logo

యార్లగడ్డ ప్రచారానికి అడ్డంకి.. ఆపై కత్తితో దాడి అని కేసు

కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కొయ్యూరులో తెదేపా అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ప్రచారం సందర్భంగా శుక్రవారం రాత్రి వైకాపాకు చెందిన కొందరు గలాటా సృష్టించారు.

Published : 05 May 2024 02:53 IST

కొయ్యూరులో వైకాపా వర్గీయుల నిర్వాకం
తెదేపా నేతల ఫిర్యాదును పట్టించుకోని పోలీసులు

హనుమాన్‌జంక్షన్‌, న్యూస్‌టుడే: కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కొయ్యూరులో తెదేపా అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ప్రచారం సందర్భంగా శుక్రవారం రాత్రి వైకాపాకు చెందిన కొందరు గలాటా సృష్టించారు. భారీ ప్రదర్శన నడుమ ప్రచారం నిర్వహించుకుంటూ వెళుతున్న యార్లగడ్డను అడ్డుకునే విధంగా కొందరు ట్రాక్టరు అడ్డుగా పెట్టారు. దీనిని తీయమని అడిగినా స్పందించలేదు. ఈ క్రమంలో దారికి అడ్డుగా కూర్చున్న ఒకరిని పక్కకు జరిపేందుకు తెదేపా స్థానిక నాయకులు ప్రయత్నించారు. దీనికి ససేమిరా అన్న అతడు ట్రాక్టరు బంపర్‌ని గట్టిగా పట్టుకోవడంతో చేతికి స్వల్ప గాయమైంది. దీంతో అతడ్ని గన్నవరం ప్రభుత్వాసుపత్రిలో చేర్పించిన వైకాపా నాయకులు, ఎస్సీ, ఎస్టీ చట్టం కింద ఫిర్యాదు చేశారు. తనపై సర్పంచి సత్యనారాయణతో సహా రామారావు, రామకృష్ణ కత్తితో దాడి చేశారంటూ జోజి అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. వైకాపా నాయకుల ఒత్తిడితో హనుమాన్‌జంక్షన్‌ పోలీసులు శనివారం ఉదయం సర్పంచి సత్యనారాయణ సహా పలువురిపై కేసు నమోదు చేశారు. ఇదే ఘటనలో వైకాపాకు చెందిన కొందరు తమపై దౌర్జన్యం చేశారంటూ తెదేపా వర్గీయులు ఇచ్చిన ఫిర్యాదును మాత్రం పోలీసులు పెండింగ్‌లో పెట్టడం గమనార్హం. ఈ విషయంపై ఎస్సై జనార్ధన్‌ను ‘న్యూస్‌టుడే’ సంప్రదించగా, ఆసుపత్రి నుంచి వచ్చిన నివేదిక ఆధారంగా కేసు నమోదు చేశామని, డీఎస్పీ ఆధ్వర్యంలో దర్యాప్తు సాగుతుందన్నారు. తెదేపా ఇచ్చిన ఫిర్యాదు పరిశీలనలో ఉందని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని