Jammu Kshmir: కశ్మీర్‌లో రెచ్చిపోతున్న మిలిటెంట్లు.. మరో ఇద్దరు పౌరుల హత్య!

కశ్మీర్‌ లోయలో మిలిటెంట్లు రెచ్చిపోతున్నారు. శనివారం మరో ఇద్దరిని పొట్టనబెట్టుకున్నారు. శ్రీనగర్‌లో ఓ వీధి వ్యాపారిని, పుల్వామా జిల్లాలో ఓ కార్పెంటర్‌ని......

Updated : 22 Aug 2022 16:53 IST

శ్రీనగర్‌: కశ్మీర్‌ లోయలో మిలిటెంట్లు రెచ్చిపోతున్నారు. శనివారం మరో ఇద్దరిని పొట్టనబెట్టుకున్నారు. శ్రీనగర్‌లో ఓ వీధి వ్యాపారిని, పుల్వామా జిల్లాలో ఓ కార్పెంటర్‌ని కాల్చి చంపారు. కశ్మీర్‌వ్యాప్తంగా ఉగ్రవాదులు ఆరు రోజుల వ్యవధిలో ఏడుగురు పౌరులను చంపిన వ్యవహారం మరువకముందే తాజాగా మరో రెండు హత్యలు జరగడం కలవరపెడుతోంది. మరోవైపు పోలీసులు.. ఘటనా స్థలాల్లో ముమ్మర తనిఖీలు కొనసాగిస్తున్నారు. 

ఒకరు బిహార్‌, మరొకరు యూపీ వాసి..

శ్రీనగర్‌లో మృతి చెందిన వ్యక్తిని బిహార్‌కు చెందిన అర్వింద్‌ కుమార్‌(37)గా పోలీసులు గుర్తించారు. అక్కడి ఈద్గా ప్రాంతంలో శనివారం సాయంత్రం ఈ దాడి జరిగింది. బాధితుడిని వెంటనే స్థానిక శ్రీనగర్‌ ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఇటీవల ఓ స్కూల్‌ ప్రిన్సిపల్‌, ఉపాధ్యాయుడిని కూడా ఇదే ప్రాంతంలో కాల్చి చంపడం గమనార్హం. మరోవైపు పుల్వామా జిల్లాలో జరిగిన దాడిలో యూపీకి చెందిన కార్పెంటర్‌ సాగిర్‌ అహ్మద్‌ మృతిచెందినట్టు  పోలీసులు ధ్రువీకరించారు. జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, ఒమర్‌ అబ్దుల్లా ఈ హత్యలను తీవ్రంగా ఖండించారు. 

భద్రతాదళాల తనిఖీలు ముమ్మరం.. 

కశ్మీర్‌లో కొన్నాళ్లుగా వరుస పౌర హత్యల నేపథ్యంలో దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమైన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు, కేంద్ర బలగాలు లోయలో సంఘ విద్రోహ కార్యకలాపాల కట్టడికి భారీ ఎత్తున తనిఖీలు చేపడుతున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీంతోపాటు వారం వ్యవధిలో తొమ్మిది ఎన్‌కౌంటర్లలో మొత్తం 13 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని