OMC Case: ఓబులాపురం మైనింగ్‌ కేసు.. ఐఏఎస్‌ శ్రీలక్ష్మికి ఊరట

ఓబులాపురం మైనింగ్‌ కేసు (ఓఎంసీ)లో ఏపీకి చెందిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మికి ఊరట లభించింది. ఈ కేసులో ఆమెపై నమోదైన అభియోగాలను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. 

Updated : 08 Nov 2022 13:13 IST

ఆమెపై అభియోగాలను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు

హైదరాబాద్‌: ఓబులాపురం మైనింగ్‌ కేసు (ఓఎంసీ)లో ఏపీకి చెందిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మికి ఊరట లభించింది. ఈ కేసులో ఆమెపై నమోదైన అభియోగాలను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. 

గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు శ్రీలక్ష్మి పరిశ్రమలశాఖ కార్యదర్శిగా పనిచేశారు. ఆ సమయంలో ఓబులాపురం మైనింగ్‌ కంపెనీ (ఓఎంసీ)కి అనంతపురం జిల్లాలో గనుల కేటాయింపు జరిగింది. దీనికి సంబంధించిన జీవో, నోటిఫికేషన్‌ అమలు విషయంలో శ్రీలక్ష్మి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సీబీఐ ఆరోపించింది. ఈ పరిస్థితుల్లో శ్రీలక్ష్మిపై చర్యలు తీసుకోవాలంటూ కోర్టులో సీబీఐ పదేళ్ల క్రితమే ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. కుట్రపూరితంగా వ్యవహరిస్తూ గాలి జనార్దన్‌రెడ్డికి అనుకూలంగా పనిచేశారని.. దీని వల్ల అక్రమ మైనింగ్‌తో రూ.కోట్లలో నష్టం జరిగిందని అందులో పేర్కొంది. ఈ కేసుపై అప్పటి నుంచి సుదీర్ఘకాలంగా సీబీఐ కోర్టులో విచారణ జరుగుతోంది. 

ఈ నేపథ్యంలో గతంలో శ్రీలక్ష్మి డిశ్చార్జ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. సీబీఐ అనవసరంగా ఇరికించిందని.. తనపై నమోదైన అభియోగాలను కొట్టేయాలని కోరారు. డిశ్చార్జ్‌ పిటిషన్‌పై అక్టోబర్‌ 17న సీబీఐ కోర్టు తీర్పు వెల్లడిస్తూ శ్రీలక్ష్మిపై నమోదైన అభియోగాలను కొట్టివేసేందుకు నిరాకరించింది.  దీంతో సీబీఐ కోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ ఆమె తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తాను పరిశ్రమల శాఖ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టకముందే ఓఎంసీ లీజుపై నోటిఫికేషన్‌ విడుదలైందని పేర్కొన్నారు.

జీవోలో క్యాప్టివ్‌ మైనింగ్‌ అని పేర్కొనడం ఉద్దేశపూర్వకమైన కుట్ర అనడం నిరాధారమని శ్రీలక్ష్మి తరఫు న్యాయవాది వాదించారు. ప్రధానంగా సీబీఐ పేర్కొన్న కుట్ర, మోసం, అవినీతిపై ఎలాంటి ఆధారాలు లేవంటూ వాదనలు వినిపించారు. అయితే సీబీఐ తరఫు న్యాయవాది స్పందిస్తూ దీనిపై అన్ని ఆధారాలు ఉన్నాయని.. రానున్న విచారణలో కోర్టు ముందు వాటిని ఉంచుతామని తెలిపారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు.. ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మిపై నమోదైన అభియోగాలను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని