Hyderabad News: భర్త మరణం తట్టుకోలేక గృహిణి ఆత్మహత్య

భర్తమరణం తట్టుకోలేక ఫ్యాన్‌కు ఉరివేసుకుని భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన అంబర్‌పేటలో చోటు చేసుకుంది.

Updated : 25 May 2023 19:14 IST

హైదరాబాద్‌: కట్టుకున్న భర్త అకాల మరణం ఆ మహిళకు తీవ్ర మనోవేదన కలిగించింది. తన భర్తలేని ఈ లోకంలో తాను ఎందుకని తనువు చాలించింది. ఈ హృదయ విదారకఘటన హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో చోటు చేసుకుంది. రోజుల వ్యవధిలోనే రెండు మరణాలు చూసిన వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

అంబర్‌పేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని అంబర్‌పేట డీడీ కాలనీకి చెందిన సాహితి(29)కి వనస్థలిపురానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మనోజ్‌తో ఏడాది కిందట వివాహం జరిగింది. వివాహానంతరం దంపతులు ఇద్దరూ అమెరికా వెళ్లిపోయారు. డల్లాస్‌లో ఉద్యోగం చేస్తున్నారు. తల్లిదండ్రులను చూసేందుకని ఈ నెల 2న సాహితి హైదరాబాద్‌ వచ్చింది. అదే సమయంలో అమెరికాలో ఉన్న ఆమె భర్త మనోజ్‌కు గుండెపోటు రావడంతో తుది శ్వాస విడిచారు. భర్త మరణవార్త తెలిసినప్పటి నుంచి సాహితి తీవ్ర మనో వేదనకు గురైంది. ఈ నెల 23న మనోజ్‌ భౌతికకాయాన్ని అమెరికా నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. భర్త మృతదేహాన్ని చూసిన సాహితి తీవ్ర విచారంలో మునిగిపోయింది. బుధవారం మనోజ్‌ అంత్యక్రియలు ముగిసిన తర్వాత సాహితి అంబర్‌పేటలోని పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ముభావంగా ఉంటూ ఎవరితోనూ మాట్లాడలేదు. తోడుగా ఉన్న చెల్లెలు గురువారం ఉదయం బయటకు వెళ్లడంతో ఇంట్లో సీలింగ్‌ ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని సాహితి ఆత్మహత్య చేసుకుంది. కేవలం పది నిమిషాలు బయటకు వెళ్లి వచ్చే సరికి సాహితి ఈ తీవ్ర నిర్ణయం తీసుకుందని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని