logo

ఆదరిస్తే అభివృద్ధి చేస్తా : సుగుణ

ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి మొదటిసారి ఆదివాసీ మహిళకు కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ కేటాయించిందని ఆ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణ అన్నారు. దీంతో పార్టీకి ఆదివాసీలపై ఉన్న ప్రేమ నిరూపితమైందని తెలిపారు.

Published : 29 Mar 2024 05:13 IST

నాగోబాకు మొక్కుతున్న ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌, కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ

ఇంద్రవెల్లి, న్యూస్‌టుడే: ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి మొదటిసారి ఆదివాసీ మహిళకు కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ కేటాయించిందని ఆ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణ అన్నారు. దీంతో పార్టీకి ఆదివాసీలపై ఉన్న ప్రేమ నిరూపితమైందని తెలిపారు. గురువారం ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లోని నాగోబాకు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుతో కలిసి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఎన్నికల ప్రచారాన్ని కేస్లాపూర్‌ నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి సమాకలోని దుర్గాదేవి ఆలయానికి వెళ్లి పూజలు చేశారు. ఆదివాసీల గురువు కొరెంగా యశ్వంత్‌రావు మహారాజ్‌ ఆశీస్సులు తీసుకోగా ఆమెను సన్మానించారు. అక్కడి నుంచి ఆదివాసీ అమరవీరుల స్మారక స్థూపం వద్ద, అనంతరం మండల కేంద్రంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండల కేంద్రంలోని ఆదివాసీల ఆరాధ్య దేవత ఇంద్రాయికి ప్రత్యేక పూజలు చేశారు. ఆమె మాట్లాడుతూ తనపై పార్టీ ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్లమెంట్‌ పరిధిలోని ఏడు నియోజకవర్గాల ప్రజలకు అందుబాటులో ఉండి అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తానని తెలిపారు. ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ స్థానాన్ని ఎస్టీకి కేటాయించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంపీలుగా ఎన్నిక అయిన వారు ఎలాంటి అభివృద్ధి చేయలేదని గుర్తు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని