logo

ఐదు తరగతులకు ఒక్కరే

వినుకొండ నాలుగో వార్డు మండల పరిషత్‌ పాఠశాలలో ఐదు తరగతుల్లో 51 మంది విద్యార్థులున్నారు. ఈ ఏడాది జూన్‌లో ఇద్దరిలో ఒక ఉపాధ్యాయుడు ఉద్యోగ విరమణ చేయడంతో పోస్టు ఖాళీ అయింది. బడి తెరిచినప్పటి నుంచి నాలుగు నెలలుగా ఒక్కరే పని

Published : 09 Dec 2021 00:51 IST

ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత

ముందుకు సాగని విద్యార్థుల చదువులు

వినుకొండ నాలుగో వార్డులో ఐదు తరగతులకు బోధిస్తున్న ఉపాధ్యాయుడు

వినుకొండ నాలుగో వార్డు మండల పరిషత్‌ పాఠశాలలో ఐదు తరగతుల్లో 51 మంది విద్యార్థులున్నారు. ఈ ఏడాది జూన్‌లో ఇద్దరిలో ఒక ఉపాధ్యాయుడు ఉద్యోగ విరమణ చేయడంతో పోస్టు ఖాళీ అయింది. బడి తెరిచినప్పటి నుంచి నాలుగు నెలలుగా ఒక్కరే పని చేస్తున్నారు. యాప్‌లు నమోదు చేయడం, ఫొటోలు తీయడంతో పాటు పిల్లల్ని గొడవ చేయకుండా కూర్చోబెట్టడానికే అయనకు సమయం సరిపోతోంది. తాత్కాలికంగా మరొకర్ని సర్దుబాటు చేయమని విద్యాశాఖాధికారులకు విన్నవించినా ఫలితం లేదు.

రేపల్లె మండలం ఉయూరువారిపాలెంలో ఏకోపాధ్యాయిని పని చేస్తున్నారు. రెండో ఉపాధ్యాయుడు ఉద్యోగ విరమణ చేయడంతో ఈ విద్యా సంవత్సరం మొదటి నుంచి ఆమె ఒక్కరే పని చేస్తున్నారు. ఐదు తరగతుల విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించడం అలవిగాని పనిగా మారింది.

వినుకొండ, రేపల్లె అర్బన్‌, న్యూస్‌టుడే : ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలని విద్యాహక్కు చట్టం చెబుతుంటే.. ఐదింటికి ఒక్కరితోనే నడిపిస్తోంది విద్యాశాఖ. రోజు ఉదయం మూడు యాప్‌ల నమోదు, 13 ఫొటోలు అప్‌లోడు చేయడం తప్పనిసరి కావడంతో రోజులో సగం కాలం దానికి సరిపోతోంది. సిగ్నల్స్‌ లేక సెల్‌ఫోన్‌లో చక్రం గిరిగిరా తిరుగుతుంటే అందులోనే ముఖం పెట్టి కూర్చోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితిలో బడిలో చదువులు ఎలా ముందుకు సాగుతాయో ఊహించొచ్ఛు విద్యార్థికి ప్రాథమిక విద్య పటిష్ఠం కావాల్సిన తరుణంలో అధికార నిర్వహణ లోపం పిల్లలకు శాపంగా మారనుంది. కరోనా నేపథ్యంలో పల్లెల నుంచి పట్టణాలకు పిల్లల్ని బస్సులో పంపేందుకు తల్లిదండ్రులు విముఖత వల్ల ప్రభుత్వ బడుల్లో ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య పెరిగింది. అందుకు తగ్గట్లుగా బోధన సిబ్బంది లేనందున ఇబ్బంది పడుతున్నారు. 2018 డీఎస్సీ తర్వాత కొత్తగా నియామకాలు చేపట్టకపోవడంతో పాటు ప్రత్యామ్నాయ చర్యలు లేవు. క్వాలిఫైడ్‌ అభ్యర్థులతో అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్‌ల నియామకాలను పరిశీలిస్తున్నామని పాలకుల చెప్పిన మాటలు ఆచరణలో ఇప్పటి వరకు అమలు కాలేదు.

ఇబ్బందులివే..: ఉన్న ఒక ఉపాధ్యాయుడు హెచ్‌ఎం బాధ్యతలు నిర్వహించాలి. విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజనం అన్నీ పనులు ఒక్కరే చూసుకోవాలి. అధికారులు కోరిన సమాచారం వెంటనే పంపాలి. వ్యక్తిగత సెలవుపై వెళ్లినప్పుడు ప్రత్యామ్నాయం చూపించాలి. ఇవన్నీ చేయాలంటే ఐదు తరగతుల విద్యార్థులను ఒకే గదిలో కూర్చోపెట్టాలి. దీంతో 1,2,3 తరగతుల విద్యార్థులకు అక్షరాలు, ఇతర పాఠ్యాంశాలు చెప్పడం కష్టతరం. తద్వారా బోధనలో వారికి సరైన న్యాయం చేకూరడం లేదన్నది వాస్తవం.

మండలాల వారిగా ఇదీ పరీస్థితి

వినుకొండ మండలంలో నరగాయపాలెం, రామకృష్ణాపురం, గోనుగుంట్లవారిపాలెం, పెదకంచర్ల (ఎస్సీ), అయ్యన్నపాలెం, కొప్పుకొండ తండా, వినుకొండ 4వవార్డు మొత్తం ఏడు ఏకోపాధ్యాయ పాఠశాలలున్నాయి. బొల్లాపల్లిలో 11, మాచవరం రెండు, రేపల్లె 13, నగరం 20, నిజాంపట్నం 18, చెరుకుపల్లి 9, బాపట్ల 12, కర్లపాలెం 9, పిట్టలవానిపాలెం 10 పాఠశాలలు ఇలాగే ఒక్కరితో కొనసాగుతున్నాయి.

సర్దుబాటు ప్రయత్నంలో ఉన్నాం

మిగులున్న వారిని అవసరమైన చోటుకు సర్దుబాటు చేయాలని ప్రభుత్వం జీవో ఇచ్చింది. కొన్ని మండలాల్లో పోస్టులు ఖాళీలున్నాయి తప్ప మిగులు లేరు. 20 మంది కన్నా తక్కువ విద్యార్థులున్న చోట ఏకోపాధ్యాయ పాఠశాలగానే పని చేస్తుంది. అంతకన్నా ఎక్కువ ఉంటే రెండో ఉపాధ్యాయుడు నియామకం అవసరం. సెలవు పెడితే ప్రత్యామ్నాయం చూపించడమే కష్టతరంగా ఉంది. - సయ్యద్‌ జఫ్రుల్లాఖాన్‌, మండల విద్యాశాఖాధికారి

జిల్లాలో..

మొత్తం ప్రాథమిక పాఠశాలలు 2718

విద్యార్థుల సంఖ్య 1,74,480

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని