Top Ten News @ 9 AM

ఈనాడు.నెట్‌లోని ముఖ్యమైన పది వార్తలు మీకోసం..

Updated : 18 May 2021 08:59 IST

1. KCR: ఆరు జిల్లాల్లో వైద్య కళాశాలలు

తెలంగాణలో కొత్తగా ఆరు ప్రభుత్వ వైద్యకళాశాలలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పారు.సంగారెడ్డి, జగిత్యాల, కొత్తగూడెం, వనపర్తి, మంచిర్యాల, మహబూబాబాద్‌లలో వీటిని అందుబాటులోకి తెస్తామన్నారు. వీటికి అనుబంధంగా నర్సింగ్‌ కళాశాలలనూ నెలకొల్పుతామన్నారు. ఇప్పటికే ఉన్న వైద్య కళాశాలల్లో నర్సింగ్‌ కళాశాలలు లేకపోతే మంజూరు చేస్తామన్నారు. అనుమతులు పొందిన నర్సింగ్‌ కళాశాలలకు సంబంధించిన ప్రతిపాదనలను ఆమోదిస్తామన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

* పడకల లభ్యతపై హెల్ప్‌లైన్‌

2. జైలు నుంచి సికింద్రాబాద్‌కు ఎంపీ

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సోమవారం సాయంత్రం సికింద్రాబాద్‌లోని సైనిక ఆసుపత్రికి తరలించారు. గుంటూరు జిల్లా జైలులో జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న ఎంపీని పోలీసు భద్రత నడుమ ఆయన సొంత వాహనంలోనే విజయవాడ మీదుగా రోడ్డు మార్గంలో తీసుకెళ్లారు. ఈ క్రమంలో పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. Cyclone Tauktae: అలకల్లోలం

దేశ పశ్చిమ తీరంపై విరుచుకుపడిన ‘తౌక్టే’ అతి తీవ్ర తుపాను.. బీభత్సం సృష్టించింది. మహారాష్ట్ర, గుజరాత్‌లతో పాటు గోవా తీర ప్రాంతాలపై పెను ప్రభావం చూపించింది. సోమవారం రాత్రి పొద్దుపోయాక ఇది గుజరాత్‌ వద్ద తీరాన్ని తాకిందని అధికారులు ప్రకటించారు. దీని ధాటికి అరేబియా సముద్రంలో రెండు నౌకలు (బార్జిలు) తమతమ లంగర్లను తెంచుకుని కొట్టుకుపోయాయి. తక్షణ సహాయక చర్యల ద్వారా వాటిలో ఉన్న 410 మందిని రక్షించగలిగారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. మనసు కకావికలం

కొవిడ్‌ ప్రభావంతో మానసిక రుగ్మతలు తీవ్రమవుతున్నాయి. తమకు కొవిడ్‌ సోకుతుందేమో.. ఆరోగ్యం దెబ్బతింటుందేమోననే భయాందోళనలు వెన్నాడుతున్నాయి. అయినవారు కళ్ల ముందే కన్నుమూస్తుంటే కనీస సాయం చేయలేకపోతున్నామని, కడసారి చూపు కూడా అందకుండా పోతోందనే క్షోభతో నలిగిపోతున్నారు.  ఒకవేళ కరోనా సోకితే ఆసుపత్రులకయ్యే రూ.లక్షల ఖర్చు ఎలా చెల్లించాలనే బెంగతోనూ సతమతమవుతున్నారు. అతి శుభ్రత, అతి జాగ్రత్తలూ కొత్త చికాకులు తెచ్చిపెడుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

* పిల్లల మెడకు ‘కరోనా’ ఉచ్చు

5. గాలి ద్వారా కరోనా! నిజమే!

‘‘అయ్యా! గాలి ద్వారా కరోనా వ్యాపిస్తోంది’’ అని పరిశోధకులు ఏడాదిగా మొత్తుకుంటున్న విషయాన్ని... ప్రపంచ వ్యాప్తంగా వైద్య నిపుణులు, ఆరోగ్య అధికారులు ఇప్పుడు ధ్రువీకరిస్తున్నారు. ముఖ్యంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ, అమెరికా సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ కూడా దీన్ని అంగీకరించింది. గాలిలో వైరస్‌ తిరిగితే... మహమ్మారి బారి నుంచి ప్రజలను ఎలా రక్షించాలన్నది ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. Covid: జాబితా నుంచి ప్లాస్మా థెరపీ తొలగింపు

కొవిడ్‌ రోగులకు అందించే చికిత్సల జాబితా నుంచి ప్లాస్మా థెరపీని తొలగిస్తూ ఐసీఎంఆర్‌ సోమవారం రాత్రి కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. దానివల్ల ఎలాంటి ఫలితం లేదని వివిధ అధ్యయనాల్లో తేలడంతో ఈ నిర్ణయం తీసుకొంది. కొత్త మార్గదర్శకాల ప్రకారం రెమ్‌డెసివిర్‌, టొసిలిజుమ్యాబ్‌లను మాత్రమే ఉపయోగించడానికి అనుమతి ఇచ్చింది. ఎయిమ్స్‌/ఐసీఎంఆర్‌ కొవిడ్‌-19 నేషనల్‌ టాస్క్‌ఫోర్స్‌, జాయింట్‌ మానిటరింగ్‌ గ్రూప్‌లో తీసుకున్న నిర్ణయంలో భాగంగా సవరించిన మార్గదర్శకాలను సోమవారం విడుదల చేసింది.

7. ప్రముఖ శాస్త్రవేత్త షాహిద్‌ జమీల్‌ రాజీనామా

దేశంలో ఎక్కడ చూసినా కరోనా కల్లోలమే. ఈ సమయంలో కేంద్రానికి మార్గనిర్దేశం చేయాల్సిన ప్రముఖ వైరాలజిస్టు షాహిద్‌ జమీల్‌... జినోమ్‌ కన్సార్షియం (ఇన్సాకోగ్‌) అధిపతి పదవికి రాజీనామా చేయడం సంచలనంగా మారింది. సార్స్‌ కోవ్‌-2 జన్యు మార్పులను ఎప్పటికప్పుడు ఇన్సాకోగ్‌ పర్యవేక్షిస్తోంది. మార్పులకు అనుగుణంగా ప్రభుత్వానికి సలహాలు ఇస్తుంది. ఇలాంటి కీలక పదవికి జమీల్‌   రాజీనామా చేయడం చర్చనీయాంశమవుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. మిత్రుడు దూతగా.. ప్రాణవాయువు ప్రదాతగా

సినీ నటుడు సోనూసూద్‌ మరోమారు గొప్ప మనసు చాటుకున్నారు. నెల్లూరు జిల్లాలో రూ.1.5 కోట్లతో ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు హామీ ఇచ్చారు. నెల్లూరులోని జెండా వీధిలో ఉంటున్న సోనూసూద్‌ మిత్రుడు సమీర్‌ఖాన్‌.. కుటుంబ సభ్యులకు ఇటీవల కరోనా మహమ్మారి సోకింది. ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ పడకలు దొరక్క వారు మృత్యువాతపడ్డారు. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఏర్పాటుచేయాలని సోనూసూద్‌ను సమీర్‌ఖాన్‌ కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. Black Fungus: ఇన్‌ఫెక్షన్‌ భయం

కొవిడ్‌-19 కన్నా దాని పర్యవసానాలే ఎక్కువగా భయపెడుతున్నాయి. కొత్తగా మ్యుకార్‌మైకోసిస్‌ అనే ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ సైతం వణికిస్తోంది. ముక్కు, నోట్లో తలెత్తే ఇది అక్కడికే పరిమితం కావటం లేదు. కళ్లకు, మెదడుకూ విస్తరిస్తూ తీవ్ర ప్రమాదంలోకి నెడుతోంది. ఒకప్పుడు మధుమేహుల్లోనే.. అదీ ఎప్పుడో అప్పుడు కనిపించే ఇదిప్పుడు ఉన్నట్టుండి ఎందుకు విజృంభిస్తోంది? పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి 

10. Gaza: హమాస్‌ నేతలు, సొరంగాలే లక్ష్యంగా

గాజాపై సోమవారం కూడా ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు కొనసాగాయి. హమాస్‌ నాయకులు, వారి స్థావరాలపై 54 ఇజ్రాయెల్‌ విమానాలు విరుచుకుపడ్డాయి. 15 కిలోమీటర్ల మేర సొరంగాలను ధ్వంసం చేశాయి. వీటి ద్వారానే హమాస్‌ తన బలగాలను, పరికరాలను ఒక చోటు నుంచి ఇంకో చోటుకు తరలిస్తోంది. హమాస్‌కు చెందిన 9 మంది కమాండర్ల ఇళ్లను కూడా విమానాలు నేలమట్టం చేశాయి. తాజా దాడుల్లో రాకెట్‌ దాడులకు కారణమైన కీలక హమాస్‌ నేతను హతమార్చినట్లు ఇజ్రాయెల్‌ ప్రకటించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని