logo

మిల్లర్ల తరుగు.. కర్షకుల విసుగు

జిల్లాలో కొంత మంది రైసుమిల్లర్లు రైతులను ఇబ్బంది పెడుతున్నారని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ వెల్లడించారు. మంగళవారం లింగాపూర్‌కు చెందిన కొంతమంది రైతుల ధాన్యాన్ని మిల్లుల్లో దించుకోకపోవడంతో విసుగు చెందిన ఆయన లారీతో సహా వెళ్లి

Published : 09 Dec 2021 03:15 IST

ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి

జిల్లాలో కొంత మంది రైసుమిల్లర్లు రైతులను ఇబ్బంది పెడుతున్నారని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ వెల్లడించారు. మంగళవారం లింగాపూర్‌కు చెందిన కొంతమంది రైతుల ధాన్యాన్ని మిల్లుల్లో దించుకోకపోవడంతో విసుగు చెందిన ఆయన లారీతో సహా వెళ్లి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.


రామారెడ్డి మండలం ఇస్సన్నపల్లిలో ఓ రైతు ధాన్యం సేకరణ పూర్తి చేయాలని కోరుతూ నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. పలు చోట్ల తరుగును నిరసిస్తూ రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ప్రతి సీజన్‌కు పెరుగుతున్న కష్టాలపై అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. అరకొర సాగునీటి వసతులతో పెద్ద జిల్లాల కంటే అధికంగా ధాన్యం ఉత్పత్తి సాధించిన జిల్లా రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. వడ్లు అమ్ముకునేందుకు ఎన్నడూ లేనంతగా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికీ కామారెడ్డి, ఎల్లారెడ్డి డివిజన్‌ పరిధిలోని కొన్ని కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి నిరీక్షిస్తూనే ఉన్నారు.  

కోతలెందుకు.. :  * ప్రభుత్వం ధాన్యం సేకరణ మొదలుపెట్టినప్పటి నుంచి పెద్దగా సమస్యలు తలెత్తలేదు. తూకంలో సంచికి 40 కిలోలు బదులుగా కిలోలోపే ఎక్కువగా వెళ్లేది. ఇటీవల కిలో నుంచి ఐదు కిలోల వరకు అదనంగా పంపితేనే బస్తాలను దించుకుంటామని మిల్లర్లు తెగేసి చెబుతున్నారు.  ప్రస్తుతం ప్రతి ధాన్యం కుప్పను ప్యాడీ క్లీనర్‌తో తూర్పార పట్టించినా కోతలు తప్పటం లేదు.  సాధారణంగా యాసంగి అధిక ఉష్ణోగ్రతలతో నూకలశాతం ఎక్కువగా ఉంటుండగా.. ఈసారి వానాకాలం వడ్లలోనూ పెరిగిందని మిల్లర్లు పేర్కొంటున్నారు. అయితే మిల్లుల్లో ఇటీవల నూకల శాతాన్ని పరీక్షిస్తున్న మినీ యంత్రాలను ప్రభుత్వం అధికారికంగా అనుమతించిందా లేదా అనేది అధికారులు వెల్లడించటం లేదు. మినీ యంత్రాల్లో నూకలు ఎక్కువగా వస్తాయని, పెద్దమిల్లుల్లో మరాడించినప్పుడు తగ్గుతాయని పలువురు పేర్కొంటున్నారు.   క్వింటా ధాన్యంలో ఒక శాతం మట్టిపెళ్లలు, రాళ్లు, ఒక శాతం చెత్త, తాలు, 5శాతం చెడిపోయిన, రంగు మారిన, మొలకెత్తిన, పురుగు పట్టిన ధాన్యం, 3శాతం పూర్తిగా తయారు కాక ముడుచుకుపోయినవి, 6శాతం తక్కువ రకాల మిశ్రమం, 17శాతం వరకు తేమ ఉన్నప్పుడు కనీసం మద్దతు ధర చెల్లించాలి.  ప్రస్తుతం హార్వెస్టర్లలతోనే నూర్పిడి చేసి ట్రాక్టర్లతో నేరుగా తెచ్చి కల్లాల్లో పోస్తుండటంతో నాణ్యంగా ఉంటున్నా కొర్రీలు, కోతలెందుకని రైతులు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో ఇప్పటికీ 20శాతం ధాన్యం కేంద్రాల్లో సేకరణకు సిద్ధంగా ఉంది. కాంటాలు వేసిన బస్తాలు తరలించాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని