ఇది ఏటీఎం కాదు.. పానీపూరీ మెషిన్‌

కరోనా వైరస్‌ దెబ్బతో పానీపూరీ ఇష్టపడే వారి నోటికి తాళం పడింది. లాక్‌డౌన్‌ కారణంగా కొన్ని నెలలుగా దాన్ని టేస్ట్‌ చేసే అవకాశమే

Updated : 05 Jul 2020 17:30 IST

భారత్‌లో నూతన ఆవిష్కరణ: వైరల్‌ వీడియో

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా వైరస్‌ దెబ్బతో పానీపూరీ ఇష్టపడే వారి నోటికి తాళం పడింది. లాక్‌డౌన్‌ కారణంగా కొన్ని నెలలుగా దాన్ని రుచి చూసే అవకాశమే లేకపోతోంది. మన దేశంలో ఎక్కడికెళ్లినా పానీపూరీ బండ్లకు మంచి డిమాండ్‌ ఉంటుంది. వాటిని తినడానికి కూడా  జనమెంతో ఇష్టపడతారు. లాక్‌డౌన్‌ కారణంగా మూడు నెలలుగా ఇళ్లకే పరిమితమైన ఆ చిరు వ్యాపారులు సడలింపులతో ఇప్పుడిప్పుడే మళ్లీ రోడ్ల మీదకు వస్తున్నారు. అయితే, ఇప్పుడు వాటిని తినడానికి మాత్రం ప్రజలెవరూ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఎందుకంటే కరోనా వైరస్‌ ప్రభావంతో ఎవరికి వారు తమ ఇంట్లోనే స్వయంగా వండుకొని తింటున్నారు.

ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పానీపూరీ ప్రియుల మనసు అర్థం చేసుకున్న ఓ వ్యక్తి వినూత్న ప్రయత్నం చేశాడు. అచ్చం ఏటీఎం మెషిన్‌ను తలపించేలా ఓ పానీపూరీ యంత్రాన్ని రూపొందించి ఔరా అనిపించాడు. ఇది నమ్మశక్యం కాకపోయినా ఓ పోలీస్‌ అధికారే దీన్నీ స్వయంగా వెల్లడించారు. ఎవరూ ముట్టుకోకుండా, డబ్బులు చెల్లించిన వారు మాత్రమే సంతోషంగా పానీపూరీ తినొచ్చు. ఏటీఎంను ఎలా ఉపయోగించుకుంటామో అలాగే దాన్ని వినియోగించుకోవాల్సి ఉంటుంది. అసోంకు చెందిన అదనపు డీజీపీ హర్దిసింగ్‌ ఈ వీడియోను ట్విటర్‌లో పోస్టు చేశారు. ఇది భారత్‌లో ఆవిష్కరించిన నూతన పరికరం అని, ఆటోమేటిక్‌గా పానీపూరీ అందిస్తుందని వెల్లడించారు.

ఈ మెషిన్‌ను రూపొందించడానికి ఆరు నెలల సమయం పట్టిందని దాని సృష్టికర్త వీడియోలో పేర్కొన్నాడు. అలాగే అదెలా పనిచేస్తుందో వివరించాడు. ఏటిఎం మెషిన్‌లానే దీన్ని ఆపరేట్‌ చేయాలని, అలాగే ఎవరికి ఇష్టమైన టేస్ట్‌ను వారు ఎంచుకునే వెసులుబాటు కూడా ఉందని ఆయన పేర్కొన్నారు. కస్టమర్లు డబ్బులు చెల్లించగానే ఒక్కొక్కటిగా పానీపూరీ బయటకు వస్తుందని, ఒకటి తిన్న తర్వాత మరొకటి బయటకు వస్తుందని చెప్పారు. డబ్బులు చెల్లించిన వారు తప్ప ఇతరులు వాటిని ముట్టుకోలేరని స్పష్టం చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఎలాంటి భయం లేకుండా పానీపూరీలు తినొచ్చని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు ఎక్స్‌ట్రా పానీపూరీ  తినే అవకాశం లేదంటూ జోక్‌లేస్తున్నారు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని