logo

బైకు పోయిందా.. ఇక అంతే!

బైకు చోరీల కేసుల పరిష్కారంలో పోలీసుల నిర్లక్ష్యంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాహనం పోయిందని ఎవరైనా ఫిర్యాదు చేసినా స్పందన అంతంతమాత్రంగానే ఉంటోందని బాధితులు వాపోతున్నారు.

Published : 13 Apr 2024 08:22 IST

వాహన చోరీ కేసుల్లో జాప్యం

ఈనాడు- హైదరాబాద్‌: బైకు చోరీల కేసుల పరిష్కారంలో పోలీసుల నిర్లక్ష్యంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాహనం పోయిందని ఎవరైనా ఫిర్యాదు చేసినా స్పందన అంతంతమాత్రంగానే ఉంటోందని బాధితులు వాపోతున్నారు. కొన్ని ఠాణాల్లో సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ సీసీ కెమెరాలు తనిఖీ చేయడం.. ఇతర ఇతర ఆధారాలతో దొరకబుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నా మెజార్టీ కేసులను పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా ఎఫ్‌ఐఆర్‌ నమోదులో విపరీత జాప్యం జరుగుతోంది. ఎఫ్‌ఐఆర్‌ నమోదైతే వాహనం దొరికాక యజమానికి అప్పగించడానికి కోర్టు అనుమతి, చోరీ చేసిన వ్యక్తిని రిమాండు చూపడం వంటి సమస్యలు ఉంటాయనే ఉద్దేశంతో వేచి చూసే ధోరణి ప్రదర్శిస్తున్నారు. మొత్తంగా బాధితులకు చుక్కలు కనిపిస్తున్నాయి. కొందరు వాహన బీమా పాలసీని పొందలేని పరిస్థితి ఎదురవుతోంది.

కేసు లేకుండా ఎదురుచూపులు

నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో ఏటా 4 వేలకుపైగా వాహనాలు చోరీకి గురవుతున్నాయి. రికవరీ 50- 70 శాతం వరకూ ఉంటోంది. మెజార్టీ కేసుల్లో నిందితులు చిక్కిన తర్వాత కూపీ లాగినప్పుడే వాహనం గుట్టు బయటపడుతోంది. కొన్ని ముఠాలు వ్యవస్థీకృతంగా నడిపిస్తూ చోరీలు చేస్తుంటాయి. కొట్టేసిన బైకులను విడి భాగాలుగా అమ్ముకోవడం, తక్కువగా మార్చడం.. వాహన స్థితి బాగుంటే ఇతర రాష్ట్రాలు లేదా ఇతర జిల్లాల్లోని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ ధరకు విక్రయిస్తుంటాయి. ఇలాంటి కేసుల్లో రికవరీ చేయడం క్లిష్టంగా మారుతోంది. మిగిలిన కేసుల్లో మాత్రం పరిస్థితి పూర్తిగా వేరు. మైనర్లు, యువత జల్సాలు, చేతి ఖర్చుల కోసం వాహనాలు దొంగిలిస్తారు. బార్లు, రద్దీ ప్రదేశాలు, రోడ్ల వెంట పార్కింగ్‌ చేసినప్పుడు అదను చూసి కొటేస్తారు. నెంబరు ప్లేటు మార్చి తక్కువ ధరకు విక్రయించడం వంటివి ఉంటాయి. ఈ తరహా కేసుల్లో చోరీ అయిన వాహనాలు రోజుల వ్యవధిలో మరో ఠాణా పరిధిలో పోలీసులకు చిక్కుతుంటాయి. ఆయా పోలీస్‌స్టేషన్ల పరిధిలో చిక్కిన వాహనాల రిజిస్ట్రేషన్‌ నెంబర్ల ఆధారంగా పోలీసులు యజమానుల్ని సంప్రదిస్తుంటారు. వాహనం చోరీకి గురైన ప్రాంతం, దాని ఆచూకీ లభ్యమైన ప్రాంత పోలీసులు ఇద్దరూ మాట్లాడుకుని యజమానులకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారు.

ఇవీ ఉదాహరణలు..!

  • నగర శివారులో వారం రోజుల క్రితం బైకు చోరీ జరిగింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదు. వాహనం కొట్టేసిన దొంగ మిడ్జిల్‌ వరకూ వెళ్లి పెట్రోలు అయిపోగానే అక్కడ వదిలేశాడు. అక్కడి పోలీసులు వాహనం నంబరు ఆధారంగా యజమానిని సంప్రదించారు. చోరీ జరిగిన ఠాణాలో కేసు రిజిస్టర్‌ అయితేనే.. తదుపరి ప్రక్రియ పూర్తి చేసి వాహనాన్ని అప్పగిస్తామని మిడ్జిల్‌ పోలీసులు చెప్పారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు జాప్యంతో బాధితుడు ఠాణా చుట్టూ తిరుగుతున్నాడు.
  • మెట్రో దగ్గర పార్కింగ్‌ చేసిన వాహనం చోరీ అయ్యింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదు. నాలుగు నెలలు గడుస్తున్నా వాహన ఆచూకీ చిక్కలేదు.  ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తే బీమా క్లెయిమ్‌ చేస్తానని చెప్పినా స్పందించడం లేదు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని