Top Ten News @ 9 AM

ఈనాడు.నెట్‌లోని ముఖ్యమైన పది వార్తలు మీకోసం..

Published : 19 May 2021 08:53 IST

1.TS Lockdown: 30 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు

తెలంగాణలో కరోనా నియంత్రణకు ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ను ఈ నెల 30 వరకు పొడిగిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. ఆయన మంత్రులందరితో మంగళవారం ఫోన్లో మాట్లాడారు. వారి అభిప్రాయాలను తీసుకొన్న అనంతరం తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ను ఆదేశించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* తెలంగాణలో ఆయుష్మాన్‌ భారత్‌ అమలు

* మూడున్నర లక్షల మందిలో కొవిడ్‌ లక్షణాలు 

2. AP Budget: పిల్లల కోసం ప్రత్యేక బడ్జెట్‌

ఏపీ ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ నుంచి పిల్లల కోసం కేటాయింపులను ప్రత్యేకంగా ఒక నివేదిక రూపంలో సమర్పించనుంది. ఈ మేరకు గతంలోనే నిర్ణయం తీసుకుని అన్ని శాఖల  నుంచి ఇదే తరహాలో ప్రతిపాదనలను స్వీకరించింది. 18ఏళ్లలోపు పిల్లలపై వివిధ పథకాల ద్వారా రాష్ట్రం ఎంత వెచ్చిస్తుందో విడిగా లెక్కలు కట్టి తాజా బడ్జెట్‌లో ప్రత్యేకంగా నివేదించనుంది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి గురువారం 2021-22 బడ్జెట్‌ను శాసనసభకు సమర్పించనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. Raghurama: సుప్రీంకు వైద్య పరీక్షల నివేదిక

నరసాపురం వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజుకు అయిన గాయాలపై సికింద్రాబాద్‌లోని సైనిక ఆసుపత్రిలో నిర్వహించిన వైద్యపరీక్షల నివేదికను తెలంగాణ హైకోర్టు సీల్డ్‌కవర్‌లో సుప్రీంకోర్టుకు పంపింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయనకు మంగళవారం ముగ్గురు వైద్యుల బృందం పరీక్షలు నిర్వహించింది. వైద్య పరీక్షలను అధికారులు వీడియో తీయించి సీల్డ్‌ కవర్‌లో భద్రపరిచారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. కరోనా భయం.. ఫోన్‌ చేస్తే అభయం

కుటుంబాలకు కుటుంబాలు కరోనా మహమ్మారి బారిన పడి మృత్యువాత పడుతుండగా మరి కొన్ని మనోవేదనకు గురవుతున్నాయి. ఆరోగ్య పరంగానే కాకుండా ఉద్యోగాలు కోల్పోవడం, ఆర్థికంగా ఇబ్బందులు, విద్యాసంస్థలు మూతపడి పిల్లల్లో మానసిక సమస్యలు తలెత్తడం చోటుచేసుకుంటున్నాయి. ఈ తరుణంలోనే ప్రజల మదిలో మెదిలే భయాలు, సందేహాలను నివృత్తి చేయడానికి ఆరు ప్రముఖ సంస్థలు ఉమ్మడిగా కృషి చేస్తున్నాయి. సోషల్‌ అండ్‌ ఎమోషనల్‌ రిహాబిలిటేషన్‌ ఆఫ్‌ వైరస్‌ విక్టిమ్స్‌ అండ్‌ మెడికల్‌ సర్వీసెస్‌(సెర్వ్‌-మి) పేరుతో టెలీ కౌన్సెలింగ్‌, టెలీ మెడిసిన్‌ సేవలు అందిస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. ఇప్పటివరకూ సోకింది 2% మందికే

ప్రస్తుత పోకడను బట్టి... దేశంలో మహమ్మారి క్రమంగా క్షీణిస్తున్నట్టు అర్థమవుతోందని కేంద్ర ప్రభుత్వం మంగళవారం తెలిపింది. ఈ నెల 17 నాటికి దేశ జనాభాలో 1.8% మందికే వైరస్‌ సోకిందని, ఇంకా 98% మందికి ఈ ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. నీతి ఆయోగ్‌ (ఆరోగ్య విభాగం) సభ్యుడు వీకే పాల్‌ మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. చాలా రాష్ట్రాల్లో కరోనా ఉద్ధృతి రేఖ నిలకడగా ఉందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. Cyclone Tauktae: తీరం దాటింది.. వెతలు మిగిల్చింది

అరేబియా సముద్రంలో బీభత్సం సృష్టించిన ‘తౌక్టే’ అతి తీవ్ర తుపాను సోమవారం అర్ధరాత్రి గుజరాత్‌- దీవ్‌ మధ్య తీరాన్ని దాటినా రెండు రాష్ట్రాల్లో అనేక వెతలు మిగిల్చింది. గుజరాత్‌లో 13 మంది మృత్యువాత పడ్డారు. సముద్రం అల్లకల్లోలంగా మారడంతో చమురు క్షేత్రాల్లో, చమురు వెలికితీత నౌకల్లో పనిచేసే వందల మంది సిబ్బంది ప్రమాదంలో చిక్కుకున్నారు. వారికి ప్రాణాపాయం లేకుండా చూడడానికి నౌకాదళం, భారత తీర గస్తీ దళం రంగంలో దిగాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. వ్యాక్సినేషన్‌ వేగవంతం చేయకపోతే మూడో ముప్పు!

కరోనాను కట్టడి చేయడంలో వ్యాక్సినే శక్తిమంతమైన ఆయుధం. వైరస్‌ ఎప్పటికప్పుడు కొత్త రూపం తీసుకుంటోంది. దీని గురించి తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు జన్యుక్రమ విశ్లేషణ కొనసాగాలి. రెండోవేవ్‌ మనల్ని ఇంతగా నష్టపరచడానికి కారణం వైరస్‌ జన్యుక్రమాన్ని అధ్యయనం చేయడంలో చోటుచేసుకున్న నిర్లక్ష్యమే. మళ్లీ అలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్తపడాలి, వ్యాక్సినేషన్‌ వేగవంతం చేయాలి అంటున్నారు ప్రముఖ వైరాలజిస్టు డాక్టర్‌ జాకబ్‌జాన్‌. ఆయన పూర్తి ఇంటర్వ్యూ కోసం క్లిక్‌ చేయండి 

* కరోనాను జయించిన 9 నెలల తర్వాతే టీకా!

8. కరోనానా? కిడ్నీలూజాగ్రత్త

కరోనా వైరస్‌ శరీరంలో కీలక అవయవాలకు పాకుతోంది. వాటి పనితీరును దెబ్బతీస్తోంది. అప్పటిదాకా గుర్తించని ఆరోగ్య సమస్యలెన్నో కరోనా సోకిన తర్వాత బయట పడుతున్నాయి. తొలి దశ ఉద్ధృతిలో కన్పించని లక్షణాలు ఈ రెండో దశలో వెలుగుచూస్తున్నాయి. మొదట్లో ఊపిరితిత్తులపైనే ఎక్కువ ప్రభావం చూపిన వైరస్‌.. క్రమంగా కిడ్నీల వంటి కీలక అవయవాల్లోనూ సమస్యలు సృష్టిస్తున్నట్లు ఇటీవలి కేసులను బట్టి అవగతమవుతోంది. కొవిడ్‌ చికిత్సలో వాడే మందుల మోతాదు కూడా కొన్నిసార్లు ఈ దుష్పరిణామాలకు దారి తీస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. కరోనాతో ప్రజలపై రూ.66,000 కోట్ల భారం

కరోనా ఫలితంగా ధరల పెరుగుదల, ఆసుపత్రులు, వైద్య ఖర్చుల కారణంగా ఈ ఏడాది ప్రజలపై రూ.66వేల కోట్ల మేర అదనపు భారం పడనున్నట్లు ఎస్‌బీఐ ఆర్థిక పరిశోధనా విభాగం అంచనా వేసింది. ద్రవ్యోల్బణం పెరుగుదల కారణంగా ధరలపై  ప్రభావం చూపి రూ.15వేల కోట్లు, ఆసుపత్రులకోసం రూ.35వేల కోట్లు, ఆదాయం తగ్గిపోవడం వల్ల రూ.16వేల కోట్ల భారాన్ని ప్రజలు భరించాల్సి వస్తున్నట్లు తెలిపింది. 2020 ఆర్థిక సంవత్సరంలో వైద్యఖర్చు రూ.6లక్షల కోట్లతో పోలిస్తే ఇది 11% అదనం అని అభిప్రాయపడింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. Ab de villiers: ఆట అయిపోయింది

అంతర్జాతీయ క్రికెట్లోకి ఏబీ డివిలియర్స్‌ పునరాగమనం చేస్తాడని ఎంతో ఆశతో ఉన్నారు అతడి అభిమానులు. కానీ క్రికెట్‌ దక్షిణాఫ్రికా (సీఎస్‌ఏ) తాజా ప్రకటనతో ఈ ఆశలకు తెరపడిపోయింది. డివిలియర్స్‌ తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోడని సీఎస్‌ఏ తేల్చేసింది. ఏబీతో తమ చర్చలు ముగిశాయని.. తాను ఇంతకుముందు తీసుకున్న రిటైర్మెంట్‌ నిర్ణయమే అంతిమం అని అతను తేల్చేశాడని సీఎస్‌ఏ వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

* ఇంగ్లాండ్‌ పర్యటనకు సాహా సిద్ధం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని