Naresh Goyal: జెట్‌ ఎయిర్‌వేస్‌ వ్యవస్థాపకుడు నరేశ్‌ గోయల్‌కు బెయిల్

జెట్‌ ఎయిర్‌వేస్‌ వ్యవస్థాపకుడు నరేశ్‌ గోయల్‌కు రెండు నెలల తాత్కాలిక బెయిల్‌ మంజూరైంది.

Published : 06 May 2024 17:17 IST

Naresh Goyal | ముంబయి: మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయిన జెట్‌ ఎయిర్‌వేస్‌ (Jet Airways) వ్యవస్థాపకుడు నరేశ్‌ గోయల్‌కు (Naresh Goyal) బెయిల్‌ మంజూరైంది. అనారోగ్య కారణాల రీత్యా బాంబే హైకోర్టు రెండు నెలల తాత్కాలిక బెయిల్‌ను మంజూరుచేసింది. బెయిల్‌పై కొన్ని షరతులు విధించింది. ట్రయల్‌ కోర్టు అనుమతి లేకుండా ముంబయి వీడకూడదని, రూ.లక్ష పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. పాస్‌పోర్టు కూడా సరెండర్‌ చేయాలని జస్టిస్‌ ఎన్‌జే జామ్‌దార్‌తో కూడిన సింగిల్‌ బెంచ్‌ సూచించింది.

అనారోగ్య కారణాల రీత్యా తనకు బెయిల్‌ ఇప్పించాలని కోరుతూ గోయల్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను ఫిబ్రవరిలో ప్రత్యేక కోర్టు నిరాకరించింది. ప్రైవేటు హాస్పిటల్‌లో చికిత్సకు మాత్రం అనుమతించింది. దీంతో గోయల్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. తనతోపాటు తన భార్య అనితా గోయల్‌ కూడా క్యాన్సర్‌తో బాధపడుతున్నందున బెయిల్‌ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. మానవతా దృక్పథంతో బెయిల్‌ ఇవ్వాలని నరేశ్‌ గోయల్ తరఫు న్యాయవాది హరీశ్‌ సాల్వే ధర్మాసనాన్ని కోరారు. ఈడీ తరఫు న్యాయవాది బెయిల్‌ను వ్యతిరేకించారు. ఆస్పత్రిలో చికిత్స కావాలంటే పొడిగించాలన్నారు. గోయల్‌ అనారోగ్యంతో పాటు, మానసిక అనారోగ్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఈ సందర్భంగా సాల్వే ధర్మాసనాన్ని కోరారు. దీంతో కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది.

భార్య ఇంకొన్ని నెలలే బతుకుతుంది.. బెయిల్‌ ఇవ్వండి ప్లీజ్‌

దేశీయ విమానయాన సంస్థ ‘జెట్‌ ఎయిర్‌వేస్‌’కు కెనరా బ్యాంకు మొత్తం 848.86 కోట్లు రుణం ఇచ్చింది. అందులో 538.62 కోట్లు కంపెనీ తిరిగి చెల్లించలేదు. దీంతో కెనరా బ్యాంకు కేసు పెట్టింది. సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి విచారణ చేపట్టి జెట్‌ ఎయిర్‌వేస్‌ మోసం చేసినట్లు తేల్చింది. ఈ కేసులో మనీలాండరింగ్‌ అంశాలు తేలడంతో ఈడీ సైతం దర్యాప్తు చేపట్టింది. గతేడాది సెప్టెంబరులో నరేశ్‌ గోయల్‌ను అరెస్టు చేసింది. అదే ఏడాది నవంబర్‌లో గోయల్‌ భార్యను అరెస్ట్‌ చేసినప్పటికీ.. ఆమె అనారోగ్య పరిస్థితి కారణంగా ప్రత్యేక కోర్టు అదేరోజు ఆమెకు బెయిల్‌ మంజూరు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని