logo

పల్లెల్లో వైద్య సేవలే లక్ష్యం

శాస్త్ర, సాంకేతిక రంగాల్లో రాణిస్తున్నా.. మారుమూల ప్రాంతాల్లోని గ్రామాలు వైద్య సదుపాయాలకు ఇంకా దూరంగానే ఉన్నాయి.

Updated : 27 Mar 2023 05:59 IST

నల్లమల మెడికోల మనోగతమిదీ

శాస్త్ర, సాంకేతిక రంగాల్లో రాణిస్తున్నా.. మారుమూల ప్రాంతాల్లోని గ్రామాలు వైద్య సదుపాయాలకు ఇంకా దూరంగానే ఉన్నాయి. గిరిజన తండాలు, చెంచు పెంటలు, పల్లెల్లో ఇప్పటికీ నాటు వైద్యాన్ని ఆశ్రయిస్తున్నారు. సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందక ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు ఆయా ప్రాంతాల్లోని యువతులను ఆలోచింపజేశాయి. తాము పుట్టి పెరిగిన గ్రామాల్లో మెరుగైన వైద్యసేవలు అందించి పల్లె ప్రజల ప్రాణాలు కాపాడాలన్న పట్టుదల వారిని వైద్య విద్యవైపు అడుగులు వేసేలా చేసింది. పుట్టి పెరిగిన ప్రాంతాల్లోని పేదలకు వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో ఏజెన్సీ ప్రాంతంలోని యువతులు ముందుకు సాగుతున్నారు.

న్యూస్‌టుడే, అచ్చంపేట


పేదరికం వెంటాడుతున్నా..

బియ్యని ప్రగతి

పదర మండలం వంకేశ్వరానికి చెందిన బియ్యని ప్రగతి నార్కట్‌పల్లిలో బీడీఎస్‌ మూడో సంవత్సరం చదువుతోంది. పేదరికం వెంటాడుతున్నా ఆమె ప్రతిభను గుర్తించి తండ్రి వెంకటేశ్‌ చదివిస్తున్నారు. కుమార్తె ఆశయానికి ఇబ్బంది రావద్దని కుటుంబానికి ఆధారంగా ఉన్న కొద్దిపాటి పొలాన్ని అమ్మారు. ఫీజు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్న ఆమెకు దాతలు చేయూతనందించారు. స్మార్ట్‌ఫోన్‌ లేకపోవడంతో కరోనా సమయంలో సొంతూరులో ఇరుగుపొరుగు వారి సహకారంతో ఆమె ఆన్‌లైన్‌ తరగతులకు హాజరయ్యారు. ప్రస్తుతం ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆమె.. దాతల సాయం కోసం ఎదురు చూస్తోంది. పీజీ చేసి డెంటల్‌ ఓరల్‌ క్యాన్సర్‌పై పరిశోధన చేయాలన్నదే తన లక్ష్యమని, దంత వైద్యురాలిగా స్థిరపడి పేదలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని చెబుతోంది.


తల్లిదండ్రుల ప్రోత్సాహంతో..

గుర్రం రేష్మ

అమ్రాబాద్‌ మండలం వంకేశ్వరానికి చెందిన గుర్రం రేష్మది మధ్య తరగతి కుటుంబం. తల్లిదండ్రులు కవిత, వీరయ్య చిన్న వ్యాపారం చేస్తూ కుమార్తెను చదివిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. ఎంబీబీఎస్‌ పూర్తి చేసి భవిష్యత్తులో న్యూరో సర్జన్‌గా ఎదగడమే లక్ష్యంగా ప్రణాళికతో చదువుతున్నానని రేష్మ తెలిపారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే కష్టపడి చదువుతున్నానని.. గ్రామీణ పేదలకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తానని చెబుతున్నారు.


జనరల్‌ మెడిసిన్‌పై ఆసక్తి

జె.ప్రణవి

అచ్చంపేటకు చెందిన జె.ప్రణవి 2016-21లో హైదరాబాద్‌లోని ఉస్మానియా వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ పూర్తి చేశారు. ఈ నెల 5న నిర్వహించిన పీజీ వైద్యవిద్యలో ప్రవేశానికి నిర్వహించిన నీట్‌లో 800 మార్కులకు 636 సాధించి జాతీయ స్థాయిలో 708వ ర్యాంకు సాధించారు. ఎంబీబీఎస్‌లో బయోకెమికల్‌ (జీవ రసాయన), ఫార్మకాలజీ (ఔషధశాస్త్రం) విభాగాల్లో ప్రతిభ చాటి బంగారు పతకాలు సొంతం చేసుకున్నారు. ఈమె నాన్న శ్రీనివాస్‌రెడ్డి అచ్చంపేటలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. నాన్న ప్రోత్సాహంతో ప్రణాళికతో చదివి ప్రతిభ చాటుతున్నానని ప్రణవి తెలిపారు. పీజీలో జనరల్‌ మెడిసిన్‌ విభాగాన్ని ఎంపిక చేసుకుంటానని, పీజీ పూర్తి చేసి నల్లమల ప్రాంతంలోని పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.


ఆ ఘటనలు కలచి వేశాయి

పంబలి నవ్య

అమ్రాబాద్‌ మండలం వంగురోనిపల్లికి చెందిన పంబలి నవ్య నాగర్‌కర్నూలులోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. తల్లిదండ్రులు లోకమ్మ, మల్లేశ్‌ వ్యవసాయం చేస్తూ కుమార్తెను చదివిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో సరైన వైద్య సేవలు అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతుండటంతో కుమార్తెను వైద్యవిద్య చదవాలని వారు ప్రోత్సహించారు. ఎంబీబీఎస్‌ పూర్తి చేసి గైనకాలజీలో పీజీ చేయాలని ఉందని నవ్య తెలిపారు. ఏజెన్సీ ప్రాంత గర్భిణులకు సరైన వైద్య సేవలు అందుబాటులో లేక ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు తనను కలచి వేశాయని, మహిళా వైద్య నిపుణురాలిగా పేదలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని