TS News: కరోనాతో మావోయిస్టు అగ్రనేత మృతి

మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి యాప నారాయణ అలియాస్‌ హరిభూషణ్‌ అలియాస్‌ హెచ్‌బీ అలియాస్‌ లక్మాదాదా కరోనాతో మృతి చెందాడు.

Updated : 13 Sep 2023 15:58 IST

కొత్తగూడెం: మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి యాప నారాయణ అలియాస్‌ హరిభూషణ్‌ అలియాస్‌ హెచ్‌బీ అలియాస్‌ లక్మాదాదా కరోనాతో మృతి చెందాడు. ఈ విషయాన్ని కొత్తగూడెం జిల్లా ఎస్పీ దత్‌ ధ్రువీకరించారు. అతడి ఆరోగ్య పరిస్థితిపై మంగళవారం సామాజిక మాధ్యమాల్లో పలు వార్తలు వచ్చాయి. దీంతో కొత్తగూడెం జిల్లా పోలీసులు అతడి గురించి సమాచారం సేకరించారు. హరిభూషణ్‌ ఈ నెల 21న కరోనాతో మృతి చెందాడని భద్రాద్రి ఎస్పీ తెలిపారు. కరోనాతోపాటు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడని వివరించారు. మరికొందరు మావోయిస్టులు కూడా కరోనా బారిన పడ్డారని.. పోలీసులను ఆశ్రయిస్తే మెరుగైన వైద్యం అందిస్తామని తెలిపారు.

మడగూడ నుంచి కేంద్ర కమిటీకి..

మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండలం మడగూడకు చెందిన యాప నారాయణ పదో తరగతి వరకు చదువుకొని విప్లవ కార్యకలాపాల వైపు ఆకర్షితుడయ్యారు. గుత్తికోయ సామాజిక వర్గానికి చెందిన నారాయణ దండకారణ్యానికి బదిలీ అయ్యాక అంచెలంచెలుగా ఎదిగారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా నియమితులై కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాదరావు అలియాస్‌ చంద్రన్న మార్గదర్శకత్వంలో బాధ్యతలు నిర్వర్తించారు. కాగా.. కొంతకాలం క్రితం హరిభూషణ్‌ను మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలోకి తీసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని