logo

ప్రైవేటుకు ఒ.ఎస్‌.ఆర్‌.టి.సి. బస్సులు

ఒడిశా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఒ.ఎస్‌.ఆర్‌.టి.సి.) నష్టాల్లో కొనసాగుతోంది. దీంతో ప్రభుత్వం బస్సులకు ప్రైవేట్‌ సంస్థకు అప్పగించేందుకు సన్నాహాలు ప్రారంభించింది.

Updated : 28 Jan 2023 05:37 IST

త్వరలో టెండర్ల ప్రక్రియ
కటక్‌, న్యూస్‌టుడే

డిశా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఒ.ఎస్‌.ఆర్‌.టి.సి.) నష్టాల్లో కొనసాగుతోంది. దీంతో ప్రభుత్వం బస్సులకు ప్రైవేట్‌ సంస్థకు అప్పగించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. గతవారం రాష్ట్ర రవాణా శాఖ కార్యదర్శి ఉష పాఢి నేతృత్వంలో జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఓఎస్‌ ఆర్టీసీకి నష్టాలు రావడంతో బస్సులను ప్రైవేట్‌ సంస్థకు లీజులో ఇచ్చేందుకు నిర్ణయించారు. దీంతో బస్సుల నిర్వహణ ఖర్చులు, ఉద్యోగుల జీతాల భారం ప్రభుత్వంపై తగ్గుతుంది. ప్రైవేటీకరణకు ఒప్పందం జరిగితే నష్టాలు వచ్చే మార్గాల్లో నడుస్తున్న బస్సులకు సంబంధించి ప్రభుత్వం రాయితీ ఇస్తుంది. త్వరలో టెండర్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఓఎస్‌ ఆర్టీసీ వద్ద ప్రస్తుతం 636 బస్సులు ఉన్నాయి. వీటిలో 317 మార్గాల్లో 478 బస్సులు నడుస్తున్నాయి. 105 బస్సులు మరమ్మతులకు గురయ్యాయి. వీటిని బాగు చేయిస్తున్నారు. 53 బస్సులు నిరుపయోగంగా మారాయి. రాష్ట్రంలో ప్రైవేటు బస్సుల సంఖ్యతో పోల్చితే ఓఎస్‌ఆర్‌టీసీ బస్సులు కేవలం ఐదు శాతం మాత్రమే. ప్రస్తుతం సంస్థలో 1450 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వీరిలో 149 మంది రెగ్యులర్‌ ఉద్యోగులు ఉన్నారు. మిగిలినవారు కాంటాక్ట్‌ విధానంలో పనిచేస్తున్నారు. పలు పట్టణాలు, నగరాల్లో సంస్థకు 201 ప్రాంతాల్లో 273 ఎకరాల స్థలం ఉంది. ఈ స్థలాలను ప్రభుత్వం తీసుకొని ఆదాయం పెంచుకునేలా వ్యాపార దుకాణాలు, ఇతర నిర్మాణాలు చేయనుంది. ఇందుకోసం టెండర్లు పిలవనున్నారు.


మొదటి నుంచి నిర్లక్ష్యం

1974లో ఓఎస్‌ఆర్‌టీసీ ఏర్పాటైంది. సంస్థ ప్రారంభం నుంచి నష్టాల్లో కొనసాగుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రైవేటు బస్సుల యజమానులు రాష్ట్రంలో బస్సులు నడుపుతూ లాభాలు సాధిస్తుంటే రాష్ట్ర ఆర్టీసీ ఎందుకు నష్టాల్లో కొనసాగుతోందని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం నిర్ణయిస్తే 2021-22 ఆర్థిక సంవత్సరంలో 10 ఖరీదైన వాల్వో బస్సులను ఎందుకు కొనుగోలు చేసిందని అడుగుతున్నారు. నష్టాల నుంచి బయట పడి లాభాల బాట పట్టేందుకు చర్యలు తీసుకోవాలే తప్ప ప్రైవేటుకు అప్పగించడం తగదని సూచిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని