logo

నగదు దోపిడీ.. నిందితుల పట్టివేత

కొరాపుట్‌ జిల్లా నందపూర్‌ సమితి చటువా ప్రాంతంలో ఆంధ్ర రైతుల నుంచి డబ్బు దోపిడీ చేసి నేరంపై ఐదుగురు నిందితులను పోలీసు అధికారులు అరెస్టు చేశారు.

Published : 10 Jun 2023 01:23 IST

బాధితులు అల్లూరి సీతారామరాజు జిల్లా వాసులు

వెల్లడిస్తున్న పోలీసు అధికారులు, వెనుక ముసుగులో నిందితులు

సిమిలిగుడ, న్యూస్‌టుడే: కొరాపుట్‌ జిల్లా నందపూర్‌ సమితి చటువా ప్రాంతంలో ఆంధ్ర రైతుల నుంచి డబ్బు దోపిడీ చేసి నేరంపై ఐదుగురు నిందితులను పోలీసు అధికారులు అరెస్టు చేశారు. వీరిలో హోంగార్డులు, సమితి మాజీ సభ్యులు ఉండడం గమనార్హం. గురువారం రాత్రి నందపూర్‌ ఠాణాలో విలేకరుల సమావేశంలో ఎస్‌డీపీవో సంజయ్‌ కుమార్‌ మహా పాత్ర్‌ వివరాలు వెల్లడించారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా అంటిపాక గ్రామ రైతులు కె.చిట్టి బాబు, వీసోయి బిమ్‌దార్‌ కలసి పవర్‌ టిల్లర్‌ కొనుగోలుకు బుధవారం మధ్యాహ్నం కారులో జయపురం బయల్దేరారు. ఎండ తీవ్రంగా ఉండడంతో చట్టువా వద్ద ఆగి విశ్రాంతి తీసుకుంటుండగా.. మరో కారులో వచ్చిన ఐదుగురు వ్యక్తులు బెదిరించి వీరి వద్ద ఉన్న రూ.1.15 లక్షల నగదును దోచుకుని పారిపోయారు. దీనిపై బాధితులు పాడువా ఠాణాలో ఫిర్యాదు చేశారు. కొరాపుట్‌ ఎస్పీ అవినాష్‌ సొనకార్‌ ఆదేశాల మేరకు ఎస్‌డీపీవో సంజయ్‌ కుమార్‌ మహా పాత్ర్‌ నేతృత్వంలో ఎస్‌ఐలు సవ్యసాచి సత్‌ప్రతి, ప్రఫుల్‌ కుమార్‌ లక్రా,  సిబ్బంది ప్రత్యేక బృందంగా ఏర్పడి దర్యాప్తు ప్రారంభించారు. అంతటా గాలించి నిందితులను పట్టుకున్నారు. దోపిడిదారులైన పాడువా ఠాణాలో హోంగార్డులుగా పని చేస్తున్న నీలకంఠ పంగి, డంబ్రు దార్‌ మజీ, అర్జ్జున్‌ పంగి, కులర్‌ సింగ్‌, సమితి మాజీ సభ్యులు అంతర్జామి గుంట, బిలైజోల గ్రామానికి చెందిన మనిక్‌ గుంట ఉన్నారు. ఐదుగురినికి అరెస్టు చేసి.. వారు వినియోగించిన కారును, రూ.80 వేల నగదు, 4 చరవాణులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టుకు శుక్రవారం తరలించారు.వీరిలో మాజీ సమితి సభ్యులు అంతర్జామిపై అరకు, డుబ్రిగుడ, రాజమండ్రి, రాయగడతో పాటు వివిధ ఠాణాల్లో గంజాయి కేసులు ఉన్నట్లు ఎస్‌డీపీవో మహా పాత్ర్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని