TS News: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఏబీవీపీ ఆందోళన ఉద్రిక్తం
ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్): డిగ్రీ, పీజీలో పెంచిన ఫీజులను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ)లో విద్యార్థులు మంగళవారం ఆందోళనకు దిగారు. పరిపాలనా భవనాన్ని ముట్టడించి ఉపకులపతి కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో పోలీసులు పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకొని అంబర్పేట స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ.. నూతన ఉపకులపతులు విశ్వవిద్యాలయాలను వ్యాపార కేంద్రాలుగా మారుస్తున్నారని ఆరోపించారు. వివిధ కోర్సుల ఫీజులను ఇష్టానుసారంగా పెంచేస్తున్నారని మండిపడ్డారు. ఫీజుల భారంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. పెంచిన ఫీజులను వెంటనే తగ్గించాలని, విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఫీజులు తగ్గించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.