Chandrababu: జగన్ వైరస్కు.. ఓటే వ్యాక్సిన్
ఐదేళ్ల వైకాపా పాలనా విధ్వంసంతో విలవిల్లాడుతున్న రాష్ట్రానికి కాయకల్ప చికిత్స చేస్తామని.. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకూ పరిష్కారం చూపిస్తామని తెదేపా అధినేత చంద్రబాబు ఉద్ఘాటించారు.
వైకాపా ఐదేళ్ల పాలనలో ఏపీ 30 ఏళ్లు వెనక్కి..
జగన్ గ్యాంగ్ అరాచకాలతో వనరులు, వ్యవస్థలన్నీ విధ్వంసం
కూటమి అధికారంలోకి వచ్చాక సమస్యలన్నింటికీ పరిష్కారం
ప్రతి హామీనీ పక్కాగా నెరవేరుస్తాం
రెండు నెలల్లో సమగ్ర అభివృద్ధి ప్రణాళిక ప్రకటన
పరిశ్రమలు, పెట్టుబడుల్ని ఆకర్షించి యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పన
అన్ని వర్గాల ఆకాంక్షలకు పట్టం కడతాం
‘ఈనాడు’తో ముఖాముఖిలో చంద్రబాబు
ఈనాడు - అమరావతి
జగన్ అరాచకాలన్నీ ప్రధానికి తెలుసు
రాజకీయాలు ఎలా ఉన్నా సమాజానికి చెడు జరుగుతుందనుకున్నప్పుడు మోదీ లాంటి నాయకులు సహించరు. ఐదేళ్లలో జగన్ చేసిన దోపిడీ, లూటీ, అప్రజాస్వామిక విధానాలు, ప్రభుత్వం చేసిన దారుణాలు, ప్రజలపై దాడులకు సంబంధించిన సమస్త సమాచారం ప్రధాని వద్ద ఉంది. దేవాలయాలు, తెలుగు భాష, మన సంస్కృతి, నాగరికతలపై దాడి వంటివన్నీ జగన్ విధ్వంసక విధానాలకు నిదర్శనాలు.
రెండేళ్లలో రోడ్లన్నీ అద్దాల్లా మారుస్తాం
అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోగా అన్ని రంగాల్ని గాడిలో పెట్టేందుకు కార్యాచరణ ప్రకటిస్తాం. వైకాపా హయాంలో ఛిద్రమైన రహదారులపై గుంతలు పూడ్చడమే కాదు, రెండేళ్లలో రహదారుల్ని పునర్నిర్మించి అద్దాల్లా మెరిసేలా చేసేందుకు వినూత్న ఆలోచనలు ఉన్నాయి. చేసి చూపిస్తాం.
ఖజానాను కొల్లగొట్టినవారి ఆస్తులు జప్తు చేస్తాం
ఖజానాను లూటీ చేసినవారిని వదిలిపెడితే దాన్ని లైసెన్స్లా భావిస్తారు. జగన్ను ఆదర్శంగా తీసుకుని జైలుకు పోయినా పర్వాలేదు, మా ఆస్తులు మాకుంటే చాలనుకుంటారు. అవినీతితో సంపాదించిన డబ్బును ఖజానాకు జమ చేసి, పేదల కోసం ఖర్చు పెట్టేలా పకడ్బందీ చట్టం తెస్తాం. బినామీల పేరిట పెట్టిన ఆస్తుల్నీ జప్తు చేస్తాం.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తాం
అత్యంత ప్రమాదకరమైన ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని కూటమి ప్రభుత్వం రాగానే రద్దు చేస్తాం. వైకాపా మళ్లీ అధికారంలోకి వస్తే టైటిల్ ట్రాన్స్ఫర్ ఆఫీసర్గా ఆ పార్టీ కార్యకర్తను పెడతారు. నా ఆస్తి నాదో కాదో అతను నిర్ణయిస్తాడు. అది నా ఆస్తి కాదని అతను చెబితే నేను చేయగలిగేదేమీ ఉండదు.
ఐదేళ్ల వైకాపా పాలనా విధ్వంసంతో విలవిల్లాడుతున్న రాష్ట్రానికి కాయకల్ప చికిత్స చేస్తామని.. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకూ పరిష్కారం చూపిస్తామని తెదేపా అధినేత చంద్రబాబు ఉద్ఘాటించారు. కూటమి అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. నరకానికి నకళ్లుగా మారిన రహదారులన్నింటినీ రెండేళ్లలో పునర్నిర్మిస్తామని వాగ్దానం చేశారు. పరిశ్రమలు, పెట్టుబడుల్ని ఆకర్షించి యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మహిళల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు ప్రాధాన్యమిస్తామన్నారు. దేశానికి వెన్నెముక అయిన రైతాంగానికి తమ ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తుందని.. అన్ని వర్గాల ఆకాంక్షల్నీ నెరవేరుస్తుందని భరోసా ఇచ్చారు. జగన్ ఈ రాష్ట్రానికి పట్టిన ప్రమాదకరమైన వైరస్ అని మండిపడ్డారు. రాష్ట్ర సంక్షేమాన్ని, పిల్లలకు మంచి భవిష్యత్తును కాంక్షించే ప్రతి ఒక్కరూ ఓటు అనే వ్యాక్సిన్తో ఆ వైరస్ను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. జగన్ అరాచక పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర భవిష్యత్తుకు దిశానిర్దేశం చేయబోతున్న ఎన్నికల వేళ చంద్రబాబుతో ‘ఈనాడు’ ప్రత్యేక ముఖాముఖి
‘ధ్వంసమైన రాష్ట్రాన్ని’ పునర్నిర్మిస్తాం
సవాళ్లు మాకేం కొత్త కాదు
అధికారంలోకి రాగానే కార్యాచరణ
ప్రధాని మోదీ సహకారంతో ముందుకెళతాం
నా మనసు చెప్పిందే.. శరీరం వింటుంది
ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే దాన్ని సాధించేలా మానసికంగా సిద్ధమవుతాను. లక్ష్యం స్పష్టంగా ఉండి, దాన్ని సాధించాలన్న తపన ఉన్నప్పుడు శరీరానికి ఇష్టం ఉన్నా లేకపోయినా సహకరించి తీరాల్సిందే. ఎన్నో సంవత్సరాలుగా దీన్ని నేను సాధన చేస్తున్నాను. ఎన్నికల ప్రచారంలో మండుటెండలో గంటల తరబడి మాట్లాడినా అలసట రాకపోవడానికి అదే కారణం. ఆ గంటసేపు వాతావరణం వేడిగా ఉందా? చెమటలు కారుతున్నాయా? అన్నది లెక్క చేయను. నా ప్రసంగం ప్రజల్లోకి వెళ్లాలి అన్నదానిపైనే నా దృష్టి ఉంటుంది. కొన్ని వేల మంది ఎండలో నిలబడి ప్రసంగం వింటుంటే.. వారికి నేను న్యాయం చేయాలి కదా? వారి త్యాగం ముందు నా కష్టం ఏపాటిది? ఈ రాష్ట్రాన్ని కాపాడటమే నా ప్రథమ ప్రాధాన్యం. దాని కోసం ఏం చేయడానికైనా సిద్ధం.
జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఇంత విధ్వంసం చేసిన తర్వాత మళ్లీ గాడిన పెట్టడం సాధ్యమేనా అని కొందరు సందేహిస్తున్నారని.. ఇలాంటి సవాళ్లు తమకు కొత్తకాదని తెదేపా అధినేత చంద్రబాబు చెప్పారు. రాష్ట్రం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించే వ్యూహం, దాన్ని అమలు చేసే కార్యాచరణ తమ దగ్గరున్నాయని స్పష్టం చేశారు. పూర్తి వ్యవసాయాధారిత రాష్ట్రంగా.. పెద్దగా పరిశ్రమల్లేక అంతంత మాత్రపు ఆర్థిక వ్యవస్థతో ఉన్న ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి వైపు నడిపించిన చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఉందని గుర్తు చేశారు. 1995లో తాను పాలన చేపట్టిన ఏడాదిలోనే పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తల్లో విశ్వాసం ప్రోదిచేయగలిగినట్లు చెప్పారు. ఒకపక్క ఎన్నికలతో పాటు ఫ్యాక్షన్, నక్సలిజం, ముఠాలు, రౌడీయిజం వంటి సవాళ్లను ఎదుర్కొంటూనే అభివృద్ధికి బాటలు వేశామని వివరించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన మరుక్షణమే రాష్ట్ర పునర్నిర్మాణానికి నడుం కడతామని ప్రకటించారు.
ఐదేళ్లలో జగన్ అరాచకపాలన, వ్యవస్థల విధ్వంసంతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కిపోయింది. రాష్ట్ర విభజన తర్వాత తొలి ఐదేళ్లలో రెవెన్యూలోటు, రాజధాని లేకపోవడం వంటి అనేక అవరోధాల్ని అధిగమించి రాష్ట్రాభివృద్ధికి మేం వేసిన బాటల్ని జగన్ ఛిద్రం చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తాం. నాకు, ప్రధాని మోదీకి.. అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్లమని పేరుంది. సంపద సృష్టించడం ఎలాగో మాకు తెలుసు. సంపద సృష్టించకపోతే ఆదాయం రాదు. ఆదాయం లేకపోతే సంక్షేమ పథకాలు అమలు చేయలేం. నేను ముఖ్యమంత్రిగా రెండో తరం ఆర్థిక సంస్కరణల్ని, ఐటీని, టెక్నాలజీని ప్రోత్సహించాను. మోదీ ప్రధాని అయ్యాక దేశానికి సుస్థిరత తీసుకొచ్చారు. ఆయన నాయకత్వపటిమ, సుస్థిర అభివృద్ధి, మెరుగైన పబ్లిక్ పాలసీలతో గత పదేళ్లలో దేశానికి గుర్తింపు తెచ్చారు. ఈ పదేళ్లలో భారతదేశం ప్రపంచంలో ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. ఇప్పుడు మూడో స్థానంలోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ‘వికసిత భారతదేశం.. వికసిత ఆంధ్రప్రదేశ్’ అన్నదే మా నినాదం. 2047 నాటికి భారతదేశం నం.1గా ఎదగాలి. దేశంలో ఆంధ్రప్రదేశ్ నం.1గా ఉండాలి. ప్రపంచంలో ఎక్కడున్నా తెలుగువారు మొదటి స్థానంలో ఉండాలి.. ఇదీ మా ఆకాంక్ష. కేంద్రంలోను, రాష్ట్రంలోనూ ఏర్పడే ఎన్డీయే డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో... మోదీ గ్యారంటీ, తెదేపా, జనసేన ప్రకటించిన సూపర్సిక్స్, మ్యానిఫెస్టోల్ని సరిగ్గా అమలు చేస్తే రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించగలం. జగన్ ఈ ఐదేళ్లలో అన్ని వ్యవస్థల్ని, అన్ని రంగాల్ని, గ్రోత్ ఇంజిన్లను విధ్వంసం చేశారు. అమరావతి, పోలవరం, పరిశ్రమల్ని సర్వనాశనం చేశారు. 75 సంవత్సరాలపాటు వివిధ ప్రభుత్వాలు కష్టపడి అభివృద్ధి చేసిన వాతావరణాన్ని జగన్ దెబ్బతీశారు.
నైపుణ్యాలను వెలికితీసి, ఉపాధి వైపు నడిపిస్తాం
ప్రధాని నరేంద్ర మోదీ 3 కోట్ల మంది మహిళల్ని లక్షాధికారుల్ని చేస్తామని చెప్పారు. మహిళా సాధికారతకు మేం ప్రకటించిన కార్యక్రమాల్లో కొన్నింటిని కేంద్ర పథకాలతో అనుసంధానం చేసుకుంటాం. మేం మూలధనాన్ని సమకూర్చి, కేంద్రం ఇచ్చేదాన్ని మార్జిన్ మనీగా పెట్టుకుని, బ్యాంకు రుణాలు ఇప్పించి.. అతివల అభివృద్ధికి బాటలు వేస్తాం. ప్రజల్లో ఉన్న నైపుణ్యాలపై సర్వే చేస్తాం. వారి ఆకాంక్షలకు తగ్గట్టుగా నైపుణ్యాలు పెంచేందుకు, అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తాం. 1995లో ఐటీ రంగం అభివృద్ధిపై అనేక సమావేశాలు పెట్టాను. అందరూ ఐటీని అభివృద్ధి చేస్తే బాగానే ఉంటుందన్నవారే గానీ ఏం చేయాలో ఎవరికీ నిర్దిష్టంగా తెలీదు. అప్పుడు బీఓఓటీ విధానంలో ఐటీ టవర్ కట్టాం. తర్వాత అది హైటెక్సిటీగా అభివృద్ధి చెందింది. మానవవనరుల కోసం ఇంజినీరింగ్ కళాశాలల సంఖ్యను 300కి పెంచాం. సొంతంగా కంపెనీలు ఏర్పాటు చేసే ఐటీ సంస్థలకు స్థలాలిచ్చి ప్రోత్సహించాం. అమెరికాలో 15 రోజులపాటు తిరిగి ఐటీ కంపెనీల్ని ఆహ్వానించాను. హైదరాబాద్కు మైక్రోసాఫ్ట్ అలాగే వచ్చింది. అక్కడ పనిచేసిన సత్య నాదెళ్ల ఇప్పుడు ఆ సంస్థకు సీఈఓ అయ్యారు. అప్పట్లో నేను చేసిన కృషి ఫలించి, గడిచిన పాతికేళ్లలో మనవాళ్లు ప్రపంచం నలుమూలలకూ వెళ్లి స్థిరపడి, కోటీశ్వరులయ్యారు. గుంటూరు తెదేపా లోక్సభ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ దానికి ఉదాహరణ. ఆయన ఎన్నికల అఫిడవిట్లో రూ.5 వేల కోట్ల ఆస్తులు ప్రకటించారు.
20-30 స్థానాల్లో మా అభ్యర్థుల్ని కొనేయాలనుకున్నారు
రాష్ట్రంలో కనీసం 20 నుంచి 30 అసెంబ్లీ స్థానాల్లో అంటే పులివెందుల, పుంగనూరు లాంటి చోట్ల అసలు తమకు పోటీయే లేకుండా చేయాలనేది జగన్ ఆలోచన. ఇది సాధ్యం కాకపోయేసరికి.. 10-20 చోట్ల ఎస్సీ, ఇతర బలహీనులైన అభ్యర్థులను డబ్బులిచ్చి కొనాలనుకున్నారు. అదీ కుదరలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చేసిన అరాచకాల్నే అసెంబ్లీ ఎన్నికల్లోనూ పునరావృతం చేయాలని చూశారు. మొన్నటి వరకు నన్ను ఎవరూ ఏం చేయలేరన్న జగన్.. ఇప్పుడు తన అరాచకాలకు అడ్డుకట్ట పడుతుందని భయపడుతున్నారు.
వైకాపా నేతల నిజస్వరూపాన్ని ఇంట్లో వాళ్లే బయటపెడుతున్నారు
జగన్ తానా అంటే తందానా అంటూ.. ఆయన బాటలోనే నడుస్తూ విధ్వంసాలతో చెలరేగిపోతున్న వ్యక్తులు, ప్రజల్ని మభ్యపెట్టి మళ్లీ అధికారంలోకి రావాలనుకుంటున్నవారు వైకాపాలో చాలా మంది ఉన్నారు. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలున్నా ఎవరూ బయటపడరు. కానీ వైకాపా నాయకుల నిజస్వరూపాన్ని వారి సొంత మనుషులే బయటపెడుతున్నారు. జగన్ ఎంత స్వార్థపరుడో, ఎంత భయంకరమైన వ్యక్తో ఆయన చెల్లెళ్లే చెబుతున్నారు. అంబటి రాంబాబు చరిత్రను ఆయన అల్లుడు బయట పెట్టారు. ముద్రగడ పద్మనాభం కుమార్తె, బూడి ముత్యాలనాయుడి కుమారుడు, దువ్వాడ శ్రీనివాస్ భార్య.. ఇలా ఆ నాయకులు ఎంత ఘనులో వాళ్ల ఇంట్లోవాళ్లే చెబుతున్నారు.
జగన్తో తెలుగు జాతి మనుగడే ప్రశ్నార్థకమైంది
జగన్ అహంభావి. అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి. ఆయనకు తరతమ భేదాలు లేవు. తన స్వార్థం కోసం ఎవర్నయినా బలిపెడతారు. తల్లి, పిల్లలు, చెల్లి, బాబాయి, బంధువులు.. ఎవరైనా ఒక్కటే. బాంధవ్యాల్లేవు. సొంత మనుషుల మీదే ప్రేమ లేని వ్యక్తికి ప్రజలపై ఏముంటుంది? ఆయన అణువణువునా వంచన, నటనే. నోరు తెరిస్తే అబద్ధాలు. ఓట్ల కోసం ఎంతకైనా బరితెగిస్తారు. ఐదు కోట్ల ప్రజలూ ఆయన బాధితులే. ఎక్కువ నష్టపోయింది పేదలే. జగన్ వల్ల తెలుగుజాతి మనుగడే ప్రశ్నార్థకమైంది. ఒకప్పుడు దావూద్ ఇబ్రహీం ఫోన్ చేశాడంటే చాలు.. భయపడిపోయి అడిగింది ఇచ్చేసేవారు. జగన్ ఆయన కంటే భయంకరమైన వ్యక్తి. అధికారదాహం తీర్చుకోవడానికి ఎవర్నయినా బలిపెడతారు. ఎంత చెత్త రాజకీయ నాయకుడికైనా కొన్ని విధానాలు, పద్ధతులు ఉంటాయి. జగన్కు అవేమీ లేవు. ప్రజలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని కాలరాశారు. అంతకు ముందు జగన్ను అహంభావి అని మాత్రమే అనుకునేవాణ్ని. ఈ ఐదేళ్లలో ఆయన్ను క్షుణ్నంగా అధ్యయనం చేశాక... మానసికస్థితి సరిగ్గా లేనివాళ్లే అలాంటి పనులు చేస్తారని అర్థమైంది. విద్వేషాల్ని రెచ్చగొట్టి, దుష్ప్రచారం చేసి రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికే జగన్ పత్రిక, టీవీ ఛానల్ పెట్టారు. వాటి కోసం అడ్డదారుల్లో రూ.2-3 వేల కోట్లు పోగేశారు. తెల్లారిలేస్తే చాలు విపక్షాలు, గిట్టనివారిపై వాటిలో విషప్రచారం చేస్తున్నారు. అబద్ధాలతో ఊదరగొడుతున్నారు. జగన్ అరాచకాలకు అన్ని వర్గాలూ దెబ్బతిన్నాయి. కొందరు తిరగబడ్డారు. సామర్థ్యం ఉన్నవాళ్లు తట్టుకుని నిలబడ్డారు. పరిశ్రమలున్న వ్యక్తులు జగన్కు భయపడి రాష్ట్రం నుంచి పారిపోయారు. గల్లా జయదేవ్ తన పరిశ్రమ పెట్టుబడుల్ని పొరుగు రాష్ట్రానికి తరలించడంతో పాటు, ఏకంగా రాజకీయాల్నే వదిలేశారు. జగన్ తనకు గిట్టని పారిశ్రామికవేత్తలను ఎంతగా వేధించారో దీన్ని బట్టే అర్థమవుతోంది.
పోస్టల్ బ్యాలట్ కోసం బారులు మార్పునకు సంకేతం!
ఐదేళ్లపాటు జగన్ ప్రభుత్వ కబంధహస్తాల్లో నలిగిపోయిన ప్రజలకు ఇప్పుడు స్వేచ్ఛ లభించింది. వైకాపా నాయకులు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బులిస్తుంటే.. మీరే ఉంచుకోండి అని చెబుతున్నారు. తెదేపా నాయకులకు స్వచ్ఛందంగా విరాళాలిస్తూ గెలుపు కోసం బాగా కృషి చేయాలని భుజం తడుతున్నారు. ప్రజల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. పోస్టల్ బ్యాలట్ను వినియోగించుకునేందుకు ఉద్యోగులు ఎక్కడికక్కడ బారులు తీరి నిలబడటమే దానికి సంకేతం. ‘మా ఉద్యోగ సంఘంలోనివారు ఇంత మంది ఓటింగ్కు రావడం చూసి ప్రజాస్వామ్యం బతికుందని, మనుగడ సాగిస్తుందని నమ్మకం కుదిరింది’ అని ఒక అమ్మాయి చెప్పిన వీడియో వైరలయింది. జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు తరిమికొట్టబోతున్నారు అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?
అందరూ ఆయన కాళ్లదగ్గర పడి ఉండాలనుకుంటారు
ఏ రాజకీయ నాయకుడైనా తన పార్టీ సిద్ధాంతాల గురించి చెబుతారు. ప్రత్యర్థుల వైఫల్యాలపై మాట్లాడతారు. జగన్ తన వైఫల్యాలను, అరాచకాల్ని మరుగుపరిచేలా ప్రత్యర్థులపై అబద్ధాలు విపరీతంగా ప్రచారంలో పెడతారు. అవే నిజమని ప్రజల్ని నమ్మించేలా వాతావరణాన్ని సృష్టిస్తారు. 2019 ఎన్నికలకు ముందు తిరుమల శ్రీవారి పింక్ డైమండ్ పోయిందని విపరీతంగా ప్రచారం చేశారు. అలాంటి అసత్యప్రచారాలతో ప్రజల్ని మభ్యపెట్టి, వారి తల నిమిరి, బుగ్గలు నిమిరి, విపరీతంగా నటించి అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత తన అసలు రూపం బయటపెట్టారు. ప్రజలకు పప్పు బెల్లాలు పంచి రూ.వేల కోట్లు దోచేశారు. సంక్షేమం పేరుతో ప్రజానీకమంతా తన దయాదాక్షిణ్యాలపై ఆధారపడేలా చేశారు. అందరూ తన కాళ్ల దగ్గర పడి ఉండాలన్నది ఆయన ఉద్దేశం. రాష్ట్రంలో సంక్షేమానికి బాటలు వేసిందే తెదేపా. ప్రజల ఆదాయం, ఉపాధి పెంచేందుకు, వారు డబ్బు సంపాదించుకునేందుకు మార్గాలు ఆలోచించాలి. అది చేయకుండా జగన్ ప్రజల్ని మభ్యపెడుతున్నారు. తాను మళ్లీ అధికారంలోకి రాకపోతే ఈ పథకాలు కూడా ఉండవని వారిని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అమాయకులు, చదువుకోనివాళ్లు ఆయన మాయలో పడుతున్నారు. జగన్ నిజస్వరూపాన్ని ప్రజలకు వివరిస్తున్నవారి ఇళ్లు, ఆస్తులు, ఆఖరికి కుటుంబసభ్యులపైనా వైకాపా వాళ్లు దాడులు చేస్తున్నారు. మీడియా సంస్థల్ని నియంత్రిస్తున్నారు. వారిపై కేసులు పెడుతున్నారు. అలాంటి వ్యక్తికి అసలు రాజకీయాల్లో కొనసాగే అర్హతే లేదు. ఈ ఎన్నికల్లో జగన్ను ఓడించకపోతే రాష్ట్రం అధోగతి పాలవుతుంది.
కేసులపై భయం ఉంటే ఇంతగా బరితెగించరు
32 కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉండి, 16 నెలలు జైలుకెళ్లిన జగన్కు నిజంగా కేసులంటే భయం ఉంటే ఇంత బరితెగించరు. దీన్ని జగన్ మానసిక స్థితి కోణంలోనూ చూడాలి. అప్పట్లో జగన్ అరాచకాలు భరించలేక, ఆయన హైదరాబాద్లో ఉంటే తన పదవికే ప్రమాదమని గ్రహించిన రాజశేఖరరెడ్డి కుమారుణ్ని బెంగళూరు పంపేశారు. ఆ విషయాన్ని జగన్ తల్లి తనతో చెప్పారని దివంగత సీఎం రోశయ్య ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. తల్లి విజయమ్మను మొదట వైకాపా కార్యనిర్వాహక అధ్యక్షురాలి పదవి నుంచి, ఆ తర్వాత గౌరవ అధ్యక్షురాలి పోస్టు నుంచీ ఎందుకు తొలగించారు? ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టే కదా ఆమెను మళ్లీ ఆహ్వానించారు? కానీ ఆమె అమెరికా వెళ్లిపోయారు. జగన్ అరాచకాల్ని తల్లే భరించలేకపోతుంటే వేరే వాళ్లకు సాధ్యమా? జగన్, వైకాపా నాయకుల అరాచకాలకు ఎన్నో కుటుంబాలు బలయ్యాయి. నంద్యాలలో అబ్దుల్ సలాం తన పిల్లల్ని రైల్వేట్రాక్కు కట్టేసి, భార్యతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డారంటే వారు మానసికంగా ఎంత కుంగిపోయి ఉంటారు? ఒంటిమిట్టలో వైకాపా నాయకులు భూమి రికార్డులు తారుమారు చేసినందుకు ఒక వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఆ బాధ భరించలేక ఆయన భార్య, కుమార్తె విషం తాగి చనిపోయారంటే ఎంత దారుణం? మద్యం ధరలు ఎందుకు పెంచారని అడిగినందుకు ఓం ప్రకాష్ అనే వ్యక్తిని వైకాపా నాయకులే హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించారు. వైకాపా నాయకుల్లోని అరాచకాన్ని, పైశాచికత్వాన్ని మనం ఊహించలేం.
తిరుమల పవిత్రతను దెబ్బతీశారు
మనకు స్వర్గం అంటే తెలియదు. కానీ తిరుమలలో తెల్లవారుజామున శ్రీ వేెంకటేశ్వరస్వామి సుప్రభాత దర్శనానికి వెళ్తుంటే ఆ అనుభూతి లభిస్తుంది. ఓం నమో వేంకటేశాయ.. అనే మంత్రోచ్చారణ నడుమ అక్కడి ప్రశాంతత, ఆ వాతావరణం ప్రత్యేక అనుభూతినిస్తుంది. అలాంటి తిరుమల పవిత్రతను జగన్ దెబ్బతీశారు. హిందూ సంప్రదాయాలపై దాడి చేస్తున్నారు. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో సంప్రదాయాలను చెరిపేయడం అంటే భక్తుల మనోభావాలు దెబ్బతీయడమే. ప్రసాదాలను వాణిజ్యంగా మార్చేశారు. నాణ్యత తగ్గించారు. దేవుడితో బేరం చేయాలనే ఆలోచన ఎంత దారుణం? చుట్టూ చెత్తాచెదారం, తినిపడేసిన పదార్థాలతో అపరిశుభ్ర వాతావరణం ఉంటే.. భక్తులకు ప్రశాంతత ఎలా లభిస్తుంది? తిరుమలలో ఎన్టీఆర్ అన్నదానం ప్రవేశపెట్టారు. నేను ప్రాణదాన కార్యక్రమం ప్రారంభించా. ఎంతోమంది నిత్యాన్నదానానికి పెద్దఎత్తున సహకారం అందిస్తున్నారు. అక్కడ ఆహారం ఎంతో నాణ్యంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకునేవాళ్లం. ఎప్పటికప్పుడు పరిశీలన చేయించాం. వైకాపా అధికారంలోకి వచ్చాక ఆహారంలో నాణ్యత బాగా తగ్గింది.
జగన్ లాంటి సీఎంను రాష్ట్ర చరిత్రలో చూడలేదు
జగన్ వంటి అత్యంత ప్రమాదకరమైన, అడుగడుగునా అబద్ధాలతో ప్రజల్ని మోసగించిన ముఖ్యమంత్రిని రాష్ట్ర చరిత్రలో చూడలేదు. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే తెలుగుజాతి మనుగడ ప్రమాదంలో పడుతుంది. రాష్ట్రం మరో సోమాలియాలా మారుతుంది. జగన్కు తల్లి, చెల్లి, బాబాయ్, బంధువు అనే తేడాలేమీ ఉండవు. తన స్వార్థం కోసం ఎవర్నయినా బలిపెట్టే ఆయనకు రాష్ట్ర ప్రజలు ఒక లెక్కే కాదు. జగన్, ఆయన గ్యాంగ్ రూ.వేల కోట్ల ఇసుక, గనులు, భూములతో పాటు మన పిల్లల భవిష్యత్తునూ దోచుకున్నారు. పరిశ్రమల్ని, పెట్టుబడిదారుల్ని తరిమికొట్టి.. యువతకు ఉద్యోగాలు, ఉపాధి లేక పొట్ట చేతపట్టుకుని పొరుగు రాష్ట్రాలకు తరలిపోయే దుస్థితి కల్పించారు.
కళంకిత వ్యక్తులకు తావు లేదు
క్రిమినల్ కేసులు, మద్యం కేసుల్లో నిందితులు సహా పలువురు కళంకితులకే తిరుమల తిరుపతి దేవస్థాన పాలకమండలిలో ప్రాధాన్యం కల్పించారు. వేంకటేశ్వర స్వామితో పెట్టుకున్నవాళ్లు, అపవిత్రం చేసినవాళ్లు ఈ జన్మలోనే శిక్ష అనుభవిస్తారు. నేను చాలా మందిని చూశాను. నాకు ప్రాణభిక్ష పెట్టిన వేంకటేశ్వరస్వామిపై నమ్మకం కలిగిన వ్యక్తిగా చెబుతున్నా. ఎట్టి పరిస్థితుల్లో తిరుమలలో అపవిత్రం కానివ్వం. మొత్తం విభాగాలను ప్రక్షాళన చేస్తాం. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. కళంకితులకు ఎట్టి పరిస్థితుల్లోనూ తావుండదు.
యువత వలసల్ని నివారిస్తాం
ఆకాంక్షలు నెరవేరే వాతావరణం ఇక్కడ లేనప్పుడే యువత వలస పోతారు. జగన్ ప్రభుత్వ విధ్వంసక విధానాల వల్ల ఉపాధి అవకాశాలు దెబ్బతిని, చదువుకున్న యువత మొత్తం పొరుగు రాష్ట్రాలకు వలసపోయింది. ఇది వరకు గ్రామాల నుంచి పట్టణాలకు వలస వెళ్లేవారు. ఇప్పుడు మన రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రాలకు వలస పోతున్నారు. ఇక్కడ అవకాశాలు కల్పిస్తే వారంతా మళ్లీ తిరిగి వస్తారు. వారిలో నమ్మకాన్ని పెంపొందిస్తాం. పరిశ్రమల్ని తెచ్చి, ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసి ఇక్కడే పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం.
పారిశ్రామికవేత్తల్లో నమ్మకం పునరుద్ధరిస్తాం
జగన్ ప్రభుత్వం పారిశ్రామికవేత్తల్ని, పెట్టుబడిదారుల్ని భయభ్రాంతుల్ని చేసింది. వారి ఆస్తుల్ని వైకాపా నాయకులు రాయించుకున్నారు. పోర్టులు, ఎస్ఈజెడ్లు సొంతం చేసుకున్నారు. సెటిల్మెంట్లు చేసి, ఆస్తులు కొట్టేశారు. విశాఖలోని రామానాయుడు స్టూడియో, దసపల్లా భూములు మింగేశారు. మనకు తెలిసినవి కొన్నే. బయటపడనివి ఎన్నో. అనేక ప్రాజెక్టుల్ని అకారణంగా రద్దు చేశారు. పోలవరం గుత్తేదారును ఎందుకు తొలగించారు? బందరు పోర్టు, భావనపాడు పోర్టులను డబ్బుల కోసమే రద్దు చేశారు. మద్యం, ఇసుకలో రూ.వేల కోట్ల లూటీ ఒక ఎత్తయితే.. గనుల్లో అతి పెద్ద కుంభకోణానికి పాల్పడ్డారు. గ్రానైట్, సిలికా ఇలా గనులన్నీ దోచేశారు. ఆ పరిస్థితిని పూర్తిగా మారుస్తాం. తెదేపా ప్రభుత్వం అంటేనే అభివృద్ధికి, నమ్మకానికి బ్రాండ్ అని పారిశ్రామికవేత్తలు విశ్వసిస్తారు. రాష్ట్రంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చాక పారిశ్రామికవేత్తల్లో ఆ నమ్మకాన్ని పునరుద్ధరిస్తాం. వారికి పూర్తి భరోసానిచ్చి, రాష్ట్రానికి పెట్టుబడుల్ని ఆకర్షిస్తాం. జగన్ ప్రభుత్వం తరిమికొట్టిన పెట్టుబడులు, పరిశ్రమల్ని రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తాం.
అమరావతి, పోలవరం నిర్మాణం పూర్తి చేస్తాం
ఎన్డీయే అధికారంలోకి వచ్చాక అమరావతి, పోలవరం నిర్మాణాన్ని ప్రథమ ప్రాధాన్యంగా తీసుకుని, పూర్తి చేస్తాం. వచ్చే ఐదేళ్లలో కేంద్రంలో, రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడి, మంచి నిర్ణయాలు తీసుకుంటే ఆ తర్వాత మరో ఐదేళ్లలో అభివృద్ధికి బలమైన పునాదులు పడతాయి. రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలంటే ఒడుదొడుకులు లేని సుస్థిర ప్రభుత్వం కొనసాగాలి. ఆలోచనా విధానంలో నిలకడ ఉంటేనే అభివృద్ధి సాధ్యపడుతుంది. ఇప్పుడిక ప్రయోగాలకు తావులేదు.
కల్తీ మద్యం నుంచి విముక్తి
జే-బ్రాండ్, గోవా మద్యం తాగినవారి ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటోంది. జగన్ సభలకు వచ్చినవారూ వైకాపా నాయకులు ఇచ్చిన నకిలీ మద్యం తాగి తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. జగన్ ప్రభుత్వ తప్పుడు మద్యం విధానాలతో ఆ పార్టీ నాయకులు రూ.వేల కోట్లు లూటీ చేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక హానికరమైన బ్రాండ్లను నిషేధిస్తాం. మద్యం ధరలు నియంత్రిస్తాం.
వైకాపా ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ నాశనం
వైకాపా ప్రభుత్వం అన్ని వ్యవస్థల్నీ నాశనం చేసింది. సాగు శాతం తగ్గిపోయింది. ఉత్పాదకత పడిపోయింది. సాగునీటి కాలువల్లో నీళ్లు రావడం లేదు. డ్రెయిన్లలో పూడిక పేరుకుపోయి వర్షాలు పడితే ఎక్కడికక్కడ ముంపు సమస్యలు తలెత్తుతున్నాయి. జగన్ ఎప్పుడైనా ఒక గంట కూర్చుని ఏ విభాగం పనితీరునైనా సమీక్షించారా? ఐదేళ్లలో ఎప్పుడైనా కలెక్టర్ల సదస్సు పెట్టి సమీక్ష చేశారా? యంత్రాంగానికి ఒక దిశానిర్దేశం లేదు. ఎంతసేపూ వాళ్లకు కావలసిన పనులు చేసుకోవడానికి, ఇతరుల్ని ఇబ్బంది పెట్టడానికే అధికారం మొత్తాన్ని వినియోగించారు. మేం అధికారంలోకి వచ్చిన వెంటనే.. మొదట వ్యవస్థలన్నింటినీ గాడిన పెడతాం. వైకాపా ప్రభుత్వం చేసిన అరాచకాలపై జ్యుడిషియల్ కమిషన్ వేసి విచారణ జరిపించాలన్న డిమాండ్లు వివిధ వర్గాల నుంచి ఉన్నాయి. ఎలా చేయాలన్నది ఆలోచిస్తాం.
అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో గంజాయి, డ్రగ్స్ను అరికడతాం. ఇందుకోసం స్పెషల్ టాస్క్ఫోర్సులు ఏర్పాటు చేస్తాం.
ఓట్ల బదిలీ పక్కాగా జరుగుతుంది
రాష్ట్రంలో తెదేపా, జనసేన మధ్య పొత్తు ముందుగా ఖరారవడం వల్ల రెండు పార్టీల మధ్య క్షేత్రస్థాయి నుంచీ విస్తృత సమన్వయం సాధ్యమైంది. భాజపా కాస్త ఆలస్యంగా చేరడంతో చిన్న చిన్న సమస్యలు తలెత్తినా ఇప్పుడు అన్నీ సర్దుకున్నాయి. మూడు పార్టీల మధ్య ఓట్ల బదిలీ పక్కాగా జరుగుతుంది. తెదేపాకు ఓటు వేసినవారంతా జనసేన, భాజపా అభ్యర్థులు పోటీ చేస్తున్నచోట వారికి కచ్చితంగా ఓటేస్తారు.
రైతుకు తిరిగి ఎంతివ్వొచ్చో ఆలోచిస్తున్నాం
వ్యవసాయ విద్యుత్తు మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగిస్తున్న జగన్... వారి నుంచి ఎంత బిల్లు వసూలు చేయాలా అని ఆలోచిస్తున్నారు. ఎన్డీయే అధికారంలోకి వచ్చాక వారి నుంచి పైసా వసూలు చేయం. తిరిగి వారికి ఆదాయం వచ్చేలా చూస్తాం. సోలార్ విద్యుత్తు ప్యానళ్లు ఉచితంగా ఇచ్చి.. వ్యవసాయ మోటార్ల వద్ద సౌర విద్యుదుత్పత్తిని ప్రోత్సహిస్తాం. అందులో వ్యవసాయానికి వినియోగించుకుంది పోగా మిగులు విద్యుత్ను గ్రిడ్కు అనుసంధానిస్తాం. దాన్ని గృహావసరాలకు వినియోగించుకోవచ్చు. ఇంకా మిగులు విద్యుత్ ఉంటే అమ్ముకోవచ్చు. తద్వారా రైతులకు అదనపు ఆదాయం లభిస్తుంది.
ముస్లిం రిజర్వేషన్లు కొనసాగిస్తాం
2014-19 మధ్య ముస్లింల హక్కులను పరిరక్షించాం. వారికి రిజర్వేషన్లు అమలు చేశాం. అధికారంలోకి వచ్చాక ముస్లిం రిజర్వేషన్లు కొనసాగిస్తాం. అందులో ఎలాంటి సందేహాలకు తావు లేదు.
తెలుగు అంతమైతే.. తెలుగు సమాజానికి గుర్తింపే ఉండదు
తెలుగు అనేది ఒక భాష కాదు.. అదొక సంస్కృతి, సంప్రదాయం, వారసత్వం. వాటినెలా ధ్వంసం చేస్తారు? మన దేవాలయాలకూ అనుసంధానమైన భాష తెలుగు. దానితోనే మన నాగరికత, సంస్కృతీ సంప్రదాయాలు ముడిపడి ఉంటాయి. పదిమంది ఒకచోట ఉన్నప్పుడు వారంతా తెలుగు మాట్లాడితేనే తెలుగువారని గుర్తింపు ఉంటుంది. తెలుగుభాష అంతమైన తర్వాత.. తెలుగు జాతికి గుర్తింపే ఉండదు. భరతనాట్యం, కూచిపూడి మన సంస్కృతులు.. వారసత్వ సంపదపై ఎవరు దాడి చేసినా తెలుగుజాతిపై దాడి చేసినట్లే. జగన్మోహన్రెడ్డి భాషపై దాడి చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరం. తెదేపా ఉన్నంతవరకు తెలుగు భాషపై ఎవరూ దాడి చేయలేరు. కాపాడుకుంటాం.
డబ్బు కాదు.. ఓటరు మనోభావాలే అంతిమం
ప్రజల్లో నీతి, నిజాయతీ ఉన్నాయి. డబ్బనేది ఈ రోజుల్లో కొంత అవసరమే. అయితే డబ్బుతోనే ఎన్నికలు కాదు. ఎంత ఖర్చు పెట్టినా.. ఓటర్ల మనోభావాలే అంతిమంగా పనిచేస్తాయి. ఈ ఎన్నికల్లో ఉద్యోగుల్ని డబ్బుతో కొనాలని చూస్తే.. వారు ఛీకొట్టారు. తిరిగి తెదేపాకు సహకారం అందించే పరిస్థితి వచ్చింది. జగన్ పాలనలో తాము ఏం కోల్పోయామో వారికి అర్థమైంది. సుపరిపాలన కారణంగా తమకు లాభనష్టాలేంటని బేరీజు వేసుకుంటున్నారు. రాష్ట్రమంతా సానుకూల వాతావరణం ఉంది. వారందరితో ఓటు వేయించుకుంటే ఫలితాలు ఏకపక్షమే. ఓటు వేయించుకోలేకపోతే ఇబ్బందే.
ఓటేయడానికి రాకపోతే.. గంజాయి మూకల బారిన పడతాం
మీ ఓటుతో బిడ్డల భవిష్యత్తు, ఆస్తులకు భద్రత లభిస్తాయి. స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోగలిగే పరిస్థితి ఉందా? కొత్త చట్టం ప్రకారం మీ ఆస్తిపై మీకు హక్కు ఉందా? గంజాయి మూక మీ ఇంటిపైకి వస్తే కేసు పెట్టగలరా? పెట్టినా పోలీసులు పట్టించుకుంటారా? ఓటేసే ముందు ప్రజలు ఇవన్నీ ఆలోచించాలి. వీటన్నింటికీ ఫుల్స్టాప్ పెట్టాలంటే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటింగ్కు రావాలి. కడప నుంచి ఒక యువతి వచ్చి తనను లైంగికంగా వేధించారని.. జీవచ్ఛవంలా బతుకుతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. తనలాంటి వారు వేల మంది ఉన్నారని చెప్పింది. అంటే కొంతమంది వేధింపులకు బలవుతున్నా చెప్పడం లేదు. రాష్ట్రంలో 31 వేల మంది ఆడపిల్లలు గల్లంతయ్యారని కేంద్ర ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఆడబిడ్డల్ని ఎత్తుకెళ్లి మూకుమ్మడి అత్యాచారం చేసి చంపేస్తున్నారు. పులివెందులలోనే ఒక ఎస్సీ మహిళను చంపేశారు. తాడేపల్లిలో సీఎం జగన్ ఇంటికి సమీపంలోనే అత్యాచారం జరిగినా దిక్కు లేదు. అమర్నాథ్గౌడ్ చెల్లి పరిస్థితి ఇంతే.. అడిగినందుకు ఆ పిల్లాణ్ని పెట్రోలు పోసి తగలబెట్టేశారు. ఇలాంటి పరిస్థితుల్లో చెల్లి, తల్లి, భార్యను కాపాడుకోగలమా?
ఆ వర్గాల వారికి 50 ఏళ్లకే ఆర్థిక సాయం అవసరం
చేనేత, గీత కార్మికులు 50 ఏళ్లకే చాలా బలహీనంగా తయారవుతారు. వారు చేసే పనులు అలాంటివి. ఇలాగే మరికొన్ని వర్గాలూ వృత్తి వల్ల చిన్న వయసులోనే బలహీనులుగా మారతారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల్లోని వారికి 50 ఏళ్లకే పింఛను అందిస్తాం. రాష్ట్రంలో బీసీలు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి వెన్నెముక. వారికి మేం ఎంత చేసినా తక్కువే. రుణం తీర్చుకోలేం.
గుర్తుంచుకోండి.. అప్రమత్తంగా ఓటేయండి
కుట్రలు, కుతంత్రాలు వైకాపా వారికి వెన్నతో పెట్టిన విద్య. తెదేపా, జనసేన, భాజపా పొత్తు పెట్టుకుని నడుస్తున్నాం. జనసేనకు గాజు గ్లాసు గుర్తు వచ్చింది. వైకాపా నీతిమాలిన రాజకీయాలతో కొందరిని అదే గ్లాస్ గుర్తుతో పోటీ చేయించి గందరగోళపరచాలని చూస్తోంది. ఈ విషయంలో కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి. ఏ పార్టీ ఎక్కడ పోటీ చేస్తోందో అందరికీ తెలుసు. అలాంటి గుర్తు వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉంటూ ఓటేయాలి.
నేరం చేయిస్తారు.. రక్షిస్తారు.. విషవలయంలోకి నెట్టేస్తారు
జగన్ ప్రభుత్వం ఉద్యోగుల నైతిక స్థైర్యంపై దెబ్బకొట్టింది. పాలకులు విధాన నిర్ణయాలే తీసుకుంటారు. కానీ ప్రభుత్వాన్ని నడింపించే రథసారథులు ఉద్యోగులే. జగన్ ప్రభుత్వం ఉపాధ్యాయుల్ని వేధించి, వారికి మద్యం దుకాణాల దగ్గర డ్యూటీలు వేయడం వంటి అరాచకాలకు పాల్పడింది. ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల్ని భయభ్రాంతుల్ని చేసి ప్రభుత్వానికి మద్దతిచ్చేలా చేశారు. పోలీసుల మెడపై కత్తిపెట్టి వారి కార్యకర్తల్లా పని చేయించుకున్నారు. ఇది భయంకరమైన పులివెందుల ఫ్యాక్షనిజం. మొదట వాళ్లే ఒకరితో నేరం చేయిస్తారు. వాళ్లే రక్షిస్తారు. ఆ తర్వాత మరో పెద్ద నేరం చేయిస్తారు. ఇలా అవతలివారిని ఒక విష వలయంలోకి నెట్టేస్తారు. ఈ ఐదేళ్లలో అందర్నీ అలాగే చేయాలని చూశారు.
20 లక్షల ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు, వర్క్స్టేషన్లు
యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. ప్రతి మండల కేంద్రంలో ఎకరా భూమి తీసుకుని.. అక్కడ నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాలు నిర్మిస్తాం. సుమారు 500 మోడల్స్లో నైపుణ్య శిక్షణ అందిస్తాం. బీఓటీ (నిర్మించి, నిర్వహించి, బదిలీ) విధానంలో వర్క్స్టేషన్లు ఏర్పాటు చేస్తాం. హైబ్రిడ్ మోడల్ అమలు చేస్తాం. యువత ఇంట్లో కూర్చునే పనిచేసుకోవచ్చు. నెలలో వారంపాటు అక్కడికి వచ్చి పనిచేసుకుంటే చాలు.
ఎవరికి వాళ్లు సేవ చేసుకుంటే.. ఆర్థిక వ్యవస్థ అదే అభివృద్ధి చెందుతుంది
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల సామాజిక, వృత్తిపరమైన పరిస్థితుల్ని, వారు ఎదుర్కొంటున్న సమస్యల్ని దృష్టిలో పెట్టుకుని 50 ఏళ్లకే పింఛను హామీ ఇచ్చాం. సామర్థ్యం ఉన్నవారు ఎవరికి వాళ్లు అభివృద్ధి చెందితే.. ఆర్థిక వ్యవస్థ దానంతట అదే అభివృద్ధి చెందుతుంది. 1995 నుంచి ప్రజల్ని ఆ దిశగా ఉత్తేజితుల్ని చేశాను. ఇకపైనా చేస్తాను.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫలితాలను చూసి జగన్ షాక్ అవుతారు: దేవినేని ఉమా
ఎన్నికల ఫలితాలను చూసి సీఎం జగన్ షాక్ అవుతారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జోస్యం చెప్పారు. -
తాడిపత్రిలో ఉంటే బయటకు రానివ్వం.. జేసీ తనయుడికి పోలీసుల హెచ్చరిక
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా నేతలు జేసీ దివాకర్రెడ్డి, జేసీ ప్రభాకర్రెడ్డి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని పోలీసులు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
తెదేపాకు ఓటేశారని వైకాపా మూకల దాడి
తెదేపాకు ఓటు వేశారన్న అక్కసుతో ఓ కుటుంబంపై బుధవారం వైకాపా మూకలు దాడికి తెగబడ్డాయి. ప్రశాంత విశాఖలో రెచ్చిపోయి రక్తపాతం సృష్టించాయి. -
తెదేపా ఏజెంట్లుగా కూర్చున్నందుకు ఇంటికెళ్లి పిల్లలపై దాడి
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఎన్నికల సందర్భంగా సాగించిన దాష్టీకాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. -
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
దుర్మార్గంగా దాడులు చేస్తోంది కాక.. మాపై తప్పుడు కథనాలా?
పోలింగ్ సమయంలో, అనంతరం వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడ్డా.. సాక్షి, వైకాపా అనుకూల మీడియాలో మాత్రం ప్రతిపక్షాలపై బురదజల్లుతూ తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని తెదేపా సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి ధ్వజమెత్తారు. -
వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం
ఏపీలో వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం వల్లే పోలింగ్ అనంతరం పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ నిలిపివేయండి
గ్రామ, వార్డు సచివాలయాలకు ‘ఈ-ఆఫీస్’ను విస్తరించడం, ప్రస్తుతం వాడుకలో ఉన్న వెర్షన్ను అప్గ్రేడ్ చేసే పేరుతో వైకాపా ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
ప్రజలు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు
గతంలో ఎన్నడూ లేనంతగా 81.86 శాతం మంది తెలుగు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం ఆనందాన్ని కలిగించిందని జనసేన అధినేత పవన్కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. -
గతం కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తున్నాం
‘రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో 175కి 151 అసెంబ్లీ స్థానాల్లో, 25కి 22 లోక్సభ సీట్లలో వైకాపా గెలిచింది. ఈ ఎన్నికల్లో ఆ రికార్డును బ్రేక్ చేయబోతున్నాం. -
ఎస్సై, పోలీసులపై వైకాపా మూకల దాడి
వైకాపా మూకల అరాచకానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ప్రతిపక్ష కార్యకర్తలతో పాటు అడ్డుచెప్పిన పోలీసులను సైతం వదలకుండా దాడులకు తెగబడుతున్నారు. -
పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో 13 మంది అరెస్టు
తిరుపతి జిల్లా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో 13 మంది నిందితులను గురువారం అరెస్టుచేశారు. -
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే, అనుచరులపై కేసు
ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లా పోరంకిలో జరిగిన ఘర్షణలపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే మంత్రి జోగి రమేష్, ఆయన కుమారులు, అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
కాసుల కక్కుర్తితో పేదల సొమ్మును దారి మళ్లించాలని చూస్తారా?
కాసుల కక్కుర్తితోనే సంక్షేమ పథకాల అమలు కోసం ఉంచిన రూ.14 వేల కోట్ల నిధుల్ని వైకాపా అనుకూల గుత్తేదార్లకు దోచిపెట్టాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్రెడ్డి చూస్తున్నారని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ధ్వజమెత్తారు. -
తాడిపత్రి అల్లర్లలో 91 మంది అరెస్టు
పోలింగ్ తర్వాత రోజు అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్ల ఘటనలో పోలీసులు 91 మందిని అరెస్టు చేశారు. గురువారం వారిని ఉరవకొండ న్యాయస్థానంలో హాజరుపర్చగా జడ్జి 14 రోజుల రిమాండు విధించారు. -
కౌంటింగ్కు ఏజెంట్లు రారని జగన్ భయం: లంకా దినకర్
ఓట్ల లెక్కింపురోజు ఏజెంట్లు కూడా కరవవుతారన్న భయంతోనే ఎన్నికల్లో గెలుస్తామని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. -
అనర్హత వేటు వేయడం కక్ష సాధింపే
శాసనమండలి సభ్యుడిగా ఉన్న తనపై ఛైర్మన్ అనర్హత వేటు వేయడం ముమ్మాటికీ వైకాపా కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని తెదేపా నేత జంగా కృష్ణమూర్తి విమర్శించారు. -
ఎన్నికల పరిశీలకుడు దీపక్ మిశ్ర అండతోనే తెదేపాకు అనుకూలంగా పోలీసులు వ్యవహరించారు
‘రాష్ట్రంలో నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకోసం ప్రత్యేక పరిశీలకుడిగా కేంద్ర ఎన్నికల సంఘం తనకు అప్పగించిన బాధ్యతను దీపక్ మిశ్ర విస్మరించారు. -
ఆ అధికారుల వైఫల్యం వల్లే హింసాకాండ
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో చోటుచేసుకున్న హింసాకాండకు ఆ మూడు జిల్లాల ఎస్పీలతో పాటు, పల్నాడు జిల్లా కలెక్టర్ వైఫల్యమే కారణమని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం నివేదిక ఇచ్చారు.
తాజా వార్తలు
-
తెలంగాణ కేబినెట్ భేటి.. షరతులతో కూడిన అనుమతిచ్చిన ఈసీ
-
అందుకే భారత్తో వాణిజ్య బంధం తెగిపోయింది: పాక్
-
పట్టభద్రులారా ఆలోచించి ఓటు వేయండి: కేటీఆర్
-
ఎంపీగా గెలిస్తే.. బాలీవుడ్ను వీడుతారా? కంగనా ఏం చెప్పారంటే..
-
పంచన్ లామా ఎక్కడ: చైనాను మరోసారి అడిగిన అమెరికా
-
తిరుపతి జిల్లాలో పలుచోట్ల ‘సిట్’ విచారణ.. పలు విషయాలపై ఆరా!