చర్చలతో చైనా వైఖరిలో మార్పురాదు: అమెరికా

భారత్‌తో సరిహద్దులు పంచుకుంటున్న చైనా వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ)ను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించిందని అమెరికా స్పష్టం చేసింది. చైనాతో చర్చలు....

Updated : 27 Feb 2024 19:26 IST

అర్థం చేసుకోవాలని భారత్‌కు అగ్రరాజ్యం హితవు

వాషింగ్టన్‌: భారత్‌తో సరిహద్దులు పంచుకుంటున్న చైనా.. ఇరుదేశాల మధ్య ఉన్న వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ)ను ఏకపక్షంగా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తోందని అమెరికా స్పష్టం చేసింది. చైనాతో చర్చలు జరపడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని.. భారత్‌ ఇకనైనా అర్థం చేసుకోవాలని హితవు పలికింది. భారత్‌-చైనా మధ్య ఇటీవల నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్ని ఉద్దేశిస్తూ అగ్రరాజ్యం జాతీయ భద్రతా సలహాదారు(ఎన్‌ఎస్‌ఏ) రాబర్ట్‌ ఓబ్రియెన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ సహా తైవాన్‌ విషయంలోనూ చైనా కమ్యూనిస్టు పార్టీ(సీసీపీ) ప్రాదేశిక దురాక్రమణకు పాల్పడేందుకు కుట్రలు పన్నుతోందని తెలిపారు. 

‘వన్‌ బెల్ట్‌ వన్‌ రోడ్‌’(ఓబీఓఆర్‌) ప్రాజెక్టు వెనుక ఉన్న చైనా దురుద్దేశాన్ని ఓబ్రియెన్‌ ఈ సందర్భంగా ఎండగట్టారు. ఈ ప్రాజెక్టులో భాగమైన కంపెనీలు బలవంతంగా తమ నుంచి రుణాలు తీసుకునే పరిస్థితిని చైనా సృష్టిస్తుందని ఓబ్రియెన్‌ తెలిపారు. తిరిగి చైనా కంపెనీలు వాటిలో పనిచేసే కార్మికులకే ఆ సొమ్మును చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. పైగా ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించే మౌలిక సదుపాయాలు చైనాకు మాత్రమే లబ్ధి చేకూరుస్తాయన్నారు. దీంతో చైనా వద్ద అప్పులు చేసే దేశాలు దీర్ఘకాలంలో వాటి సార్వభౌమత్వాన్ని కోల్పోయే ప్రమాదం రావొచ్చని స్పష్టం చేశారు. చివరకు గత్యంతరం లేక సీసీపీ తీసుకునే దురుద్దేశపూరిత నిర్ణయాలకు తలొగ్గాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. 

అలాగే ఇతర దేశాలకు చైనా అందిస్తున్న సాంకేతిక, రక్షణపరమైన సహాయం వెనుక ఉన్న దురుద్దేశాన్ని ఓబ్రియెన్‌ వివరించారు. ట్రంప్‌ సర్కార్‌ చైనాకు కళ్లెం వేసేందుకు అనేక చర్యలు చేపట్టిందని తెలిపారు. అందులో భాగంగా ఆ దేశానికి చెందిన కంపెనీలపై ఆంక్షలు విధించిందని పేర్కొన్నారు. హువావే పరికరాల కొనుగోలుపై విధించిన నిషేధాన్ని ఉటంకించారు. అదే బాటలో భారత్‌కు చెందిన జియో సైతం 5జీ సాంకేతికతలో హువావే పరికరాల్ని పూర్తిగా నిషేధించిందని గుర్తుచేశారు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో చైనా దూకుడుకు కళ్లెం వేసేందుకు అక్కడి ప్రాంతీయ దేశాలతో వ్యూహాత్మక సంబంధాలు పెంపొందించుకుంటున్నట్లు తెలిపారు. అందులో భాగంగా భారత్‌తో ఏర్పడిన భాగస్వామ్యం 21వ శతాబ్దంలో అమెరికాకు అత్యంత కీలకమని స్పష్టం చేశారు. 

ఈ పరిణామాల నేపథ్యంలో చైనాతో చర్చలు జరపడం వల్ల సీసీపీ వైఖరిలో ఎలాంటి మార్పు ఉండదని ఇకనైనా గ్రహించాలని ఓబ్రియెన్‌ హితవు పలికారు. డ్రాగన్‌తో మెతక వైఖరి వల్ల ఉపయోగం శూన్యమని అభిప్రాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని