తాగొచ్చిన పెళ్లికొడుకు..అమ్మాయి ఏంచేసిందంటే?

కాబోయే భర్త తాగొచ్చి నానా రచ్చ చేసినందుకు ఓ యువతి అతడితో తన పెళ్లిని రద్దు చేసుకుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ జిల్లా టిక్రీ అనే గ్రామంలో ఈ ఘటన జరిగింది....

Published : 07 Jun 2021 16:44 IST

ప్రయాగ్‌రాజ్‌: కాబోయే భర్త తాగొచ్చి నానా రచ్చ చేసినందుకు ఓ యువతి అతడితో తన పెళ్లిని రద్దు చేసుకుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ జిల్లా టిక్రీ అనే గ్రామంలో ఈ ఘటన జరిగింది. రవీంద్రపటేల్‌ అనే అబ్బాయికి, టిక్రీలో ఓ సాధారణ రైతు కూతురికి వివాహం కుదిరింది. మరికొన్ని గంటల్లో వివాహం జరగాల్సి ఉండగా.. పెళ్లికొడుకు తన స్నేహితులతో కలిసి ఫుల్లుగా తాగేసి వచ్చాడు. అంతటితో ఆగకుండా తనతో డ్యాన్స్‌ చేయాలని అమ్మాయిని బలవంతపెట్టాడు.  అందుకు ఆమె నిరాకరించింది.

దీంతో అమ్మాయి మమ్మల్ని అవమానిస్తోందంటూ పెళ్లికొడుకు రాద్దాంతం చేయడం ప్రారంభించాడు. దీనికి ఆయన కుటుంబ సభ్యులు కూడా తోడవ్వడంతో వివాదం కాస్తా పెద్దదయ్యింది. అబ్బాయి ప్రవర్తనతో విసుగెత్తిన అమ్మాయి పెళ్లిని రద్దు చేసుకుంటున్నట్లు తెలిపింది. అలాగే వివాహం నిశ్చయమైన సమయంలో ఇచ్చిన బహుమతులను తిరిగివ్వాలని పెళ్లికొడుకు కుటుంబ సభ్యులను యువతి కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేశారు. అందుకు వారు నిరాకరించడంలో పెళ్లికొడుకు కుటుంబసభ్యులందరినీ కాసేపు ఇంట్లోనే బంధించారు.

ఈ విషయం పోలీసుల వరకు చేరింది. వారు అమ్మాయికి నచ్చజెప్పడానికి ప్రయత్నించినప్పటికీ.. ఆమె ససేమిరా అంది. దీంతో చేసేది లేక అబ్బాయి కుటుంబ సభ్యులు తీసుకున్న బహుమతులను తిరిగి ఇచ్చేయడానికి అంగీకరించారు. దీంతో గొడవ సద్దుమణిగింది. వివాహం మాత్రం జరగలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని