Nellore: కోటంరెడ్డిని తప్పించి.. నెల్లూరు రూరల్‌ ఇన్‌ఛార్జిగా ఆదాల ప్రభాకర్‌రెడ్డికి బాధ్యతలు

నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైకాపా ఇన్‌ఛార్జిగా అదాల ప్రభాకర్ రెడ్డి అధిష్ఠానం నియమించింది. ఇప్పటి వరకు ఇన్‌ఛార్జిగా ఉన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని ఆ బాధ్యతల నుంచి అధిష్ఠానం తప్పించింది.

Updated : 02 Feb 2023 17:23 IST

తాడేపల్లి: వైకాపా నేతల్లో అసంతృప్తి, విభేదాల దృష్ట్యా సీఎం జగన్‌ పార్టీ రీజినల్‌ కో-ఆర్డినేటర్లు, ముఖ్యనేతలతో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహించారు. నేతల మధ్య విభేదాలు, పరిష్కారం, తీసుకోవాల్సిన చర్యలపై సీఎం దిశానిర్దేశం చేశారు. వాలంటీర్లు కార్యదర్శుల నియామకంపై కూడా భేటీలో చర్చించారు. 26 జిల్లాల పార్టీ రీజినల్‌ కో-ఆర్డినేటర్లతో పాటు మంత్రి బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

త్వరలో ఎమ్మెల్యే కోటంరెడ్డిపై చర్యలు:  బాలినేని

సమావేశం ముగిసిన తర్వాత బాలినేని మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే ఫోన్‌ కాల్‌ను ఆయన స్నేహితుడే రికార్డింగ్‌ చేశారని తెలిపారు. కోటంరెడ్డిపై చర్యలకు సంబంధించి త్వరలో చర్చించి నిర్ణయం తీసుకుంటున్నామని చెప్పారు. ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగినట్టు ఎమ్మెల్యేలు ఆనం, కోటంరెడ్డి నిరూపించాలని సవాల్‌ విసిరారు. రెండేళ్లుగా ఫోన్‌ ట్యాపింగ్‌ అంటూ ఇప్పుడే ఎందుకు చెప్పారని నిలదీశారు. వెళ్లే ముందు ఏదో ఒక విమర్శలు చేసి పోతున్నారని మండిపడ్డారు. మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. కోటంరెడ్డి స్నేహితుడే ఫోన్‌ కాల్‌ రికార్డ్‌ చేశారని తెలిపారు. ‘‘ఫోన్‌ రికార్డింగ్‌ చేసి ట్యాపింగ్‌ అంటున్నారు. కోటంరెడ్డి స్నేహితుడు రామశివారెడ్డి వచ్చి అన్నీ చెబుతారు. డిసెంబరు 25న చంద్రబాబుతో కోటంరెడ్డి మాట్లాడినట్టు తెదేపా నేతలు చెబుతున్నారు. లోకేశ్‌తో కోటంరెడ్డి ఫోన్‌లో మాట్లాడారని తెలుస్తోంది. కోటంరెడ్డిని సీఎం నమ్మితే ఆయన నమ్మక ద్రోహం చేశారు’’ అని పేర్ని నాని అన్నారు.

ఎంపీ ఆదాలకు కొత్త బాధ్యతలు..

నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైకాపా ఇన్‌ఛార్జిగా ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని అధిష్ఠానం నియమించింది. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన ఫోన్ ట్యాపింగ్  చేస్తున్నారంటూ అధిష్ఠానంపై అసంతృప్తి వ్యక్తం చేయడంతో వైకాపా అగ్రనాయకత్వం రూరల్ ఇన్‌ఛార్జి బాధ్యతల నుంచి ఆయన్ను తప్పించింది. ఇన్‌ఛార్జి నియామకం కోసం పలువురు పేర్లను అధిష్ఠానం పరిశీలించినప్పటికీ.. చివరకు ఆదాల ప్రభాకర్ రెడ్డి పేరును ఖరారు చేసింది. దీంతో నెల్లూరు నగరంలోని ఆదాల నివాసం వద్ద వైకాపా కార్యకర్తల సందడి నెలకొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని