Mahindra: కెనడాలో ‘మహీంద్రా’ అనుబంధ సంస్థ మూత!

Mahindra: మూసివేతకు కారణాలను మాత్రం ఎక్కడా వెల్లడించలేదు. కానీ, ప్రస్తుతం కెనడా-భారత్‌ మధ్య నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ పరిణామానికి ప్రాధాన్యం ఏర్పడింది.

Published : 22 Sep 2023 15:17 IST

దిల్లీ: మహీంద్రా అండ్‌ మహీంద్రా (Mahindra & Mahindra) గ్రూప్‌నకు కెనడాలో అనుబంధంగా పనిచేస్తున్న ‘రెస్సన్‌ ఏరోస్పేస్‌ కార్పొరేషన్‌’ తమ కార్యకలాపాలను మూసివేసింది. ఈ విషయాన్ని ఎంఅండ్‌ఎం (Mahindra & Mahindra) గురువారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. భారత్‌, కెనడా మధ్య దౌత్యపరమైన ఇబ్బందులు కొనసాగుతున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముంబయి కేంద్రంగా పనిచేస్తున్న ఎంఅండ్‌ఎం (Mahindra & Mahindra)కు రెస్సన్‌లో 11.18 శాతం వాటాలున్నాయి.

‘రెస్సన్‌ ఏరోస్పేస్ కార్పొరేషన్‌’ స్వచ్ఛందంగా తమ కార్యకలాపాలను మూసివేస్తున్నట్లు పేర్కొంటూ కెనడా కార్పొరేషన్స్‌కు దరఖాస్తు చేసుకుంది. అందుకు సెప్టెంబర్‌ 20న ఆమోదం లభించింది. దీంతో కంపెనీ మూతపడింది. ఫలితంగా ఆ సంస్థతో తమ అనుబంధం కూడా ముగిసినట్లు ఎంఅండ్‌ఎం ఫైలింగ్‌లో తెలిపింది. మూసివేతకు కారణాలను మాత్రం ఎక్కడా వెల్లడించలేదు. కానీ, ప్రస్తుతం ఇరుదేశాల మధ్య నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ పరిణామానికి ప్రాధాన్యం ఏర్పడింది.

రెస్సన్‌ మూసివేత వల్ల ఎంఅండ్‌ఎంకు 4.7 మిలియన్‌ కెనడా డాలర్లు (దాదాపు రూ.28.7 కోట్లు) లభించనున్నాయి. ‘క్లాస్‌ సి ప్రిఫర్డ్‌ షేర్ల’ కింద ఈ మొత్తం తమకు అందనున్నట్లు ఎంఅండ్‌ఎం తెలిపింది. స్టాక్‌ మార్కెట్‌లో ఎంఅండ్‌ఎం షేరు శుక్రవారం మధ్యాహ్నం 2:32 గంటల సమయంలో 1.45 శాతం నష్టపోయి రూ.1,606.70 దగ్గర స్థిరపడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు