logo

ఇష్టానుసారం మాట్లాడటం తగదు..

తెలంగాణ ఏర్పాటుకు అడ్డం కాదు, నిలువు కాదు అన్నవాళ్లు ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నారని నోరు అదుపులో పెట్టుకోవాలని, ఇష్టానుసారం మాట్లాడితే ప్రజలే తిరగబడతారని మంత్రి హరీశ్‌రావు హెచ్చరించారు.

Published : 03 Oct 2022 00:45 IST

గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి హరీశ్‌రావు. ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి తదితరులు

పటాన్‌చెరు అర్బన్‌, న్యూస్‌టుడే: తెలంగాణ ఏర్పాటుకు అడ్డం కాదు, నిలువు కాదు అన్నవాళ్లు ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నారని నోరు అదుపులో పెట్టుకోవాలని, ఇష్టానుసారం మాట్లాడితే ప్రజలే తిరగబడతారని మంత్రి హరీశ్‌రావు హెచ్చరించారు. పటాన్‌చెరులో గాంధీ జయంతి పురస్కరించుకుని రూ.5.10 కోట్లతో థీమ్‌ పార్కు, కొండా లక్ష్మణ్‌ బాపూజీ, గాంధీ కాంస్య విగ్రహాలతో పాటు లయన్స్‌ క్లబ్‌ భవనం, జిమ్‌లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గాంధీ లేకుంటే స్వేచ్ఛా వాయువులు పీల్చేవారం కాదని అన్నారు. అలాంటి గాంధీజీని కూడా కొంతమంది కించపరిచే విధంగా తక్కువ చేసి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రతి రంగంలోనూ కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రం అవార్డులు సాధిస్తోంది. మిషన్‌ భగీరథ పథకానికి నీతిఅయోగ్‌ నిధులు ఇవ్వాలని సూచించినా కేంద్రం ఇవ్వడం లేదన్నారు. కాంగ్రెస్‌, తెదేపా ఏళ్లుగా పరిపాలించినా తాగునీరు ఇవ్వలేకపోయాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైదరాబాద్‌కు కృష్ణా ఫేజ్‌-3, గోదావరి జలాల తెచ్చారని.. మంజీరాను సంగారెడ్డి, పటాన్‌చెరుకు ఇచ్చి తాగునీటి కష్టాలు తీర్చారన్నారు. భాజపా చేసింది ఏమీ లేదని ధరలు పెంచుతూ, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతోందని ఎద్దేవా చేశారు. ఎంపీ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ కోసం తొలి, మలి విడత పోరాటాల్లో కొండా లక్ష్మణ్‌ బాపూజీ కీలకపాత్ర పోషించారన్నారు. ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ రమణ, చేనేత అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ ప్రభాకర్‌, మాజీ ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, కార్పొరేటర్‌ మెట్టుకుమార్‌ యాదవ్‌, మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ విజయ్‌కుమార్‌, తెరాస నాయకులు మధుసూదన్‌రెడ్డి, ఆదర్శరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని