logo

ఆయనో బెట్టింగ్‌ ప్రసాద్‌

ప్రొద్దుటూరును ఎమ్మెల్యే రాచమల్లు శిప్రసాద్‌రెడ్డి క్రికెట్‌ బెట్టింగ్‌, జూదం, మట్కా, గుట్కా, దొంగనోట్ల తయారీ, మార్పిడికి అడ్డాగా మార్చారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆరోపించారు.

Published : 02 Jun 2023 05:11 IST

ఎమ్మెల్యే రాచమల్లు అవినీతిపై లోకేశ్‌ విమర్శనాస్త్రాలు
జనంతో పోటెత్తిన ప్రొద్దుటూరు పుర వీధులు
 ఉత్సాహంగా సాగిన యువగళం పాదయాత్ర

బహిరంగ సభలో మాట్లాడుతున్న లోకేశ్‌

ఈనాడు డిజిటల్‌, కడప, న్యూస్‌టుడే, ప్రొద్దుటూరు వైద్యం: ప్రొద్దుటూరును ఎమ్మెల్యే రాచమల్లు శిప్రసాద్‌రెడ్డి క్రికెట్‌ బెట్టింగ్‌, జూదం, మట్కా, గుట్కా, దొంగనోట్ల తయారీ, మార్పిడికి అడ్డాగా మార్చారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆరోపించారు. ఎమ్మెల్యే పేరు బెట్టింగ్‌ ప్రసాద్‌గా మారుస్తున్నట్లు ఎద్దేవా చేశారు. తాను పాదయాత్రకు రాకముందే బెట్టింగ్‌ ప్రసాదుకు వణుకు పుట్టిందన్నారు. ప్రొద్దుటూరు లో గురువారం రాత్రి జరిగిన బహిరంగసభలో నారా  లోకేశ్‌ మాట్లాడుతూ గతంలో రవాణా అధికారి వేషంతో రహదారులపై డబ్బుల వసూళ్లకు పాల్పడిన రోజులు మార్చిపోయావా అంటూ ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సొంత కారుకు ఈఎంఐ కట్టలేక, అద్దె ఇంట్లో ఉన్న పరిస్థితి నుంచి ఇప్పుడు రూ.వేల కోట్ల అధిపతి ఎలా అయ్యావని నిలదీశారు. ఎమ్మెల్యే, ఆయన సోదరుడు కిరణ్‌కుమార్‌రెడ్డి, బావమరిది బంగారురెడ్డిలు ప్రొద్దుటూరును కేకులా కోసుకుని తింటున్నారని ఆరోపించారు. పట్టుమని రూ.వంద కోట్ల పనులు పూర్తి చేయలేని అసమర్థ ఎమ్మెల్యే అని లోకేశ్‌ విమర్శించారు. వైకాపా అధికారంలోకి రాగానే రెండు సెంట్ల ఇళ్ల స్థలాలిస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ప్రొద్దుటూరు మండలం చౌటపల్లిలో రూ.Ëకోట్లు విలువ చేసే చర్చి భూములను కొట్టేశారని ఆరోపించారు. బీసీˆలంటే ప్రసాదురెడ్డికి పడదన్న లోకేష్‌.. తెదేపా జిల్లా అధికార ప్రతినిధి నందం సుబ్బయ్యను హత్య చేయించారని ఆరోపించారు. బొందిలి కార్పొరేషన్‌ ఛైర్మన్‌ రజిని దొంగనోట్ల చలామణి కేసులో పట్టుబడ్డారని, దీని వెనుక ఎమ్మెల్యే ఉన్నారన్నారు. పేదల ఇళ్ల స్థలాల సేకరణలో భారీగా ప్రజాధనం లూఠీ చేశారన్నారు. తెదేపా అధికారంలోకి రాగానే దోచుకున్న డబ్బునంతా కక్కిస్తామన్నారు. గతంలో ఉన్న కూరగాయల మార్కెట్‌ను కూలదోసి తాత్కాలిక మార్కెటు పేరుతో ఒక్కో అరుగుకు రూ.లక్ష వసూలు చేసి రూ.కోట్లు దండుకున్నారన్నారు. ప్రొద్దుటూరులో ఏ వ్యాపారం చేసినా ఎమ్మెల్యేకు కప్పం కట్టాల్సిందేనని లోకేశ్‌ ఆరోపించారు. ఎమ్మెల్యే బావమరిది బంగారురెడ్డి అరాచక శక్తిగా మారారని, పురపాలక సంఘం పరిధిలో జరిగే అన్ని పనులకు సింగిల్‌ టెండరు వేయించి ప్రజాధనాన్ని దోచేస్తున్నారని ఆరోపించారు. రేషన్‌ బియ్యం అక్రమ రవాణా, కర్ణాటక నుంచి అక్రమ డీజిల్‌ దిగుమతి వ్యవహారమంతా ఎమ్మెల్యే ప్రసాద్‌ అనుచరులే చేస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే సోదరుడు కిరణ్‌కుమార్‌రెడ్డి భూదందాలు, బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రొద్దుటూరులో తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కరించాలని రూ.150 కోట్లతో తెదేపా హయాంలో మైలవరం జలాశయం నుంచి పైపులైను ఏర్పాటు చేసి పనులు ప్రారంభిస్తే ఎమ్మెల్యే అడ్డుకుని ఇప్పుడు తాను పూర్తి చేసినట్లుగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. మైనార్టీల సంక్షేమం కోసం ఇస్లామిక్‌ బ్యాంకు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. తెదేపా అధికారంలోకి రాగానే ప్రత్యేకాధికారిని నియమించి.. ప్రొద్దుటూరును ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. చేనేతలను తాను దత్తత తీసుకున్నానన్న లోకేశ్‌ క్లస్టర్లు, టెక్స్‌టైల్స్‌ కంపెనీలు తీసుకొస్తామని పునరుద్ఘాటించారు. అమ్మలాంటి కడపను సీఎం జగన్‌ మోసం చేశారని విమర్శించారు. కార్యక్రమంలో తెదేపా జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి, ప్రొద్దుటూరు నియోజకవర్గ బాధ్యుడు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, నేతలు పుట్టా సుధాకర్‌ యాదవ్‌, సీఎం సురేష్‌ నాయుడు, మెట్టుపల్లి ప్రభాకర్‌రెడ్డి, ముక్తియార్‌, గోవర్దన్‌రెడ్డి, మన్మోహన్‌రెడ్డి, హరిప్రసాద్‌, రితేష్‌రెడ్డి, పుత్తా చైతన్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

యువతతో సెల్ఫీ దిగుతూ...

బాబాయ్‌ని ఎవరు చంపారు? :  ప్లకార్డులతో తెదేపా నాయకులు


తెదేపా నేతల ఆనందపరవశం

లోకేశ్‌ పాదయాత్రకు జనం పోటెత్తడంతో తెదేపా నేతలు ఆనందపరవశులయ్యారు. నంద్యాల జిల్లా నుంచి జిల్లాలోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి జనం అనూహ్యంగా తరలివచ్చి లోకేశ్‌కు సంఘీభావం తెలుపుతున్నారు. ప్రత్యేకించి యువత, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. సీఎం జగన్‌ సొంత జిల్లాలో లోకేశ్‌ పాదయాత్రకు జనం అత్యధిక సంఖ్యలో తరలి రావడంపై నిఘా వర్గాలు సైతం ఆరా తీశాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని