హీరో మోటోకార్ప్‌ @10 కోట్లు

దేశీయ ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారు హీరో మోటోకార్ప్‌ సరికొత్త మైలురాయిని అందుకుంది. మూడున్నర దశాబ్దాలుగా ద్విచక్రవాహన తయారీలో నిమగ్నమై

Published : 21 Jan 2021 19:25 IST

దిల్లీ: దేశీయ ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారు హీరో మోటోకార్ప్‌ సరికొత్త మైలురాయిని అందుకుంది. మూడున్నర దశాబ్దాలుగా ద్విచక్రవాహన తయారీలో నిమగ్నమై ఉన్న ఈ సంస్థ ఇప్పటి వరకు 10 కోట్ల వాహనాలను తయారు చేసి రికార్డు సృష్టించింది. హరిద్వార్‌లోని ప్లాంట్‌లో తన ఎక్స్‌ట్రీమ్‌ 160ఆర్‌ మోడల్‌ను ఉత్పత్తి చేయడం ద్వారా ఈ మైలురాయిని చేరుకుంది. ఇదే ఉత్సాహంతో ఏటా 10 కొత్త ఉత్పత్తులను రానున్న ఐదేళ్లలో తీసుకురానున్నట్లు కంపెనీ ప్రకటించింది.

1984 జనవరి 19న హీరో మోటోకార్ప్‌ ఉత్పత్తిని ప్రారంభించింది. 1994 నాటికి 10 లక్షల వాహనాలను ఉత్పత్తి చేసింది. 2013 నాటికి ఆ సంఖ్య 5 కోట్లకు, 2017 నాటికి 7.5 కోట్ల చేరింది. కేవలం గడిచిన ఏడేళ్లలోనే 5 కోట్ల వాహనాలను ఉత్పత్తి చేశామని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. ‘ఇది మా కష్టానికి తగ్గ ప్రతిఫలం’ అని ఈ సందర్భంగా ఆ కంపెనీ ఛైర్మన్‌ అండ్‌ సీఈవో పవన్‌ ముంజల్‌ అన్నారు. దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా తమ వాహనాలకు మంచి గిరాకీ ఉండటంపై ఆయన సంతోషం వ్యక్తంచేశారు. భారత్‌ సహా మొత్తం 40 దేశాల్లో హీరో మోటోకార్ప్‌ తన వాహనాలు విక్రయిస్తోంది. కేవలం ఒక్క భారత్‌లోనే 8 తయారీ ప్లాంట్లను కలిగి ఉంది.

ఇదే ఉత్సాహంతో రాబోయే ఐదేళ్లలో మరిన్ని కొత్త ఉత్పత్తులు తీసుకొస్తామని ముంజల్‌ ప్రకటించారు. అలాగే పరిశోధన, అభివృద్ధిపై (ఆర్‌అండ్‌డీ) మరింత దృష్టి సారించనున్నామని తెలిపారు. కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు కృషి చేస్తూ పర్యావరణహిత ఉత్పత్తులను తీసుకొస్తామని చెప్పారు. 10 కోట్ల మైలురాయిని అందుకున్న సందర్భంగా స్పెషల్‌ సెలబ్రేషన్‌ ఎడిషన్‌ మోడళ్లను గురుగ్రామ్‌ తయారీ ప్లాంట్‌లో గురువారం ఆయన ఆవిష్కరించారు. స్ప్లెండర్‌+, ఎక్స్‌ట్రీమ్‌ 160ఆర్‌, ప్యాషన్‌ ప్రో, గ్లామర్‌, డెస్టినీ 125, మ్యాస్ట్రో ఎడ్జ్‌ 110క స్పెషల్‌ ఎడిషన్‌ మోడళ్లను విడుదల చేశారు. ఫిబ్రవరి నుంచి వీటి విక్రయాలు ప్రారంభం కానున్నాయి.

ఇవీ చదవండి..
ద్విచ‌క్ర వాహ‌న బీమాను బ‌దిలీ చేయ‌డం ఎలా?
బ్యాంక్ పేరుతో వ‌చ్చే ఫేక్ మెసేజ్‌ల‌ను గుర్తించ‌డం ఎలా?

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని