logo

‘సీబీఐ కేసు నుంచి దృష్టి మళ్లించేందుకు రాజధాని ప్రకటన’

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి విశాఖ రాజధానిని తెరపైకి తీసుకొచ్చారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి ఆరోపించారు.

Published : 03 Feb 2023 01:42 IST

మాట్లాడుతున్న తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి, పక్కన హరిప్రసాద్‌

అరవిందనగర్‌ (కడప), న్యూస్‌టుడే : మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి విశాఖ రాజధానిని తెరపైకి తీసుకొచ్చారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. గురువారం కడపలోని గాయత్రి టవర్స్‌లో తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సీబీఐ దూకుడు పెంచి ఎంపీ అవినాష్‌రెడ్డిని విచారణకు పిలిపించడంతో వైకాపా నేతల్లో వణుకుమొదలైందన్నారు. తప్పు చేసిన వారు తప్పించుకోలేరని, వారికి ఎప్పటికైనా శిక్ష తప్పదన్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, వైకాపా నాయకులు పార్టీని వీడుతున్నారన్నారు. ఈ విషయాన్ని డైవర్షన్‌ చేసేందుకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి విశాఖపట్నం రాజధానిగా కొత్త అంశాన్ని బయటకు తీసుకొచ్చారని ఆరోపించారు. రాజధాని విషయం సుప్రీంకోర్టులో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి కోర్టు ధిక్కారణగా మాట్లాడటం ఏమిటన్నారు. దేశంలోని పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలంతా రాష్ట్రానికి దూరంగా ఉన్న ప్రాంతాల్లో పెట్టుబడులు పెడుతున్నారన్న విషయాన్ని సీఎం గుర్తించలేదా అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అవుతున్నా ఒక్క పెద్ద పరిశ్రమనైనా తీసుకొచ్చారా అని ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని