logo

జిల్లా అభివృద్ధి బాధ్యత నాది

నిజామాబాద్‌ జిల్లా అభివృద్ధికి తాను అండగా నిలుస్తానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.

Updated : 09 May 2024 05:59 IST

ఇంజినీరింగ్‌, మహిళా డిగ్రీ కళాశాలలు మంజూరు చేస్తా
ఆర్మూర్‌ మున్సిపల్‌ భవనానికి రూ.16 కోట్లు
రోడ్‌ షోల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ

నిజామాబాద్‌ అర్బన్‌, ఆర్మూర్‌, ఆర్మూర్‌ పట్టణం, న్యూస్‌టుడే: నిజామాబాద్‌ జిల్లా అభివృద్ధికి తాను అండగా నిలుస్తానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఆర్మూర్‌, నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన రోడ్‌ షోల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఇందూరుకు ప్రభుత్వ ఇంజినీరింగ్‌, మహిళా డిగ్రీ కళాశాలలు, రింగ్‌ రోడ్డు ఏర్పాటు చేసే బాధ్యత తీసుకుంటానని చెప్పారు. నగరం స్మార్ట్‌ సిటీలో ఉండేలా చొరవ చూపుతానన్నారు. కోడ్‌ ముగియగానే ఆర్మూర్‌లో పురపాలక సంఘం కార్యాలయ భవనానికి రూ.16 కోట్లు మంజూరు చేస్తానన్నారు. ఛైర్‌పర్సన్‌ లావణ్య తన దృష్టికి తెచ్చిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని మాటిచ్చారు. ‘ఇవన్నీ చేసే బాధ్యత నాది.. మీరంతా 13న జరిగే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేసి గెలిపించే బాధ్యత తీసుకోవాలి’ అని కోరారు. పదేళ్లు తమ ప్రభుత్వమే ఉంటుందని, అన్ని సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకుందామని చెప్పారు.

మచ్చలేని జీవన్‌రెడ్డిని గెలిపించండి..

‘వంద రోజుల్లో చక్కెర కర్మాగారం తెరిపిస్తానని అప్పటి ఎంపీ కవిత మోసగించారు. 2019 ఎన్నికల్లో ఐదు రోజుల్లో పసుపు బోర్డు కోసం అర్వింద్‌ బాండ్‌ పేపర్‌ రాసిచ్చి మోసం చేశారు. రాజ్‌నాథ్‌ సింగ్‌, రాంమాధవ్‌లతో ప్రకటన చేయించారు. ఆరు అడుగుల అహంకారమే అర్వింద్‌, ఆయన నిర్లక్ష్యం వల్లే నిజామాబాద్‌కు నిధులు రాకుండాపోయాయి.. ఆర్మూర్‌లో భాజపా ఎమ్మెల్యేను గెలిపించి పెనం పైనుంచి పోయిలో పడినట్లు అయింది. ఆయన ఈ ప్రాంత అభివృద్ధికి ఏమైనా నిధులు తెచ్చారా? అని ప్రశ్నించారు. ఈ సారి కాంగ్రెస్‌కు అవకాశం ఇవ్వండి. స్వయాన రైతు, 40 ఏళ్ల ప్రజాజీవితంలో మచ్చలేని నాయకుడు జీవన్‌రెడ్డి అని, ఆయనను గెలిపించాలి. లేదంటే మంచి ఓడిపోయి.. మోసమే గెలిచినట్లవుతుందని పేర్కొన్నారు.

ఆర్మూర్‌లో మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి, చిత్రంలో ఎంపీ అభ్యర్థి జీవన్‌రెడ్డి, పుర ఛైర్‌పర్సన్‌ లావణ్య, ఆర్మూర్‌, బాల్కొండ నియోజకవర్గాల ఇన్‌ఛార్జులు వినయ్‌రెడ్డి, సునీల్‌రెడ్డి

ఆర్మూర్‌ వల్లే ఈస్థాయికి వచ్చా..

పసుపు బోర్డు కోసం ఆర్మూర్‌ ప్రాంత రైతులు 2021లో చేసిన ధర్నా తన ఎదుగుదలకు దోహదం చేసిందన్నారు. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పాల్గొన్న ఆ ధర్నా సోనియమ్మ దృష్టిని ఆకర్షించడంతో పీసీసీ అధ్యక్ష పదవి, ఆ తర్వాత పోరాటాలతో పార్టీ అభివృద్ధికి చేసిన కృషి చూసి సీఎం పదవి ఇచ్చారని వెల్లడించారు. ‘ఆదర్శ గ్రామం అంకాపూర్‌.. ఇక్కడి రైతుల చైతన్యం ఇతరులకు స్ఫూర్తి. నల్లాచట్టాలు రద్దు చేయించిన హరియాణ, పంజాబ్‌ మాదిరిగానే.. ఆర్మూర్‌ రైతులు పోరాట పటిమ కలిగి ఉంటారు’ అని తెలిపారు. ఎమ్మెల్సీ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, భూపతిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ, పుర ఛైర్‌పర్సన్‌ వన్నెల్‌దేవి లావణ్య, మాజీ మంత్రి మండవ, డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి, నాయకులు అరికెల, ఏ.లలిత, అన్వేష్‌రెడ్డి, తాహెర్‌, గడుగు గంగాధర్‌, వినయ్‌రెడ్డి, సునీల్‌రెడ్డి, కేశ వేణు, ధర్మపురి సంజయ్‌, ఏ.సుజాత పాల్గొన్నారు.

ఆర్మూర్‌ అంబేడ్కర్‌ చౌరస్తాలో కార్నర్‌మీటింగ్‌కు హాజరైన ప్రజలు

కాంగ్రెస్‌ శ్రేణుల్లో జోష్‌..

ఎన్నికలు సమీపిస్తున్న వేళ నిజామాబాద్‌ లోక్‌సభ అభ్యర్థి జీవన్‌రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ బుధవారం కాంగ్రెస్‌ పార్టీ రోడ్‌ షోలు నిర్వహించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరై ఈ ప్రాంత సమస్యలపై మాట్లాడి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. ఆర్మూర్‌లో పాత బస్టాండ్‌ ప్రాంతం నుంచి అంబేడ్కర్‌ కూడలి వరకు ఓపెన్‌ టాప్‌ వాహనంలో ప్రయాణిస్తూ ప్రజలకు అభివాదం చేశారు. అంబేడ్కర్‌ కూడలిలో నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ..భాజపా, భారాసలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆర్మూర్‌లో భారాస జీవన్‌రెడ్డి నకిలీ అని.. అసలు జీవన్‌రెడ్డి తాటిపర్తి జీవన్‌రెడ్డి అంటూ ఎద్దేవా చేశారు. ‘లక్ష ఓట్లతో గెలిపించాలి.. నేను లక్ష అంటా..మీరు పక్కా’ అనాలని సూచించి పలుమార్లు నినాదాలు చేయించారు. నిజామాబాద్‌లో గోల్‌ హనుమాన్‌ మందిరం కూడలి నుంచి నెహ్రూ పార్క్‌ వరకు ఓపెన్‌ టాప్‌ జీపులో ప్రయాణిస్తూ ప్రజలకు అభివాదం చేశారు. అనంతరం జరిగిన కార్నర్‌ మీటింగ్‌లో తెలుగు, ఉర్దూ భాషలో ప్రసంగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని