Hyderabad News: పిల్లోడు నచ్చలే.. ప్రియుడితో పోతున్నా..

వివాహమై గంట కూడా గడవలేదు.. అంతలోనే వరుడు నచ్చలేదని తన ప్రియుడితో వెళ్లిపోతున్నానని నవవధువు అందరికీ షాక్‌ ఇచ్చింది. మగ పెళ్లివారు ఇచ్చిన రూ.50వేల నగదు, రూ.1.80 లక్షల విలువైన బంగారు ఆభరణాలతో ఉడాయించింది.

Updated : 19 Sep 2021 06:41 IST

నగలు, నగదుతో ఉడాయించిన వధువు
తమ సొత్తు తిరిగి ఇచ్చేస్తే చాలన్న వరుడు

పహాడీషరీఫ్‌, న్యూస్‌టుడే: వివాహమై గంట కూడా గడవలేదు.. అంతలోనే వరుడు నచ్చలేదని తన ప్రియుడితో వెళ్లిపోతున్నానని నవవధువు అందరికీ షాక్‌ ఇచ్చింది. మగ పెళ్లివారు ఇచ్చిన రూ.50వేల నగదు, రూ.1.80 లక్షల విలువైన బంగారు ఆభరణాలతో ఉడాయించింది. బాలాపూర్‌ ఠాణా పరిధిలో జరిగిన ఈ ఉదంతం శనివారం వెలుగు చూసింది. బెంగళూరుకు చెందిన ఓ వ్యాపారి (30)కి ఫలక్‌నుమా ప్రాంతంలో ఉండే యువతి(20)కి ఈనెల 16న పెళ్లి జరగాల్సి ఉంది. పెళ్లికుమారుడి కుటుంబం అదేరోజు రావడంతో శుభకార్యం మర్నాటికి వాయిదా వేశారు. 17వ తేదీ సాయంత్రం బాలాపూర్‌ పరిధిలో పెళ్లికూతురి బంధువుల నివాసంలో వివాహం జరిపారు. వివాహానంతరం బెంగళూరు బయలుదేరేందుకు సిద్ధమైన పెళ్లికుమారుడితో నవ వధువుకు మొహర్‌ రూ.50 వేలు ఇక్కడే ఇప్పించాలని, ఆమెకు ఇవ్వాల్సిన నగలన్నీ ఇక్కడే ధరింపచేయాలని మౌల్వీ పట్టుబట్టాడు. ఈక్రమంలో వరుడు నగదును వధువుకు అందించగా, వరుడి తల్లి నగలన్నీ ఆమెకు అలంకరించింది. అనంతరం తాను బ్యూటీపార్లర్‌కు వెళ్లాల్సి ఉందని వధువు పట్టుబట్టింది. అత్త, భర్త అందుకు అభ్యంతరం వ్యక్తం చేయగా తన అన్నలు, వదినలతో కలిసి బ్యూటీపార్లర్‌కు వెళ్లింది. అక్కడికెళ్లగానే ఆమె అదృశ్యమైందని తోడుగా వెళ్లినవారు వరుడికి ఫోన్‌ చేసి తెలిపారు. గంట సమయం గడిచిన తర్వాత వధువు తన అమ్మమ్మకు ఫోన్‌ చేసి తనకు భర్త నచ్చలేదని.. ప్రియుడితో వెళ్లిపోతున్నానని చెప్పి స్విచ్‌ ఆఫ్‌ చేసింది. దీంతో ఇరువర్గాల మధ్య వివాదం ముదరడంతో విషయం పోలీసుల వరకు చేరింది. తాము ఫిర్యాదు చేయదలచుకోలేదని, తమ నగలు, డబ్బు తిరిగి ఇస్తే వెళ్లిపోతామని వరుడు చెప్పారు. పథకం ప్రకారమే పెళ్లి చేసి.. వధువును ప్రియుడితో పంపేశారని వరుడు ఆరోపించారు. శుక్రవారం రాత్రినుంచి వాట్సప్‌ గ్రూపుల్లో ఈ అంశం హల్‌చల్‌ చేసింది. ఈ అంశంపై తమకు ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని