logo

ఖాళీ ప్లాట్లు.. ఎన్నాళ్లీ పాట్లు

సూర్యాపేట పట్టణంలోని బాలాజీనగర్‌లో ఖాళీ స్థలంలో నీరు నిలిచి మురుగు కూపంగా మారింది. దుర్వాసనతో చుట్టుపక్కల ఇళ్లవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Published : 05 Dec 2022 06:10 IST

సూర్యాపేట పట్టణంలోని బాలాజీనగర్‌లో ఖాళీ స్థలంలో నీరు నిలిచి మురుగు కూపంగా మారింది. దుర్వాసనతో చుట్టుపక్కల ఇళ్లవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దోమల వృద్ధి చెందటంతో రాత్రి సమయంలో కాలనీవాసులు కంటినిండా కునుకుతీయడం లేదు. రోగాల బారినపడే పరిస్థితి నెలకొందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

సూర్యాపేట పురపాలిక, న్యూస్‌టుడే: చాలా మంది భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని పట్టణాల్లో ఇళ్ల స్థలాలు కొనుగోలు చేస్తున్నారు. గృహాలు నిర్మించుకోకుండా, ఎప్పటికప్పుడు నిర్వహణ చర్యలు తీసుకోకుండా ఖాళీగా వదిలేస్తున్నారు. నిర్మించిన ఇళ్ల కంటే స్థలాలు లోతట్టులో ఉండటంతో వర్షాలకు వరద నీరు నిలిచి మురుగు కూపాలుగా మారుతున్నాయి. జిల్లా కేంద్రంగా సూర్యాపేటతోపాటు తిరుమలగిరి, నేరేడుచర్ల, కోదాడ, హుజూర్‌నగర్‌ పురపాలికల పరిధిలో స్థిరాసి వ్యాపారం జోరందుకుంది. కొందరు నిబంధనలు పాటించకుండా ఇష్టారీతిన ప్లాట్లు ఏర్పాటు చేస్తూ విక్రయాలు చేస్తున్నారు. గతంలో ఉన్న కాలనీలతోపాటు కొత్తగా ఏర్పడిన వాటిలో ఓపెన్‌ ప్లాట్లు స్థానికులకు పెద్ద సమస్యగా మారాయి. జిల్లాలోని ఐదు పురపాలికల్లో 45 ప్రాంతాల్లో ఈ సమస్య నెలకొంది.

కొరవడిన పర్యవేక్షణ

ఖాళీ స్థలాల్లో మురుగు, వర్షం నీరు నిలిచి, పిచ్చిమొక్కలు పెరగకుండా యజమానులు చర్యలు తీసుకోవాలి. మున్సిపల్‌ అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో యజమానులూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కొనుగోలుదారులకు మున్సిపల్‌ అధికారులు అడపాదడపా నోటీసులు జారీ చేయడమే తప్ప శాశ్వత పరిష్కారం మాత్రం చూపడం లేదు. కొందరు స్పందించి రక్షణ చర్యలు తీసుకుంటుండగా, మరికొందరు పట్టించుకోవడం లేదు. కొందరి వివరాలు తెలియక వారికి నోటీసులు జారీ చేయలేకపోతున్నామంటూ పుర అధికారులు చేతులు దులుపుకొంటున్నారు. ఖాళీ స్థలం పన్ను(వీఎల్‌టీ)ను యజమానులు చెల్లించాల్సి ఉంటుంది. డాక్యుమెంట్‌ విలువలో 0.5శాతం కట్టాలి. అంటే రూ.లక్ష విలువచేసే స్థలానికి రూ.500 చెల్లించాలి. ఈ పన్నుల వసూలులోనూ అధికారులు వెనుకడుగు వేస్తున్నారు.


చర్యలు తీసుకుంటాం

-సత్యనారాయణరెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌, సూర్యాపేట

ఖాళీ స్థలాల యజమానులు నిబంధనలు పాటించకుంటే చర్యలు తీసుకుంటాం. మురుగు నిల్వ ఉండకుండా, పిచ్చిమొక్కలు మొలవకుండా యజమానులు చూసుకోవాలి. వీఎల్‌టీ వసూలు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని