AP Cabinet: కొత్తగా 4వేల ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో టికెట్ల విక్రయాలు.. ఏపీ కేబినెట్‌ నిర్ణయాలివే!

సీఎం జగన్‌ అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. సమావేశం అనంతరం రాష్ట్ర మంత్రివర్గం

Updated : 28 Oct 2021 15:56 IST

అమరావతి: సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. సమావేశం అనంతరం రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను మంత్రి పేర్ని నాని మీడియాకు వెల్లడించారు. ఆన్‌లైన్‌లో టికెట్ల విక్రయాలకు వీలుగా సినిమాటోగ్రఫీ చట్ట సవరణ ఆర్డినెన్స్‌కు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసినట్లు పేర్ని నాని తెలిపారు. దేవాదాయశాఖ స్థలాలు, దుకాణాల లీజు అంశంపై చట్ట సవరణ, దేవాదాయ శాఖలో విజిలెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ వింగ్‌ ఏర్పాటు, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ‘అమ్మఒడి’ పథకం అమలుపై కేబినెట్‌లో చర్చ జరిగినట్లు చెప్పారు. అమ్మఒడి పథకానికి 75 శాతం హాజరు ఉండాలన్న అంశంపై విస్తృతంగా ప్రచారం చేసే అంశానికి కేబినెట్‌ ఆమోదం తెలిపిందన్నారు. 2021 నవంబరు 8 నుంచి 2022 ఏప్రిల్‌ 30 వరకు హాజరును పరిగణనలోకి తీసుకుంటామని.. మొత్తం 130 రోజుల్లో 75 శాతం హాజరు ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. గత ఏడాది కొవిడ్ కారణంగా హాజరుకు మినహాయింపు ఇచ్చినట్లు వివరించారు.

‘‘విశాఖ మధురవాడలో అదానీ సంస్థకు 130 ఎకరాలు, శారదా పీఠానికి 15 ఎకరాలు ఇచ్చేందుకు ఆమోదం లభించింది. 200 మెగా డేటా సెంటర్‌, బిజినెస్‌ పార్కు కోసం 130 ఎకరాలను కేటాయించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ప్రకాశం జిల్లా వాడరేపు సహా 5 ఫిషింగ్‌ హర్బర్ల డీపీఆర్‌లకు ఆమోదం లభించింది. ఈడబ్ల్యూఎస్‌కు ప్రత్యేక శాఖ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 7 మెగావాట్ల సౌర విద్యుత్‌ సరఫరాకు త్రైపాక్షిక ఒప్పందానికి కేబినెట్‌ ఆమోదించింది. బీసీ జనగణన జరపాలని అసెంబ్లీలో తీర్మానించే అంశానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 1947 తర్వాత కుల ప్రాతిపదికన జనగణన జరగలేదు. ఈ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని నిర్ణయం తీసుకున్నాం. వివిధ పథకాల్లో అనర్హులుగా ఉన్న వ్యక్తుల అర్జీలను పరిశీలిస్తున్నాం. జైనులు, సిక్కుల సంక్షేమ కార్పొరేషన్లు చేసేందుకు ఆలోచన చేస్తున్నాం. పాల నాణ్యత తనిఖీని పశుసంవర్థక శాఖకు అప్పగించాం. మావోయిస్టులు, అనుబంధ సంస్థలపై ఉన్న నిషేధాన్ని మరో ఏడాది పొడిగింపుపై ఆమోదం లభించింది. వైద్య, విద్య, కుటుంబ సంక్షేమ శాఖలో కొత్త ఉద్యోగాలకు ఆమోదం లభించింది. కొత్తగా 1,285 ఉద్యాగాల భర్తీకి మంత్రివర్గం అంగీకరించింది. అర్బన్‌ హెల్త్‌ క్లినిక్స్‌లో 560 ఫార్మాసిస్టులు, వైద్య కళాశాలల్లో 2,190 మంది నియామకానికి ఆమోదం లభించింది. ఇప్పటివరకు వైద్యారోగ్య శాఖలో 26,917 ఉద్యోగాలిచ్చాం’’ అని నాని తెలిపారు.

కేసీఆర్‌ పార్టీ పెట్టాలని కోరుకుంటున్నాం..

‘‘ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్ పార్టీ పెట్టాలని మేమూ  కోరుకుంటున్నాం. రెండు రాష్ట్రాలు కలిసిపోతే ఆయన భేషుగ్గా పోటీ చేయొచ్చు. ఏపీ, తెలంగాణ ఒకటే రాష్ట్రంగా ఉండాలని సీఎం జగన్ గతంలోనే కోరుకున్నారు. రెండు రాష్ట్రాలు కలిపేస్తే మంచిదే కదా’’ అని పేర్ని నాని పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు