పొడిగింపు

‘నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద చేపడుతున్న గృహ నిర్మాణాలను పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గడువు పొడిగించింది. క్షేత్రస్థాయిలో అధికారులు ఎంత ఒత్తిడి చేస్తున్నా ఇళ్లు కట్టుకునేందుకు లబ్ధిదారులు ఆశించిన స్థాయిలో ముందుకు రావడం లేదు.

Updated : 31 Jan 2022 04:56 IST

2022 డిసెంబర్‌ నుంచి 2023 జూన్‌కు పెంపు
జిల్లాల్లో యంత్రాంగానికి త్రైమాసిక లక్ష్యాలు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ‘నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద చేపడుతున్న గృహ నిర్మాణాలను పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గడువు పొడిగించింది. క్షేత్రస్థాయిలో అధికారులు ఎంత ఒత్తిడి చేస్తున్నా ఇళ్లు కట్టుకునేందుకు లబ్ధిదారులు ఆశించిన స్థాయిలో ముందుకు రావడం లేదు. మొదటి విడతగా చేపట్టిన 15.75 లక్షల ఇళ్లకు 2020 డిసెంబర్‌లో శంకుస్థాపన చేయగా ఈ ఏడాది డిసెంబరు నాటికి వీటిని పూర్తి చేయాలన్నది లక్ష్యం. 13 లక్షలు గృహాలు పునాది (గ్రౌండింగ్‌) దశలో ఉన్నాయి. పూర్తయిన ఇళ్ల నిర్మాణ శాతం చాలా తక్కువగా ఉంది.  తాజాగా ప్రభుత్వం నిర్మాణాలు పూర్తి చేసేందుకు 2023 జూన్‌ వరకు గడువు పొడిగిస్తూనే జిల్లాల యంత్రాంగానికి త్రైమాసిక లక్ష్యాలను నిర్దేశించింది.

6 దశలుగా విభజన

2022 జనవరి నుంచి మార్చి వరకు 1.18 లక్షల గృహాలు గ్రౌండింగ్‌ చేయడంతో పాటు 41,520 ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని గృహనిర్మాణ శాఖ లక్ష్యం నిర్దేశించుకుంది. ఆ తర్వాత ఏప్రిల్‌-జూన్‌కు 2.74 లక్షల గృహాల గ్రౌండింగ్‌, 5,19,721 ఇళ్లు పూర్తి చేయాలి. జులై-సెప్టెంబర్‌ మధ్య 75 వేలు, అక్టోబరు- డిసెంబరు మధ్య లక్ష ఇళ్లు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2023 జనవరి-మార్చి నెలాఖరుకు 3 లక్షలు, అదే ఏడాది ఏప్రిల్‌-జూన్‌కు 4,84,075 గృహాలు పూర్తి చేయాలని స్పష్టం చేసింది. వీటి ప్రకారం జిల్లాల్లో అధికారులు రోజువారీ లక్ష్యాలను నిర్దేశించారు.

కేంద్రం నుంచి 17 లక్షల ఇళ్లు మంజూరు

రాష్ట్ర ప్రభుత్వం జగనన్న కాలనీల్లో పేదలకు ఇచ్చిన ఇళ్లన్నీ కేంద్రం మంజూరు చేసినవే. ఇప్పటివరకు కేంద్రం 17 లక్షల గృహాలను మంజూరు చేసింది. మరో విడతలో గృహాలు ఇవ్వాలంటే ఇప్పటికే మంజూరు చేసిన వాటిలో 90% గ్రౌండింగ్‌ చేయడంతో పాటు 70% పూర్తి చేయాల్సి ఉంది. నవరత్నాలు- పేదలందరికీ ఇళ్ల పథకం పూర్తికి కేంద్రం ఈ ఏడాది ఆగస్టు వరకు గడువు నిర్దేశించింది. రాష్ట్ర ప్రభుత్వం మొత్తంగా రెండు విడతలుగా 30 లక్షల గృహాలు పూర్తి చేయాల్సి ఉన్నందున మళ్లీ కేంద్రం నుంచి ఇళ్లు మంజూరు కావాలంటే నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోవాల్సి ఉంది. ఆ మేరకు జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో ఒత్తిడి చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో చాలా రాష్ట్రాల్లో నిర్మాణాలు పూర్తికానందున గడువును కేంద్రం పొడిగించే అవకాశం ఉందని రాష్ట్ర గృహనిర్మాణ అధికారులు చెబుతున్నారు. కేంద్రం రూ.2,700 కోట్ల విడుదలకు ఆమోదం తెలపగా, మొదట విడతగా సోమవారం 50% నిధులు రాష్ట్రానికి బదిలీ కానుంది. రాష్ట్ర ఖాతాకు బదిలీ అయ్యాక ఈ మొత్తాన్ని మూడు వారాల్లో రాష్ట్ర నోడల్‌ అకౌంట్‌కు (గృహనిర్మాణశాఖ అకౌంట్‌) ప్రభుత్వం బదిలీ చేయాల్సి ఉంది. అలా కాని పక్షంలో మరో విడత మొత్తాన్ని కేంద్రం విడుదల చేయదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని