మనుషుల కదలికల్లో ఎంతమార్పో

సెలవు దొరికితే ఏ సినిమాకో, షికారుకో వెళ్లడం సగటు భారతీయుడి అలవాటు. సాధారణ రోజుల్లో అయితే బస్టాండ్లకు పోటెత్తుతారు. రైల్వేస్టేషన్లు కిక్కిరిసిపోతాయి. పార్కులు.....

Updated : 03 Apr 2020 19:48 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సెలవు దొరికితే ఏ సినిమాకో, షికారుకో వెళ్లడం సగటు భారతీయుడి అలవాటు. సాధారణ రోజుల్లో అయితే బస్టాండ్లకు పోటెత్తుతారు. రైల్వేస్టేషన్లు కిక్కిరిసిపోతాయి. పార్కులు నిండిపోతాయి. లాక్‌డౌన్‌ పుణ్యమా ఇవన్నీ బంద్‌. నిత్యావసరాల దుకాణాలు, మెడికల్‌ షాపులు మినహా! దీంతో జనం ఇళ్లకే పరిమితమయ్యారు. దీనిపై ప్రముఖ సెర్చింజిన్‌ గూగుల్‌ ఆసక్తికర డేటా వెల్లడించింది. మొబైల్‌ లోకేషన్‌ డేటాను ఉపయోగించి దేశంలోని ప్రజల కదలికలకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. మొత్తం 131 దేశాలకు సంబంధించిన డేటాను కొవిడ్‌-19 కమ్యూనిటీ మొబిలిటీ రిపోర్ట్‌ పేరిట గూగుల్‌ విడుదల చేసింది.

ఫిబ్రవరి 16 నుంచి మార్చి 29 మధ్య కాలంలో దేశంలోని కేఫ్‌లు, షాపింగ్‌ కేంద్రాలు, థీమ్‌ పార్కులు, మ్యూజియంలు, లైబ్రరీలు, సినిమా థియేటర్లకు వెళ్లడం ఏకంగా 77 శాతం తగ్గినట్లు గూగుల్‌ పేర్కొంది. ఇక నిత్యావసర, ఫార్మసీ దుకాణాలకు వెళ్లడం సైతం 65 శాతం తగ్గింది. పార్కులు, ఇతర పర్యాటక ప్రదేశాలను సందర్శించడం 57 శాతం తగ్గిపోయింది. సబ్‌వేలు, బస్‌స్టాండ్లు, రైల్వే స్టేషన్లను సందర్శించడం 71 శాతం తగ్గిపోగా.. పని ప్రదేశాలకు వెళ్లడం దాదాపు 47శాతం తగ్గింది. సొంత ఊళ్లకు వెళ్లడం మాత్రం ఇదే సమయంలో 22 శాతం పెరగడం గమనార్హం.

కొవిడ్‌-19ను ఎదుర్కోవడానికి ఇలాంటి సమగ్ర డేటా సహాయ పడుతుందని ప్రజారోగ్య అధికారుల నుంచి తాము విన్నామని ఆ కంపెనీ తెలిపింది. అయితే, ఆయా ప్రాంతాలకు వెళ్లడం ఎంతమేర పెరిగిందీ తగ్గిందీ చెప్తాం తప్ప.. ఎవరు వెళ్లారు? అనే వ్యక్తిగత వివరాలు తెలియజేయడం లేదని గూగుల్‌ హెల్త్‌కు చెందిన చీఫ్‌ హెల్త్‌ ఆఫీసర్‌ కరెన్‌ డిసాల్వో తెలిపారు. వ్యాపార కార్యకలాపాల నిర్వహణ, డెలివరీ సేవలు వంటి విషయాల్లో సిఫార్సులకు, ప్రజల ప్రయాణాల్లో వచ్చిన మార్పులను తెలుసుకునేందుకు ఈ డేటా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని