logo

భార్య హత్య కేసులో భర్తకు యావజ్జీవ కారాగారం

భార్యను గొడ్డలితో అతి కిరాతకంగా నరికి చంపిన చెవ్వెల్ల యాదగిరికి యావజ్జీవ కారాగారం శిక్ష విధిస్తూ వరంగల్‌ జిల్లా రెండో అదనపు జిల్లా న్యాయస్థాన న్యాయమూర్తి గురువారం తీర్పు చెప్పారు.

Published : 03 Feb 2023 06:28 IST

వరంగల్‌ న్యాయవిభాగం, న్యూస్‌టుడే: భార్యను గొడ్డలితో అతి కిరాతకంగా నరికి చంపిన చెవ్వెల్ల యాదగిరికి యావజ్జీవ కారాగారం శిక్ష విధిస్తూ వరంగల్‌ జిల్లా రెండో అదనపు జిల్లా న్యాయస్థాన న్యాయమూర్తి గురువారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ కథనం మేరకు.. వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట మండలం కట్య్రాల గ్రామానికి చెందిన యాదగిరి దాదాపు 28 ఏళ్ల క్రితం రాయపర్తి మండలం కొత్తూరు గ్రామానికి చెందిన మల్లికాంబ(మృతురాలు)ను వివాహం చేసుకున్నాడు. కొంత కాలం సజావుగా సాగిన వీరి మధ్య వ్యవసాయ భూమి అమ్మే విషయంలో మనస్పర్థలు మొదలయ్యాయి. భూమి అమ్మవద్దని వారించిన ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఆమెకు అక్రమ సంబంధాలు అంటగట్టడంతో వీరి మధ్య మరింత దూరం పెరిగింది. పోలీసు స్టేషన్లు, న్యాయస్థానాల చుట్టూ కొంత కాలం తిరిగారు. ఆ తరువాత ఆమె ను ఎలాగైనా చంపాలనుకున్న అతను ఇకనుంచి సజావుగా తన భార్యతో కలిసి ఉంటానని పెద్దలతో రాయభారం పంపి వారం పాటు మంచిగా నటించాడు. 2019 మే 23న తన పెద్ద కుమారుడ్ని పని సాకుతో హైదరాబాద్‌ పంపించాడు. చిన్న కుమారుడిని నిద్ర కోసం మిద్దె పైకి పంపించాడు. గాఢ నిద్రలో ఉన్న భార్యను గొడ్డలితో అతి కిరాతకంగా నరికి చంపాడు. అనంతరం అక్కడి నుంచి అతను పరారై మరుసటి రోజు పోలీసులకు లొంగిపోయాడు. ఈ విషయంపై మృతురాలి అన్న నారాయణ ఫిర్యాదు మేరకు వర్ధన్నపేట పోలీసులు కేసు నమోదు చేసుకోగా అప్పటి సీఐ, ప్రస్తుత మిల్స్‌కాలనీ సీఐ ముస్క శ్రీనివాస్‌ కేసును దర్యాప్తు చేశారు. కేసు విచారణలో నేరం రుజువు కావటంతో న్యాయస్థానం నేరస్థుడికి జీవిత ఖైదు తోపాటు రూ.రెండు వేల జరిమానా విధించింది. ఈ కేసును ప్రాసిక్యూషన్‌ తరఫున ప్రాసిక్యూషన్‌ డిప్యూటీ డైరెక్టర్‌ మోకిల సత్యనారాయణ వాదించగా కోర్టు కానిస్టేబుల్‌ సోమునాయక్‌ పలువురు సాక్షులను న్యాయస్థానంలో విచారణ సందర్భంగా హాజరుపర్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని