Crime News: నిజామాబాద్‌ జిల్లాలో ఒకే కుటుంబంలో ఆరుగురి హత్య!

నిజామాబాద్‌ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు హత్యకు గురైనట్లు తెలుస్తోంది.

Updated : 18 Dec 2023 18:08 IST

డిచ్‌పల్లి: నిజామాబాద్‌ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి హత్య కలకలం రేపుతోంది. ఇంటి కోసం ఇంటిల్లిపాదిని ఓ స్నేహితుడు పొట్టన పెట్టుకున్నాడు. ఈ నెల 9 నుంచి వారం రోజుల వ్యవధిలో వీరంతా హత్యకు గురైనట్లు తెలుస్తోంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్‌ జిల్లా మాక్లూర్‌కు చెందిన ప్రసాద్‌, ప్రశాంత్‌ ఇద్దరు స్నేహితులు. ప్రసాద్‌ అప్పుల ఊబిలో ఇరుక్కుపోవడంతో బ్యాంకులో రుణం ఇప్పిస్తానని, ఆ సొమ్ముతో అప్పులు తీర్చుకోవచ్చని ప్రశాంత్‌ నమ్మించాడు. లోన్‌ ప్రాసెస్‌ సులువు అవుతుందని చెప్పి ప్రసాద్‌ ఇంటిని తన పేరిట రాయించుకున్నాడు. బ్యాంకుల చుట్టూ తిరిగినా రుణం రాకపోవడంతో.. ఇంటిని తిరిగి తన పేరుమీద రిజిస్ట్రేషన్‌ చేయాలని ప్రశాంత్‌పై ప్రసాద్‌ ఒత్తిడి తీసుకొచ్చాడు. ఎలాగైనా ఆ ఇంటిని దక్కించుకోవాలన్న దురుద్దేశంతో ప్రసాద్‌ను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ నెల 9 నుంచి వారం వ్యవధిలో ఆ కుటుంబం మొత్తాన్ని ఒక్కొక్కరిగా వివిధ చోట్ల హత్య చేశాడు.

వీళ్లిద్దరూ ప్రస్తుతం మాక్లూర్‌లో ఉండటం లేదు. వివిధ కారణాలతో ప్రసాద్‌ తన కుటుంబంతో కలిసి కామారెడ్డి జిల్లా మాచారెడ్డిలో ఉంటుండగా..  ప్రశాంత్‌ నిజామాబాద్‌ శివారులో ఉంటున్నాడు. హత్య ప్రణాళికను ప్రశాంత్‌ పక్కాగా అమలు చేశాడు. తొలుత ప్రసాద్‌ను తన వెంట తీసుకెళ్లి.. డిచ్‌పల్లి జాతీయ రహదారి పక్కన హత్య చేసి.. మృతదేహాన్ని పూడ్చి పెట్టాడు. అప్పులిచ్చిన వారు ప్రసాద్‌పై ఫిర్యాదు చేయడంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని వెంటనే పోలీస్‌స్టేషన్‌ రావాలని నమ్మించి..అతడి భార్య రమణిని కూడా తన వెంట తీసుకెళ్లాడు. బాసరలోని గోదావరి నది వైపు ఆమెను తీసుకెళ్లి హత్య చేసి.. ఆమెను నదిలో పడేశాడు.

ప్రసాద్‌, అతడి భార్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని నమ్మించి ప్రసాద్‌ చెల్లిని తీసుకెళ్లి హత్య చేశాడు. మృతదేహాన్ని కనిపించకుండా చేసేశాడు.ప్రసాద్‌ తల్లికి మాయమాటలు చెప్పి.. అతడి పిల్లలిద్దర్నీ నిజామాబాద్‌, నిర్మల్‌ జిల్లాల సరిహద్దులోని సోన్‌ బ్రిడ్జి వద్దకు తీసుకెళ్లి కిరాతకంగా హత్య చేసి కాల్వలో పడేశాడు. అందులో ఒక మృతదేహం ఈ నెల 8న లభించగా.. సోమవారం మరో మృతదేహం లభ్యమైంది. వీరందరూ పోలీసుల అదుపులో ఉన్నారని  చెబుతూ ప్రసాద్‌ మరో సోదరిని కూడా తీసుకెళ్లి..  కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌ మండలం భూంపల్లిలో ఇటీవల ఆమెకు నిప్పంటించి చంపేశాడు.

కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటన జరిగిన సమయంలో ప్రశాంత్‌ సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ అక్కడ ఉన్నట్లు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకొని కూపీ లాగగా.. వరుస హత్యల విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. మొదటి మూడు హత్యలను తానొక్కడినే చేశానని, ఆ తర్వాతి మూడు హత్యలను తన సోదరుడు, స్నేహితులతో కలిసి చేశానని ప్రశాంత్‌ అంగీకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నలుగురు నిందితులు కామారెడ్డి పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు