Crime News: ప్రేమ పేరుతో వంచించి.. అత్యాచారం: అనంతలో ఇద్దరు స్నేహితుల దుర్మార్గం

అనంతపురం జిల్లాలో ఘోరం జరిగింది. ప్రేమ పేరుతో వంచించి ఓ యువకుడు యువతిపై అత్యాచారం చేశాడు.

Updated : 04 Nov 2023 20:15 IST

అనంతపురం: అనంతపురం జిల్లాలో ఘోరం జరిగింది. ప్రేమ పేరుతో వంచించి ఓ యువకుడు యువతిపై అత్యాచారం చేశాడు. అంతటితో ఆగకుండా ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను తన స్నేహితుడికి పంపించాడు. వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తానని బెదిరించి అతని స్నేహితుడు.. ఆమెపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. నిందితులిద్దరినీ అరెస్టు చేసినట్టు దిశ డీఎస్పీ ఆంథోనప్ప తెలిపారు.

పోలీసుల కథనం ప్రకారం.. తాడిపత్రి నియోజకవర్గంలోని ఓ మండలానికి చెందిన విద్యార్థిని విజయవాడలో బీటెక్‌ చదువుతోంది. ఈమెకు అదే మండలానికి చెందిన కృష్ణారెడ్డితో ఐదు నెలలుగా పరిచయం ఉంది. ప్రేమిస్తున్నానంటూ వెంటపడేవాడు. నమ్మించడానికి బ్లేడుతో చేయి కూడా కోసుకున్నాడు. దీంతో భయపడిన యువతి అతడితో చనువుగా ఉండేది. అక్టోబరు 19న నిందితుడు కృష్ణారెడ్డి.. విజయవాడలోని హాస్టల్లో ఉన్న యువతికి ఫోన్‌ చేసి బెంగళూరు రావాలని, లేని పక్షంలో ఇద్దరి పరిచయాన్ని కుటుంబసభ్యులకు, తెలిసిన వారికి చెబుతానని బెదిరించాడు. దీంతో ఆమె 20న బెంగళూరు వెళ్లింది. తన మిత్రుడి గదికి తీసుకెళ్లి.. ఎవరూ లేని సమయంలో బెదిరించి అత్యాచారం చేశాడు. నాలుగు రోజుల తర్వాత అతడి బారి నుంచి తప్పించుకుని యువతి సొంతూరు వెళ్లింది.

తిరిగి అక్టోబరు 28న కళాశాలకు వెళ్లడానికి బయల్దేరింది. గుత్తి వరకు వెళ్లిన తర్వాత.. గుంతకల్లు పట్టణానికి చెందిన దివాకర్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. బెంగళూరులో కృష్ణారెడ్డితో ఏకాంతంగా కలిసి ఉన్న ఫొటోలు, వీడియోలు తన వద్ద ఉన్నాయని, చెప్పినట్టు వినకపోతే సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తానని బెదిరించాడు. గుంతకల్లు రావాలని చెప్పడంతో బాధితురాలు భయంతో గుంతకల్లు వెళ్లింది. ఆమెను స్థానికంగా ఓ లాడ్జికి తీసుకెళ్లి.. బెదిరింపులకు పాల్పడుతూ రెండ్రోజులపాటు లైంగికంగా వేధించాడు దివాకర్‌. ఆమెతో సన్నిహితంగా ఉన్న సమయంలో ఫొటోలు, వీడియోలు రహస్యంగా చిత్రీకరించాడు. వాటిని మొదటి నిందితుడు కృష్ణారెడ్డి, మరికొందరికి పంపాడు. ఇలా కృష్ణారెడ్డి, దివాకర్ వాళ్లకు తెలిసిన మిత్రులు అందరికీ పంపించారు. ఇది తెలియని బాధితురాలు లాడ్జి నుంచి బయటపడి విజయవాడకు వెళ్లిపోయింది. ఆ ఫొటోలు, వీడియోలు అదే మండలానికి చెందిన ఓ వ్యక్తికి చేరడంతో, అతడు యువతి సమీప బంధువులకు తెలిపాడు. దీంతో కంగారుపడిన కుటుంబసభ్యులు ఆమెతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితులు ఇద్దరిపై కేసు నమోదు చేశారు. 24 గంటల్లో నిందితులను పట్టుకున్నామని దిశ డీఎస్పీ ఆంథోనప్ప తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని