TSPSC: గ్రూప్‌-2 వాయిదా వేయాల్సిందే.. టీఎస్‌పీఎస్సీ వద్ద అభ్యర్థుల నిరసన

గ్రూప్‌-2 పరీక్షలను (Group 2 Exams) వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) కార్యాలయం ముట్టడికి అభ్యర్థులు యత్నించారు.

Updated : 10 Aug 2023 14:29 IST

హైదరాబాద్‌: గ్రూప్‌-2 పరీక్షలను (Group 2 Exams) వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) కార్యాలయం ముట్టడికి అభ్యర్థులు యత్నించారు. నాంపల్లిలోని తెజస కార్యాలయం నుంచి సుమారు 2 వేల మంది అభ్యర్థులు పెద్దఎత్తున ర్యాలీగా బయలుదేరి వచ్చారు. అభ్యర్థుల నినాదాలతో టీఎస్‌పీఎస్సీ కార్యాలయ పరిసర ప్రాంతాలు మార్మోగాయి. తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు కోదండరామ్‌, కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్.. గ్రూప్‌-2 అభ్యర్థుల నిరసనకు మద్దతు తెలిపారు. ర్యాలీగా వస్తున్న అభ్యర్థుల్లో కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అభ్యర్థుల నిరసన నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ కార్యాలయ పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు. కమిషన్ కార్యాలయం సమీపంలో అభ్యర్థులు బైఠాయించి ధర్నా చేపట్టారు. పరీక్షలను వాయిదా వేయాలని బోర్డు కార్యదర్శి అనితా రామచంద్రన్‌కు కాంగ్రెస్ నేతలు అద్దంకి దయాకర్, డాక్టర్ రియాజ్ తదితరులతో కలిసి అభ్యర్థులు వినతి పత్రం అందజేశారు.

నెలలో రెండు పరీక్షలు..!

గ్రూప్ -2 పరీక్షకు ఆగస్టు 29, 30 తేదీలను ఖరారు చేశారని.. కానీ ఆగస్టు 1 నుంచి 23 వరకు గురుకుల బోర్డుకు సంబంధించిన పరీక్ష తేదీలు ఉన్నాయని అభ్యర్థులు తెలిపారు. ఒకే నెలలో గ్రూప్ - 2, గురుకుల పరీక్షల నిర్వహణ, సిలబస్‌లూ వేర్వేరుగా ఉండటంతో.. ఏదో ఒక పరీక్షకు మాత్రమే సన్నద్ధం కావాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కారణంతో తమకు అర్హతలు ఉన్నప్పటికీ అవకాశాన్ని కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

అంతేకాకుండా గ్రూప్ - 2 పరీక్షలోని మూడో పేపర్ (ఎకానమీ)లో గతంలోని సిలబస్‌కు అదనంగా 70 శాతం కలిపారని పేర్కొన్నారు. పేపర్ లీకేజీ ఘటనతో మూడు నెలలు మానసిక ఆవేదనతో సరిగా చదవలేకపోయామన్నారు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని గ్రూప్ - 2 పరీక్షను మూడు నెలలు వాయిదా వేయాలని కోరారు. మానవతా దృక్పథంతో తమ సమస్యను అర్థం చేసుకుని.. వెసులుబాటు కల్పించాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.

అభ్యర్థులకు తగిన సమయం ఇవ్వాలి: కోదండరాం

గ్రూప్‌ 2 పరీక్షలను వాయిదా వేయాలని తెజస అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్‌ కోరారు. అభ్యర్థులతో కలిసి నిరసనల్లో పాల్గొన్న ఆయన.. ప్రస్తుతం జేఎల్‌, గ్రూప్‌ 2 పరీక్షలు వరుసగా ఉన్నాయన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని పరీక్షలకు చదువుకునేందుకు అభ్యర్థులకు తగిన సమయం ఇవ్వాలని కోరారు. ఏడేళ్లు ఆగిన ప్రభుత్వం.. పరీక్షకు మరో మూడు నెలలు ఆగలేదా?అని ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ ప్రశ్నించారు. తూతూమంత్రంగా పరీక్షలు నిర్వహిస్తున్నారని.. అభ్యర్థుల ఆవేదనను ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆరోపించారు. అరెస్టు చేసిన అభ్యర్థులను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

హైకోర్టును ఆశ్రయించిన గ్రూప్‌-2 అభ్యర్థులు

మరోవైపు గ్రూప్‌-2 పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈనెల 29, 30న నిర్వహించ తలపెట్టిన పరీక్షను వాయిదా వేయాలంటూ 150 మంది అభ్యర్థులు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. గురుకుల, ఇతర నియామక పరీక్షలు ఉన్నందున గ్రూప్‌-2ను రీషెడ్యూల్‌ చేయాలని పిటిషన్‌లో కోరారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని