పోలీస్‌ స్టేషన్లో ఆత్మలను తరిమేందుకు ...

ఆత్మలను వదిలించుకునేందుకు పోలీసు సిబ్బంది హోమాన్ని నిర్వహించిన సంఘటన ఉత్తర్‌ ప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

Published : 03 Sep 2020 02:43 IST

చేసిన హోమం తిప్పికొట్టింది!

కాన్పూర్‌: తమ పోలీస్‌ స్టేషన్‌ను ఆవరించి ఉన్న ఆత్మలను వదిలించుకునేందుకు, ఇతర సమస్యల నుంచి రక్షణగా పోలీసు సిబ్బంది హోమాన్ని నిర్వహించిన సంఘటన ఉత్తర్‌ ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి...
కాన్పూర్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబె ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తనను పట్టుకునేందుకు వచ్చిన పోలీసుల్లో ఎనిమిది మందిని దూబె, అతని అనుచరులు హతమార్చారు. దూబె, ఐదుగురు అనుచరులను పోలీసులు జులై 10న ఎన్‌కౌంటర్‌ చేశారు. మిగిలిన వారు స్వచ్ఛందంగా లొంగిపోవటమో, అరెస్టు కావటమో జరిగింది. దీనితో ఈ అంశానికి తెరపడిందని భావించారు.

వికాస్‌ దూబె చౌబేపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బిక్రూ గ్రామంలో నివసించేవాడు. ఎన్‌కౌంటర్‌ అనంతరం విధి నిర్వహణ సమయంలో ఏదో తెలియని ఇబ్బందిగా అనిపిస్తున్నట్టు కొందరు పోలీసు సిబ్బంది భావించారు. ఈ నేపథ్యంలో స్టేషన్‌కు పట్టిన దుష్ట శక్తులను పారదోలేందుకు పూజలు నిర్వహించాలని స్థానిక పూజారి ఒకరు సూచించారు. అతను చెప్పిన ప్రకారం వారు మంగళవారం స్టేషన్‌ పరిసరాల్లో ఓ హోమాన్ని నిర్వహించారు. ఈ తంతులో స్థానికులతో పాటు.. స్టేషన్‌ సిబ్బంది అందరూ పాల్గొన్నట్టు సమాచారం. మంత్రాలు చదివి, పూజ నిర్వహించిన ఆ వ్యక్తి స్టేషన్‌కు పట్టిన చెడు అంతా దూరమైందని నమ్మించాడు. అయితే ఈ విషయం ఉన్నతాధికారులకు తెలియటంతో, పోలీస్‌ స్టేషన్‌కు చెందిన అందర్నీ సస్పెండ్‌ చేయటం కొసమెరుపు!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని