Stock Market Tips :టిప్పులతో ముప్పే!

‘మీరు స్టాక్‌మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నారా? మంచి టిప్‌లు (సూచనలు) ఇస్తాం. నెలకు కనీసం 2-3 షేర్లు సిఫారసు చేస్తాం. వాటితో మీరు లక్షలు ఆర్జించవచ్చు.. ఫలానా కంపెనీ షేర్లు కొంటే తెల్లారేసరికి కోటీశ్వరులైపోవచ్చు’...

Published : 26 Sep 2021 09:00 IST

 షేర్లను వదిలించుకోవడానికి వల వేస్తారు
 అప్రమత్తంగా ఉండకపోతే జేబులు గుల్ల
 స్టాక్‌మార్కెట్‌పై అవగాహన పెంచుకోవాలి అంటున్న నిపుణులు  
ఈనాడు - హైదరాబాద్‌

‘మీరు స్టాక్‌మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నారా? మంచి టిప్‌లు (సూచనలు) ఇస్తాం. నెలకు కనీసం 2-3 షేర్లు సిఫారసు చేస్తాం. వాటితో మీరు లక్షలు ఆర్జించవచ్చు.. ఫలానా కంపెనీ షేర్లు కొంటే తెల్లారేసరికి కోటీశ్వరులైపోవచ్చు’ అంటూ చిన్న ఇన్వెస్టర్లకు కొన్ని సంస్థల నుంచి కాల్స్‌ వస్తుంటాయి. ఇలాంటివి నమ్మి పెట్టుబడి పెడితే నిలువునా మునిగిపోవడం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెట్టుబడులు పెట్టే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? షేర్లు కొనేముందు ఏయే అంశాలు పరిశీలించాలి? ఏ సూత్రాన్ని అనుసరిస్తే లాభాలు వస్తాయి. తదితరాలపై ప్రత్యేక కథనం...


నేర్చుకోవాలి.. ఓర్చుకోవాలి

స్టాక్‌మార్కెట్లో లాభాలకు సమయం పడుతుంది. యుద్ధాలు, ప్రభుత్వాల విధానాలు, వృద్ధి రేటు, ఆర్థిక సంక్షోభాలు, ఆయా కంపెనీల పనితీరు తదితర పరిణామాలన్నీ మార్కెట్‌పై ప్రభావం చూపేవే. అన్నిటినీ బేరీజు వేసుకోవాలి. సరైన షేర్లలో పెట్టుబడి పెట్టి ఓపికగా ఎదురుచూడాలి. కంపెనీల వార్షిక నివేదికలు సహా పలు మార్గాల్లో లభించే సమాచారంతో అవగాహన పెంచుకోవాలి.


తస్మాత్‌ జాగ్రత్త!

షేర్ల క్రయ, విక్రయాలపై సొంతంగా నిర్ణయం తీసుకోవాలి. పరిస్థితులను గమనిస్తూ, మార్కెట్‌ వర్గాల అభిప్రాయాలు తెలుసుకుంటూ పెట్టుబడులు పెట్టాలి. గత ఏడాది కాలంలో ఎంతోమంది యువత, కొత్త మదుపరులు స్టాక్‌మార్కెట్లో అడుగుపెట్టారు. వారంతా షేర్ల ధరలు పెరగడమే చూశారు కానీ, ‘బేర్‌ మార్కెట్‌’ అనుభవం వారికి లేదు. ధరలు భారీగా పతనమైతే ఆ బాధ తీవ్రంగా ఉంటుంది. అందువల్ల ఆచితూచి అడుగేయాలి.


అన్ని ఐపీఓలూ కలిసి రావు

ఇటీవల ఐపీఓ (తొలి పబ్లిక్‌ ఆఫర్‌)లకు క్రేజ్‌ ఏర్పడింది. కేవలం లిస్టింగ్‌ గెయిన్స్‌ (ఐపీఓల షేర్లు కొని, ఎక్స్ఛేంజీల్లో అవి నమోదైన రోజే విక్రయించి లాభపడడం) కోసం  ఎంతోమంది దరఖాస్తు చేస్తున్నారు. అన్నిసార్లూ ఈ వ్యూహం ఫలించదు. మంచి కంపెనీలను గుర్తించి దరఖాస్తు చేయడం మేలు.


లాభాలు తీసుకోవాలి

సందర్భానుసారంగా మదుపరులు లాభాల్లో ఉన్న షేర్లను కొంతమేరకు విక్రయించి సొమ్ము చేసుకోవాలి. మళ్లీ అవకాశం వచ్చినప్పుడు కొనాలి. ధర పెరగని షేర్లను అమ్మేసి, ఆ సొమ్మును వృద్ధి సాధించే అవకాశాలున్న కంపెనీలకు మళ్లించాలి. ఒకే రంగానికి చెందిన కంపెనీలపై మొత్తం పెట్టుబడి పెట్టడం కంటే నాలుగైదు రంగాల్లోని మంచి కంపెనీలను ఎంచుకోవడం మేలు.


  నాలుగైదు వాయిదాల్లో పెట్టుబడులు

- సతీష్‌ కంతేటి, జాయింట్‌ ఎండీ, జెన్‌ మనీ 

కొత్తగా స్టాక్‌మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం ప్రస్తుత పరిస్థితుల్లో రిస్కే. నాణ్యమైన కంపెనీలను ఎంపిక చేసుకుని, నాలుగైదు వాయిదాల్లో పెట్టడం మేలు. వాస్తవిక విలువ ప్రకారం షేరు ధర పెరగని కంపెనీలను ఎంపిక చేసుకోవాలి. అనూహ్య మార్పులొస్తే, నష్టభయం ఎదురవుతుంది. ముడిచమురు ధర, అమెరికాలో వడ్డీ రేట్లు పెరగటం అతిపెద్ద రిస్కు. మనదేశంలో ద్రవ్యోల్బణం, వడ్డీరేట్లనూ గమనిస్తుండాలి. ప్రస్తుత స్థాయిలో మదుపరులు అప్రమత్తంగా మెలగాలి.


  దీర్ఘకాలిక వ్యూహం ఉండాలి

- డాక్టర్‌ ఆర్‌ఎంసీవీ ప్రసాదరావు, ఎండీ, ఆర్‌ఎల్‌పీ సెక్యూరిటీస్‌

పెరుగుతున్న షేర్ల వెంటపడి, స్వల్పకాలంలోనే భారీ లాభాలు ఆర్జించాలనుకోవడం ప్రమాదకరం. టిప్స్‌ రూపంలో వచ్చే షేర్లను కొనవద్దు. అప్పు చేసి షేర్లు కొనడం కూడా ప్రమాదమే. స్థిరంగా వృద్ధి సాధిస్తున్న కంపెనీలను ఎంచుకుని, వాటి విలువలను పరిశీలించి దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టడం సరైన వ్యూహం. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాటలో ఉంది. ఈ తరుణంలో ఆకర్షణీయ లాభాలు సాధించే కంపెనీలను ఎంపిక చేసుకోవాలి.


 మ్యూచువల్‌ ఫండ్లు మేలు

- ఎస్‌.నరేన్‌, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్‌ ఏఎంసీ

సూచీలు గరిష్ఠ స్థాయులను తాకిన 1999, 2007, 2017లో ఏం జరిగిందో మదుపరులు తెలుసుకోవాలి. అప్రమత్తంగా పెట్టుబడులు పెట్టాల్సిన సమయం ఇది. బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌, డైనమిక్‌ అసెట్‌ అలకేషన్‌ వంటి మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలను కూడా పరిశీలించాలి. ఒకే వ్యాపార రంగ షేర్లు, సెక్టోరియల్‌ మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడులు కేంద్రీకరించడమూ రిస్కే. ఐటీ- టెలికాం, ఇన్‌ఫ్రా, స్మాల్‌ క్యాప్‌ తరగతులకు అధికంగా పెట్టుబడులు మళ్లించి మదుపరులు చేతులు కాల్చుకున్న సందర్భాలున్నాయి. దీనికి బదులు ఫ్లెక్సీక్యాప్‌ ఫండ్ల ద్వారా పెట్టుబడులు మేలు. దీర్ఘకాలిక పెట్టుబడికి సిద్ధపడిన మదుపరులకు ‘వ్యాల్యూ ఫండ్స్‌’ అనుకూలంగా ఉంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని